కడప జిల్లాలో ఆప్తులను కాదని ప్రత్యర్ధులకు రెడ్ కార్పెట్ ! జగన్ తప్పు చేస్తున్నారా ?
స్ధానిక సంస్ధల ఎన్నికల్లో కడప జిల్లాలో ఎలాగైనా సత్తా చాటాలన్న లక్ష్యంతో ఉన్న సీఎం జగన్ అందివచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదు. తాజాగా టీడీపీకి చెందిన ప్రత్యర్ధి నేతలు రామసుబ్బారెడ్డి, సతీష్ రెడ్డిని వైసీపీలోకి తీసుకునేందుకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలో వీరిద్దరూ జగన్ సమక్షంలో వైసీపీలో చేరబోతున్నారు.
కడప రాజకీయాల్లో వైవిధ్యం
రాష్ట్రంలో మిగిలిన జిల్లాలతో పోలిస్తే కడప రాజకీయాలు చాలా భిన్నంగా ఉంటాయి. ముఖ్యంగా రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కడప జిల్లాలో మాత్రం వైఎస్ కుటుంబం ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకే అక్కడి ప్రజలు జై కొడతారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ రాజకీయానికీ ఇప్పటికీ తిరుగులేదు. అయితే వైఎస్ తండ్రి రాజారెడ్డి హత్యకు కారకుడిగా ఆరోపణలు ఎదుర్కొన్న పులివెందుల టీడీపీ నేత సతీష్ రెడ్డి, జిల్లాలో తమ కుటుంబానికి ఎప్పటినుంచో ప్రత్యర్ధిగా ఉన్న రామసుబ్బారెడ్డి విషయంలో కానీ వైఎస్ కుటుంబంతో పాటు ఆయనకు అండగా ఉన్న వారిలోనూ మరో అభిప్రాయం లేదు. అయితే ఓ దశలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా అసెంబ్లీలో మాట్లాడుతూ తన తండ్రి హంతకులు కడపలో రోడ్లపై తిరుగుతున్నా తాను పట్టించుకోలేదని చెప్పుకున్నారు. అంటే తనకు వ్యతిరేకత ఉన్నా వారి విషయంలో తాను దూకుడుగా వెళ్లలేదని దానర్ధం.
ప్రత్యర్ధుల విషయంలో జగన్..
అయితే తన తండ్రి రాజశేఖర్ రెడ్డి కంటే తన తాత రాజారెడ్డి మనస్తత్వాన్ని పుణికిపుచ్చుకున్నాడని ప్రత్యర్ధులు ఆరోపించే వైఎస్ జగన్ ఇప్పుడు ఏం చేస్తున్నారు. తన తాత రాజారెడ్డి హంతకులుగా జిల్లాలో ముద్ర పడ్డ వారిని, జిల్లాలో వైఎస్ కుటుంబానికి వ్యతిరేకంగా దశాబ్దాలుగా పోరాడిన వారిని పార్టీలోకి తీసుకునేందుకు సిద్దమైపోతున్నారు. వాస్తవానికి ప్రత్యర్ధుల విషయంలో చాలా కరకుగా వ్యవహరిస్తారని జగన్ కు పేరుంది. ప్రతిపక్ష చంద్రబాబుతో పాటు ఇతర ప్రత్యర్ది నేతల విషయంలో జగన్ వ్యవహారశైలే ఇందుకు నిదర్శనం. కానీ జగన్ ఇప్పుడు సొంత జిల్లాలో ప్రత్యర్ది నేతలను ఎందుకు చేరదీయాలనుకుంటున్నారన్నది ప్రశ్నార్దకంగా మారింది.
రామసుబ్బారెడ్డి, సతీష్ రెడ్డి రాకతో..
కడప జిల్లాలో టీడీపీ గురించి ఇంకా మనం మాట్లాడుకుంటున్నామంటే కారకుల్లో ఇద్దరు రామసుబ్బారెడ్డి, సతీష్ రెడ్డి. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ అయిన రామసుబ్బారెడ్డి ఇన్నాళ్లూ వైఎస్ కుటుంబం రాజకీయాన్ని ఎదుర్కొంటూ జిల్లాలో తన ప్రభావం చూపారు. అలాగే సతీష్ రెడ్డి కూడా వైఎస్ కుటుంబంపై పోటీ చేసేందుకు అభ్యర్ధులు కరవైన పరిస్ధితుల్లో ముందుండి నడిపించారు. అలా వీరిద్దరికీ వైఎస్ కుటుంబంతో ఢీ అంటే ఢీ అన్న అనుభవం ఉంది. అయితే ఎప్పుడూ వైఎస్ కుటుంబం పేరు చెబితేనే అంతెత్తున లేచే వీరిద్దరూ ఈసారి వైసీపీ అధికారం చేపట్టాక ఎందుకో సైలెంట్ అయిపోయారు. జగన్ దూకుడుతో పాటు జిల్లాలో పార్టీ ఘోరపరాజయం తర్వాత ఏం మాట్లాడితే ఏమవుతుందో అన్న అవుతామన్న భావన ఇందుకు కారణం.
Recommended Video
ఆప్తులను కాదని ప్రత్యర్ధులను చేరదీయడంపై..
ఇన్నాళ్లుగా జిల్లాలో వైఎస్ కుటుంబానికి అండగా నిలబడిన వారితో పాటు బలమైన సామాజికవర్గం ఆసరా కూడా జగన్ కు ఉంది. వీరంతా ఓ మాట మీద నిలబడితే ఇక వీరిని ఎవరూ ఎదుర్కోలేరనే భరోసా కూడా ఉంది. అలాంటిది తమ కుటుంబానికి అండగా నిలిచిన వారిని, పార్టీకి విధేయులుగా పనిచేసిన వారిని కాదని టీడీపీకి చెందిన ప్రత్యర్దులు రామసుబ్బారెడ్డి, సతీష్ రెడ్డిని వైసీపీలో చేర్చుకోవాలన్న ప్రయత్నాలు చేయడంపై వారు మండిపడుతున్నారు. ఇప్పటికే జమ్మలమడుగులో రామసుబ్బారెడ్డి రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి జగన్ తాజా నిర్ణయాలపై అసంతృప్తిగా ఉన్నారు. అలాగే సతీష్ రెడ్డి రాకతో పులివెందుల రాజకీయాల్లోనూ జగన్ పై ఆయన సన్నిహితుల్లో నమ్మకం సడలే ప్రమాదం పొంచి ఉంది. అయితే వీరిద్దరి చేరికపై జిల్లా నేతలతో మాట్లాడి ఒప్పించాలని కడప ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు మరికొందరికి బాధ్యత అప్పగించారని తెలుస్తోంది.