పత్తిపాటిపై శివాజీ ఫైర్, 'రూ.10వేల కోట్ల నల్లధనంపై జగన్ ఏమంటారు '
అమరావతి: పత్తిపాటి పుల్లారావు మంత్రి పదవికి అనర్హులు అని కృష్ణా డెల్టా పరిరక్షణ సమితి నేత కొలనుకొండ శివాజీ మండిపడ్డారు. నకిలీ విత్తనాలు రైతుల కొంపలు ముంచుతుంటే ప్రభుత్వం చోద్యం చూడటం విడ్డూరమన్నారు.
దగాకోరు విత్తన కంపెనీలతో వ్యవసాయ శాఖ అధికారులు, ప్రభుత్వ పెద్దలు కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు. వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆ పదవికి అనర్హులు అన్నారు. ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కమిటీలతో కాలయాపన చేయకుండా నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన మిర్చి, పత్తి రైతులకు ఎకరాకు రూ.లక్ష చొప్పున నష్ట పరిహారం చెల్లించాలన్నారు. సిటడ్ ద్వారా దర్యాఫ్తు చేయించి దోషులను కఠినంగా శిక్షించాలన్నారు.
అక్రమాస్తులపై జగన్ సమాధానం చెప్పాలి: దేవినేని
నల్లధనం, అక్రమాస్తులపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ ప్రజలకు సమాధానం చెప్పాలని మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు గురువారం డిమాండ్ చేశారు. రూ.10వేల కోట్ల నల్లధనాన్ని తెల్లధనంగా మార్చారని వస్తున్న ఆరోపణలకు జగన్ ఏమంటారన్నారు.
అక్రమాస్తులకు సంబంధించి 12 సీబీఐ, ఈడీ కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్... నీతి, నిజాయతీల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేలాది కోట్ల ప్రజాధనాన్ని దిగమించిన జగన్ లాంటి నేత దేశంలో ఎక్కడా లేరన్నారు.