జగన్ ఓ నమ్మక ద్రోహి.. ఆ పదవి నా వియ్యంకుడికి ఇస్తానని చెప్పి: మైసూరా
చంద్రబాబు చేసిన అభివృద్ధిని చూసే టీడీపీలోకి వెళ్తున్నామని.. పార్టీలో ఏ ఒక్క ఎమ్యెల్యే పట్ట జగన్ తీరు సరిగా లేదని వైసీపీని వీడుతున్న నేతలు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా వైసీపీని వీడిన సీనియర్ నేత మైసూరా రెడ్డి కూడా ఇవే అంశాలపై స్పందించారు. తాను పార్టీని వీడడానికి గల కారణాలను ప్రస్తావిస్తూ.. పార్టీ కోసం ఎంత కష్టపడి పనిచేసినా జగన్ నుంచి ఎలాంటి ప్రోత్సాహం లభించలేదన్నారు.
ప్రోత్సాహం సంగతి పక్కనబెడితే.. తన పట్ల జగన్ వ్యతిరేక చర్యలకు కూడా పూనుకున్నారని ఆరోపించారు మైసూరా. జగన్ మీద నమ్మకంతో తన వియ్యంకుడు ఎన్నికల ఏజెంటుగా పనిచేస్తే.. తన వియ్యంకుడికి ఇస్తానని చెప్పిన ఎమ్మెల్సీ సీటును మాత్రం ఆదినారాయణ రెడ్డి సోదరుడికి ఇచ్చి జగన్ నమ్మకద్రోహం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా ఈ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
జగన్ వ్యవహార శైలి తమ కుటుంబాల్లో చిచ్చుపెట్టిందని ఆరోపించిన మైసూరా.. జగన్ పై కేసులు తన స్వయంకృతపరాధమేనని, ఉంటే సోనియాకు సంబంధమే ఉండాలి గానీ ఇందులో టీడీపీ ప్రమేయం ఉందని చెప్పడం అవాస్తమన్నారు. తనకు సంబంధించిన సిమెంట్ కంపెనీకి మైనింగ్ లీజుతో పాటు పర్యావరణ అనుమతులు కూడా ఉన్నాయని, ఒకవేళ కంపెనీకి ఇంకా స్థలాలు అవసరమైతే ప్రభుత్వం నుంచి తీసుకుంటానని లేదంటే ప్రైవేట్ వ్యక్తుల నుంచి కొనుక్కుంటానని చెప్పారు.
తమ పార్టీ ఎమ్మెల్యేలను సంతలో వస్తువుల్లా టీడీపీ కొనేస్తుందని ఆరోపిస్తున్న వైసీపీ వ్యాఖ్యలను మైసూరా ఖండించారు. అదే నిజమైతే ఆ డబ్భేదో జగనే ఇచ్చి ఎమ్మెల్యేలను నిలుపుకోవచ్చు కదా అని ఓ సలహా కూడా ఇచ్చారు. తనను ఐరన్ లెగ్ అంటున్నవాళ్లు వెంటపడి మరీ తనను పార్టీలో చేర్చుకున్న విషయం మరిచిపోవద్దన్నారు.