వైఎస్ఆర్ బాటలోనే సీఎం జగన్..!‘రచ్చబండ’మళ్లీ నిర్వహించాలని నిర్ణయం..!!
అమరావతి/హైదరాబాద్ : 'రచ్చబండ' కార్యక్రమం అనగానే.. అందరికీ టక్కున గుర్తుకొచ్చేది దివంగత ముఖ్యమత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరే. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో వైఎస్సార్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కార్యక్రమాల్లో 'రచ్చబండ' కూడా ఒకటి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బాటలోనే.. ఆయన తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నడుస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని తాను కూడా త్వరలోనే ప్రారంభిస్తున్నట్లు వైఎస్ జగన్ ప్రకటించారు. సోమవారం నాడు కలెక్టర్లతో జరిగిన సదస్సులో సీఎం ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రజల దగ్గరకు వెళ్తానని ఈ సందర్భంగా జగన్ తెలిపారు.
సోమవారం మీటింగ్లొద్దు..! కార్యాలయాల్లో ఫిర్యాదులు పరిష్కరించాలని సూచన..!!
ఈ సందర్భంగా కలెక్టర్లు, అధికారులకు వైఎస్ జగన్ పలు సలహాలు, సూచనలు చేశారు. ప్రతి సోమవారం ప్రభుత్వ కార్యాలయాల్లో గ్రీవెన్స్ డే జరపాలన్నారు. స్పందన పేరుతో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించాలని.. సోమవారం రోజు ఎలాంటి మీటింగ్లు పెట్టుకోవద్దని సూచించారు. గ్రీవెన్స్సెల్కు ఎవరొచ్చినా ఒక రిసిఫ్ట్ ఇవ్వండి, ఫోన్ నెంబర్ తీసుకోవాలని.. మీ సమస్యను ఇన్నిరోజుల్లో పరిష్కరిస్తానని చెప్పాలన్నారు. వారానికి ఒక్కరోజు గ్రామాల్లో రాత్రి బస చేయాలన్నారు. రెండేళ్లలో ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మారాలన్నారు. విద్య, వైద్యం, రైతులే మా ప్రధాన అజెండా అని సీఎం జగన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
Recommended Video
సొంతిల్లు లేనివారికి శుభవార్త చెప్పిన వైఎస్ జగన్..! అందరకి మేలు జరుగుతుందని ప్రకటన..!!
ఆంధ్రప్రదేశ్లో సొంతిల్లు లేని వారికి సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి శుభవార్త చెప్పారు. సోమవారం ఉదయం ప్రజావేదికలో జరిగిన కలెక్టర్ల సదస్సు వేదికగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ఇంటిస్థలం లేనివారు ఈ రాష్ట్రంలో ఎవరూ ఉండకూడదన్నారు. ఈ ఉగాదికి 25లక్షల ఇంటి స్థలాలు మహిళల పేరుతో రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామన్నారు. నిజమైన లబ్దిదారులను అధికారులు గుర్తించాలని.. పట్టాలు ఇచ్చేటప్పుడు ప్లాటు ఎక్కడుందో చూపించాలన్నారు. ఇందుకు గాను ఒక డిస్ట్రిక్ పోర్టల్ను ప్రారంభించాలని.. ప్రతి ఒక్క అంశాన్ని ఆ పోర్టల్లో పొందుపర్చాలని వైఎస్ జగన్ ఈ సందర్భంగా సూచించారు.
కష్టించి పని చేయడంలోభేదాభిప్రాయాలొద్దు..! అందరూ సమానమేనన్న జగన్..!!
మనం పాలకులం కాదు.. సేవకులమని గుర్తు పెట్టుకోవాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి సూచించారు. సోమవారం ఉదయం ఉండవల్లిలోని ప్రజావేదికలో కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. సదస్సు నవరత్నాల అమలే ప్రధాన అజెండాగా జరగబోతోంది. కాగా సదస్సు ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కాగానే కలెక్టర్లు, ఉన్నతాధికారులనుద్దేశించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రసంగించారు. నవరత్నాల అమలులో ఎలాంటి భేదాభిప్రాయం చూడొద్దని.. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ నవరత్నాల లబ్ది చేకూరాలన్నారు. మనకు ఓటేయనివారికి కూడా పథకాలు చేరువ కావాలని.. ఎన్నికలు అయ్యేవరకే రాజకీయాలు ఎన్నికల తర్వాత అందరూ సమానమే జగన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలకులు పనిచేయాలని సూచించారు. ప్రజా పాలకులం అన్న విషయం గుర్తెరగాలన్నారు. మేనిఫెస్టోను పవిత్రగ్రంథంలా భావించాలన్నారు.
అవినీతిని, దోపిడీని సహించేది లేదు..! అదికారులు అప్రమత్తంగా ఉండాలన్న ఏపి సీఎం..!!
"మంత్రులు, అధికారులందరూ మేనిఫెస్టోను దగ్గర పెట్టుకోవాలి. నవరత్నాల అమలే ప్రధాన అజెండాగా పనిచేయాలి. మనం పాలకులం కాదు... సేవకులం అని గుర్తు పెట్టుకోవాలి. ప్రభుత్వంలో అందరూ భాగస్వాములే. మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్ని నెరవేర్చి.. ఎన్నికలకు వెళ్లాలి. మేనిఫెస్టోను నమ్మి ప్రజలు ఓట్లేశారన్నది నేతలు మరచిపోవద్దు. మనందరం ప్రజాస్వామ్యంలో ఉన్నామన్నది మర్చిపోవద్దు. ఎమ్మెల్యేలను, ప్రజలను అధికారులు గౌరవించాలి. అవినీతిరహిత పాలనే మా ప్రభుత్వ లక్ష్యం. అవినీతిని, దోపిడీని సహించేది లేదు" అని వైఎస్ జగన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. "ప్రజాస్వామ్యానికి ఎమ్మెల్యేలు, అధికారులు రెండు కళ్లు. అవినీతికి పాల్పడితే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదు. పేద వర్గాల స్థితిగతులను మనం ఎప్పుడూ మర్చిపోవద్దు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు చేరువకావాలి. అణగారినవర్గాలు ఆర్థికంగా బలపడేలా మన అడుగులు పడాలి. మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశం అణగారినవర్గాల బాగుకోసమే. అవినీతి, అక్రమాల కోసం ఎవరొచ్చినా తిరస్కరించాలి. ఎమ్మెల్యేలు అక్రమాలకు గానీ, దోపిడీలకు గానీ పాల్పడితే ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ అండగా ఉండదు. ఎంతటి పెద్దవాడైనా గానీ, ఏ స్థాయిలో అయినా ఉండనీ ప్రభుత్వం ఉపేక్షించదు" అని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.