ఇక పాలన విశాఖ నుంచే...జగన్ కొత్త ఎత్తుగడలు: మంత్రులు అక్కడికే ఎప్పటి నుంచంటే..?
అమరావతి: విశాఖ నుంచి పూర్తిస్థాయిలో పాలన ప్రారంభించాలనేది సీఎం జగన్ బలమైన కోరికగా ఉన్న మాట నిజమే. అయితే ఇందుకు ఎన్నో అడ్డంకులు అవాంతరాలు ఎదురయ్యాయి. అమరావతి నుంచి విశాఖకు రాజధాని తరలించేందుకు ప్రభుత్వం డిసైడ్ అయిన నేపథ్యంలో అదే విషయమై హైకోర్టులో పిటిషన్లు దాఖలుకాగా దీనిపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ప్రతిపక్షాలు ఊపిరిపీల్చుకున్నాయి. అమరావతి రాజధానిగా ఉండగా విశాఖపట్నంకు తరలించడాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు కూడా నిరసనలు వ్యక్తం చేశారు. అదే సమయంలో హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఇక రాజధాని తరలింపునకు న్యాయపరమైన చిక్కులు ఏర్పడటంతో జగన్ ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు వచ్చే కేబినెట్లో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
Breaking:ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్..అమిత్ షాతో భేటీ: ఏం జరగబోతోంది..?
కేబినెట్ సమావేశాలు విశాఖ నుంచే....
ఏపీ రాజధాని తరలింపు వ్యవహారంపై ఇటు రాజకీయంగాను అటు న్యాయపరమైన చిక్కులు తలెత్తడంతో ప్రస్తుతానికి రాజధాని తరలింపు ఆలోచనలను ప్రభుత్వం పక్కనపెట్టింది. అయితే విశాఖ నుంచే పాలన చేయాలన్న జగన్ యోచన మాత్రం అలాగే బలంగా ఉండిపోయింది. ఇందుకోసమే సరికొత్త ఎత్తుగడలతో జగన్ ప్రభుత్వం వచ్చినట్లు సమాచారం. ఇక అమరావతిలో ఈ నెల 5వ తేదీన జరగబోయే కేబినెట్ సమావేశం అక్కడ చివరి సమావేశం అవుతుందని సమాచారం. ఇకపై కేబినెట్ సమావేశాలన్నీ విశాఖలోనే జరుగుతాయని తెలుస్తోంది. ఇదే విషయాన్ని అమరావతిలో జరగబోయే కేబినెట్ సమావేశంలో సీఎం జగన్ మంత్రులకు చెప్పనున్నట్లు తెలుస్తోంది. అంటే ఇకపై జరగబోయే అన్ని కేబినెట్ సమావేశాలు విశాఖలోనే ఉంటాయని తద్వారా తరచూ విశాఖ పర్యటన చేయాలనే యోచనలో సీఎం జగన్ ఉన్నట్లు సమాచారం.
కేబినెట్ సమావేశాలు ఎక్కడైనా నిర్వహించుకోవచ్చు
కేబినెట్ సమావేశాలను విశాఖలోనే నిర్వహించేందుకు ఎలాంటి అభ్యంతరాలు లేదా అడ్డంకులు ఉండబోవని నిపుణులు చెబుతున్నారు. కేబినెట్ సమావేశాలు ఎక్కడైనా నిర్వహించుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ప్రతీ కేబినెట్ సమావేశం విశాఖలోనే నిర్వహించి పరోక్షంగా అక్కడ నుంచే పాలన ప్రారంభించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. అందుకే సీఎం కోసం ప్రత్యేకంగా క్యాంపు కార్యాలయం సైతం ఏర్పాటు చేయాలనే భావనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. గత డిసెంబర్ నెల నుంచే విశాఖ రాజధాని అవుతుందంటూ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అంతేకాదు పలుమార్లు రాజధాని అమరావతి నుంచి తరలివెళుతోందని ఇందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యిందని వార్తలు వచ్చాయి. అధికారికంగా రాజధాని తరలింపునకు కోర్టు బ్రేక్ వేయడంతో ప్రత్యామ్నాయ మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తోంది.
Recommended Video
గతంలో రాజమండ్రిలో భేటీ అయిన చంద్రబాబు కేబినెట్
ఇక చంద్రబాబు హయాంలో కూడా ఆయన తన కేబినెట్ సమావేశాలను పుష్కరసమయంలో రాజమండ్రిలో నిర్వహించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు విశ్లేషకులు. అంతేకాదు విశాఖలోను కేబినెట్ సమావేశాలను చంద్రబాబు నిర్వహించారు. ఇప్పుడు జగన్ కూడా విశాఖలో కేబినెట్ సమావేశాలు నిర్వహించి అక్కడే అన్ని నిర్ణయాలు చేయాలని భావిస్తున్నారు. అంటే పరోక్షంగా విశాఖ నుంచే పాలన చేసేందుకు ప్రభుత్వం పావులు కదుపుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేబినెట్ సమావేశాలు విశాఖలో నిర్వహించడం, విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నా కోర్టులు జోక్యం చేసుకోవని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక విశాఖలో సీఎం క్యాంపు ఆఫీసు కూడా ఏర్పాటు చేస్తే జగన్ వీలైనన్ని ఎక్కువ రోజులు అక్కడే బసచేసే అవకాశాలున్నాయని కూడా సమాచారం. దీంతో విశాఖనే రాజధాని అనే సంకేతాలు పరోక్షంగా పంపే అవకాశాలున్నాయి.