ఇటు టీడీపీని టార్గెట్- అటు తానే టార్గెట్- జగన్ సర్కారుకు విచిత్రమైన పరిస్ధితి...
ఏపీలో అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకుంటున్న వేళ జగన్ సర్కార్ ఓ విచిత్రమైన పరిస్ధితి ఎదుర్కొంటోంది. ఓవైపు అసలే బలహీనంగా ఉన్న విపక్ష టీడీపీ నుంచి మిగిలిన ఎమ్మెల్యేలను కూడా తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్న వైసీపీకి ఇప్పుడు మరో రూపంలో ఆ లోటు తీరిపోయేలా కనిపిస్తోంది. ఇప్పటికే ఆ ప్రభావం తీవ్రంగా కనిపిస్తున్నా జగన్ సర్కారు ఏమీ చేయలేని పరిస్ధితి. అయితే టీడీపీకి బదులుగా వైసీపీకి విపక్షంలా కనిపిస్తోంది ఎవరు ?
వైసీపీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోనున్న వైఎస్ జగన్?: ఆ స్థానంలో ఆ సలహాదారు: పార్టీలో జోరుగా
ఏడాది పాలన వేళ వార్ వన్ సైడే....
ఏపీలో వైసీపీ సర్కారు అఖండ విజయంతో అధికారం చేపట్టి ఈ నెల 30వ తేదీకి ఏడాది పూర్తవుతోంది. 175 సీట్లున్న అసెంబ్లీలో ఏకంగా్ 151 సీట్లను గెల్చుకోవడం ద్వారా దాదాపుగా విపక్షాన్ని ఊడ్చేసిన వైసీపీ సర్కారు... ఏడాదిగా ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలకు మరింత దగ్గరైంది. అయితే విపక్ష టీడీపీ నుంచి అక్కడక్కడా ఎదురవుతున్న ప్రతిఘటన, టీడీపీకి అనుకూలంగా ఉన్న మీడియా సంస్ధల నుంచి ఎదురవుతున్న సవాళ్లు వైసీపీని పలు సందర్భాల్లో ఆత్మరక్షణలోకి నెడుతున్నాయి.
మరోసారి ఆపరేషన్ ఆకర్ష్..
విపక్ష టీడీపీని పూర్తిగా బలహీనం చేసేందుకు ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తున్న సీఎం జగన్.. తాజాగా మరోసారి ఆపరేషన్ ఆకర్ష్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. రేపో మాపో ఏడుగురు ఎమ్మెల్యేలు టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించే అవకాశాలున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామాతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న టీడీపీ ఈసారి ప్రధాన విపక్ష హోదా కూడా కోల్పోతుంది. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోయి కేవలం సీనియర్ ఎమ్మెల్యేగానే మిగులుతారు.
టీడీపీకి బదులుగా మరో ముప్పు ?
ఏపీలో టీడీపీ అంతకంతకూ బలహీనమవుతున్నా, మిగతా ఎమ్మెల్యేలను ఆకర్షించడం ద్వారా టీడీపీ దుకాణానికి పూర్తిగా మూతేయాలన్న ఏకైక కాంక్షతో జగన్ ముందుకెళ్తున్నా... ఆయన సంతృప్తిగా కనిపించడం లేదు. దీనికి కారణం టీడీపీతో పాటు ఇతర విపక్షాల కంటే ఇప్పుడు హైకోర్టు నుంచే ఆయనకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాదాపు 60కి పైగా కేసుల్లో హైకోర్టు ఇచ్చిన తీర్పులు వైసీపీకి సర్కారును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తాజాగా ఒకే రోజు మూడేసి కేసుల్లో హైకోర్టు ఇస్తున్న తీర్పులు కానీ, చేస్తున్న వ్యాఖ్యలు కానీ జగన్ సర్కారుకు చుక్కలు చూపిస్తున్నాయి.
Recommended Video
తన్నుకొస్తున్న అసహనం
విపక్షాల విమర్శలను లెక్క చేయకుండా ముందుకెళ్తున్న వైసీపీ ప్రభుత్వానికి హైకోర్టు తీర్పులు, వ్యాఖ్యల రూపంలో ఎదురవుతున్న ప్రతిఘటనతో ఏమీ మాట్లాడలేని పరిస్ధితి. హైకోర్టు తాజా తీర్పులపై ప్రభుత్వ పెద్దల నుంచి ఎలాంటి స్పందన వ్యక్తం కాకపోయినా ఎంపీలు, ఇతర నేతలు మాత్రం తమ అసహనాన్ని వివిధ రూపాల్లో బయటపెడుతున్నారు. తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పులపై జడ్జిలను కించపరుస్తూ కోర్టు ధిక్కార వ్యాఖ్యలు చేశారంటూ జారీ అయిన నోటీసులు వీటి ఫలితమే. ప్రజాస్వామ్యం మూలస్తంభాల్లో కార్వనిర్వాహక, శాసన వ్యవస్ధలతో పాటు న్యాయవ్యవస్ద కూడా ఉంటుంది. అయితే దానికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వక తప్పని పరిస్ధితుల్లో టీడీపీ కంటే ఇప్పుడు వైసీపీకి హైకోర్టే ప్రత్యర్ధిగా కనిపించడం కాకతాళీయమే అనుకోక తప్పదు.