జగన్ ధైర్యం పవన్ కళ్యాణ్! వైసీపీ-టీడీపీ సర్వేలో జనసేనకు ఎన్ని సీట్లు వస్తాయో తెలిసింది!!
అమరావతి: 2019 సార్వత్రిక ఎన్నికల్లో తాము అధికార (టీడీపీ), ప్రతిపక్షం (వైయస్సార్ కాంగ్రెస్) వంటి ప్రధాన పార్టీలతో పొత్తు పెట్టుకునేది లేదని, వామపక్షాలతో కలిసి పోటీ చేస్తామని, జనసేన 175 స్థానాల్లో పోటీ చేస్తుందని జనసేనాని పవన్ కళ్యాణ్ గురువారం స్పష్టం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యల నేపథ్యంలో రెండు రోజులుగా జరుగుతున్న చర్చకు పవన్ ముగింపు పలికారు.
పవన్తో కలిసి పోటీ చేస్తే తప్పేమిటని, ఆయన తమ కూటమిలోకి రావాలని చంద్రబాబు ఆహ్వానం పలికారు. గురువారం నాటి వ్యాఖ్యల ద్వారా తాను మీతో కలిసేది లేదని ముఖ్యమంత్రికి తేల్చి చెప్పారు. తాను ఒంటరిగానే ఉంటానని స్పష్టం చేశారు. ఇక, జాతీయ రాజకీయాల ఫ్రంట్లపై ఆయన మాట్లాడలేదు.
ఊపిరితీసుకున్న వైసీపీ
2014లో టీడీపీ, బీజేపీ కూటమికి జనసేన అండగా నిలబడటం వైసీపీ అధినేత జగన్కు నష్టం కలిగించింది. పవన్ కళ్యాణ్ టీడీపీకి ప్రచారం చేయడం వల్ల వైసీపీకి అధికారం దూరమైందని కూడా చెప్పేవాళ్లు ఉన్నారు. ప్రారంభంలో టీడీపీ నేతలు అదే చెప్పారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా పవన్ కలవడం, మోడీ హవా వల్లే చంద్రబాబు అధికారంలోకి వచ్చారని చెప్పారు. తాజాగా, చంద్రబాబు వ్యాఖ్యలతో పవన్ మళ్లీ టీడీపీతో కలిసి వెళ్తారా అని రాజకీయ వర్గాల్లో చర్చ ప్రారంభమైంది. అదే జరిగితే వైసీపీకి నష్టమని చాలామంది భావించారు. కానీ పవన్ కళ్యాణ్ తాము వారితో కలిసేది లేదని తేల్చి చెప్పారు. ఇది వైసీపీకి ఊపిరి తీసుకునే ప్రకటన అంటున్నారు. ఎవరు కలిసినా గెలుస్తామనే ధీమా ఉన్నప్పటికీ, కాస్త అటు ఇటు అయితే అధికారం దూరం అవుతుంది. కాబట్టి ఇది వైసీపీకి ఊరటను కలిగించే ప్రకటన.
చంద్రబాబుకు దెబ్బపడింది! కేసీఆర్ కూటమి ఉన్న విషయమే తెలియదు: నరేంద్ర మోడీ
జగన్ లెక్కలు
పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేస్తే 2014లోని ఓటు బ్యాంకు చీలిపోయి తమకు లాభిస్తుందని వైయస్ జగన్ కూడా లెక్కలు వేసుకుంటున్నారట. పవన్ తమతో రావడం విషయం పక్కన పెడితే, టీడీపీతో కలిసి వెళ్లకపోవడం మాత్రం ఊరట కలిగించేదని భావిస్తున్నారట.
ఆ క్రెడిట్ పంచే ఉద్దేశ్యం లేదు
చంద్రబాబు ప్రభుత్వంపై ఉన్న ఆగ్రహంతో ఈసారి ప్రజలు తమకు ఓటు వేస్తారని జగన్ గట్టి విశ్వాసంతో ఉన్నారట. కాబట్టి జనసేన, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీల పొత్తుపై జగన్ కూడా ఆలోచన చేయడం లేదట. జనసేనతో కలిసి పోటీ చేసి, గెలిచాక.. గెలుపు క్రెడిట్ పవన్కు పంచడం ఆయనకు ఇష్టం లేదట.
పవన్ కళ్యాణ్ ఒంటరి పోరు వల్ల ఎవరికి నష్టమంటే?
అదే సమయంలో ఒంటరిగా పోటీ చేస్తున్నందుకు వైసీపీ సంబరపడుతోందట. గతంలో తమకు ఓట్లు వేసిన వారికి తోడు ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నవారు తమ వైపు మరలుతారని, పవన్ ఒంటరిగా పోటీ చేస్తే, నాటి అధికార పార్టీ అనుకూల ఓట్లు చీలుతాయని భావిస్తున్నారు. పవన్ ఒంటరి పోరు వల్ల టీడీపీకి నష్టం జరుగుతుందని చెబుతున్నారు. అది వైసీపీ అధికారంలోకి రావడానికి మరింత ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఒంటరి పోరు చేస్తున్న పవన్కు వైసీపీ థ్యాంక్స్ చెప్పాలని అంటున్నారు.
వైసీపీ, టీడీపీ చేసిన సర్వేలో జనసేనకు ఎన్ని సీట్లు అంటే
టీడీపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఏపీలో సర్వేలు చేయగా, జనసేనకు 15 సీట్లు వస్తాయని తేలిందని తెలుస్తోంది. అలాగే 5 శాతం నుంచి 25 శాతం ఓట్లు వస్తాయని తేలిందట. ఇది టీడీపీకి పడే దెబ్బ అంటున్నారు. పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గం నేత. ఆయన కులానికి దూరంగా ఉన్నప్పటికీ, 2014లో ఆయనను చూసే ఓటు వేశారు. ఇప్పుడు వారి ఓట్లు జనసేనకు పడితే టీడీపీకే నష్టం. ఇది గమనించే చంద్రబాబు మళ్లీ యూటర్న్ తీసుకున్నారని చెబుతున్నారు.