ఏపీకి రండి..అండగా నిలవండి: పోలవరంలో సొమ్ము ఆదా ఇలా: ప్రధానితో జగన్ సుదీర్ఘ భేటీ..!
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రధాని మోదీతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. దాదాపు గంటన్నార సేపు వారిద్దరూ సమావేశమయ్యారు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయాలని చూస్తున్న రైతు భరోసా పథకం కార్యక్రమం ప్రారంభోత్సవంలో పాల్గొనాలని ముఖ్యమంత్రి ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటుగా కేంద్ర నిధులు సైతం ఈ పధకంలో ఉండటంతో ఏపీకి రావాలని కోరారు. ప్రధాని సైతం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. అదే విధంగా పోలవరం రివర్స్ టెండరింగ్ ద్వారా ఏ మొత్తం లో ప్రజా సొమ్ము ఆదా చేయగలిగిందీ జగన్ వివరించారు. ఏపీని ఆర్దికంగా ఆదుకోవాలని సీఎం జగన్ అభ్యర్దించారు. రాజధాని నిర్మాణానికి నిధులతో పాటుగా..వెనుక బడిన జిల్లాల కోసం ప్రత్యేకంగా నిధులను విడుదల చేయాలని ఈ భేటీలో ప్రధానిని కోరారు. ప్రధానితో భేటీ ముగిసిన వెంటనే ముఖ్యమంత్రి అమరావతికి తిరుగు పయణమయ్యారు.
జగన్ ప్రమాణ స్వీకారోత్సవ ఖర్చు రూ.29లక్షలు కాదా?: రూ. 5కోట్లా, మధ్యలో 'సాక్షి’అంటూ టీడీపీ
ఏపిక రండి..రైతు భరోసా ప్రారంభించండి..
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. తాను ముఖ్యమంత్రి అయిన తరువాత ఏపీలో ప్రధాని అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనలేదని..ప్రభుత్వం ఈ నెల 15న ప్రారంభించాలని నిర్ణయించిన రైతు భరోసా పధకాన్ని ప్రారంభించాలని ముఖ్యమంత్రి జగన్ ప్రధానిని కోరారు. నెల్లూరు లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని..దీని ద్వారా దాదాపు 54 లక్షల మందికి ఏటా రూ. 12,500 చొప్పున అందిస్తున్నామని వివరించారు. అందులో కేంద్ర వాటా సైతం ఉండటంతో దీనిని ప్రారంభించేందుకు రావాలని ఆహ్వానించారు. దీనికి ప్రధాని సైతం అంగీకరించినట్లుగా తెలుస్తోంది.
పోలవరం లో ఇలా ఆదా చేసాం..
ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న రివర్స్ టెండరింగ్ ద్వారా పోలవరంలో దాదాపు రూ. 900 కోట్ల మేర ప్రజాధనం ఆదా అయిందని ముఖ్యమంత్రి..ప్రధానికి వివరించారు. గత ప్రభుత్వంలో జరిగిన దోపిడీని అరి కట్టే చర్యలు తీసుకుంటున్నామని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం ఆర్దికంగా తీసుకున్న అస్తవ్యస్త నిర్ణయాల కారణంగా భారీగా ఆర్దిక నష్టాల్లో ఉన్నామని..ఏపీకి అండగా నిలవాలని మరోసారి ముఖ్యమంత్రి ప్రధాని ని అభ్యర్దించారు. వెనుక బడిన జిల్లాల కోసం ప్రత్యేకంగా నిధులు ఇవ్వాలని కోరారు. తెలంగాణ ముఖ్యమంత్రితో కలిసి నదుల అనుసంధానం పైన చేస్తున్న చర్చల సారాంశాన్ని జగన్ వివరించినట్లుగా సమాచారం. ఇక, రాజధాని నిర్మాణానికి సైతం నిధులు మంజూరు చేయాలని జగన్ ప్రధానిని కోరారు. ప్రధాని సైతం తాము అండగా నిలుస్తామంటూ హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
పీపీఏల వివాదంపై ప్రత్యేక నోట్
ముఖ్యమంత్రి జగన్ ఏపీలో విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల సమీక్ష పైన జరుగుతున్న వివాదాల గురించి ముఖ్యమంత్రి జగన్ నేరుగా ప్రధాని మోదీకి ఒక నోట్ సమర్పించినట్లు తెలుస్తోంది. ఇందులో తాము అన్ని ఒప్పందాలను తప్పు బట్టటం లేదని చెబుతూనే.. గత ప్రభుత్వం కొన్ని సంస్థలకు ప్రత్యేకంగా ప్రయోజనం కలిగించేందుకు చేసిన నిర్ణయాల పైనే ఫోకస్ చేసామని చెప్పుకొచ్చినట్లు సమాచారం. ఏపీలో విద్యుత్ సంస్థలు ఇప్పటికే 20 వేల కోట్ల నష్టాల్లో ఉన్నాయని...అదే విధంగా ప్రస్తుతం బొగ్గు సమస్య కారణంగా విద్యుత్ సమస్య సైతం ఏర్పడిందని చెబుతూ..తీసుకుంటున్న చర్యలను జగన్ వివరించారని తెలుస్తోంది. రాష్ట్రంలో నెలకొన్ని సమస్యల పైన ముఖ్యమంత్రి సుదీర్ఘంగా ప్రధానికి వివరించినట్లు సమాచారం.