కేసీఆర్ కన్నా జగన్ బెటర్ అంటున్న మందా కృష్ణ మాదిగ.. ఎందుకో రీజన్ కూడా చెప్పారుగా
Recommended Video
తెలంగాణా సీఏం కేసీఆర్ పై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందా కృష్ణ మాదిగ సంచలన ఆరోపణలు చేశారు. కొత్తగా ఏపీలో బాధ్యతలు చేపట్టిన జగన్ కేసీఆర్ కంటే నయమని పేర్కొన్నారు. రాజకీయాల్లో అపారమైన అనుభవముందని చెప్పుకొనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కంటే ఎలాంటి అనుభవమూ లేని జగన్ వెయ్యి రెట్లు బెటర్ అని ఆయన అన్నారు.
ఏపీ సీఎం జగన్ అనుభవం లేకున్నా మెరుగ్గా పని చేస్తున్నారన్న మందా కృష్ణ మాదిగ
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో మెరుగ్గా పని చేస్తున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ వ్యాఖ్యానించారు. కృష్ణా జిల్లా నందిగామలో మీడియాతో మాట్లాడుతూ, అన్ని సామాజిక వర్గాలనూ జగన్ తన క్యాబినెట్ లోకి తీసుకోవడంపై హర్షం వ్యక్తంచేశారు. ఇక జగన్ క్యాబినెట్ లో మహిళలకు స్థానం కల్పించారని , కేసీఆర్ మాత్రం మహిళలకు సముచిత స్థానం ఇవ్వలేదని ఆయన ఆరోపించారు.
మహిళలకు, ఎస్సీలకు సముచిత స్థానం ఇవ్వటంపై హర్షం
జగన్ తన క్యాబినెట్ లోకి ముగ్గురు మహిళలను తీసుకోవటమే కాకుండా అత్యంత కీలకమైన హోమ్ శాఖను ఒక మహిళకు అప్పగించారని గుర్తు చేసిన మందా కృష్ణ , జగన్ తన నిర్ణయాలతో అన్ని వర్గాల ప్రజల అభిమానాన్ని జగన్ చూరగొంటున్నారని పేర్కొన్నారు . కేసీఆర్ మంత్రివర్గంలో ఒక్క మహిళ కూడా లేదని, మహిళలపై కేసీఆర్ కు చిన్నచూపనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏమి కావాలని ఆయన అన్నారు . కేసీఆర్ క్యాబినెట్ లో ఒక్కరే దళితునికి స్థానం లభిస్తే, జగన్ ఏకంగా ఐదుగురు దళిత ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చారని పొగడ్తలు కురిపించారు. ఇక దళిత సీఎం చేస్తానని చెప్పిన కేసీఆర్ మాట తప్పారని , దళితులకు క్యాబినెట్ లో స్థానం ఇచ్చి జగన్ మాట నిలబెట్టుకున్నారని మందా కృష్ణ వ్యాఖ్యానించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం జరిగే పోరాటాలకు తాను మద్దతిస్తానని ఆయన తెలిపారు.
కేసీఆర్ తో పోలిస్తే జగన్ వెయ్యి రెట్లు బెటర్ అన్న మందా కృష్ణ వ్యాఖ్యలపై ఆసక్తి
ఇప్పటికే రెండు రాష్ట్రాల ప్రజలు పాలన పట్ల చాలా సునిశితమైన దృష్టి పెట్టిన నేపధ్యంలో అప్పుల రాష్ట్రంగా, మొదటి నుండి లోటు బడ్జెట్ రాష్ట్రంగా ఉన్న ఏపీలో సీఎం జగన్ పాలనా పగ్గాలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే ది బెస్ట్ సీఎం అనిపించుకుంటున్నారు. ఇక తెలంగాణా సీఎం మాత్రం రెండో సారి పాలనా పగ్గాలు చేపట్టినా పాలనపై కాకుండా ఫిరాయింపులపై దృష్టి పెట్టినట్టు రాష్ట్రంలో ఆందోళనలు సాగుతున్నాయి. అసలు పాలన మీద దృష్టి పెట్టటం లేదనే భావన వ్యక్తం అవుతుంది. ఇక కేసీఆర్ తో పోల్చి చూస్తే జగన్ వెయ్యి రెట్లు బెటర్ అని ఇప్పుడు మందా కృష్ణ మాదిగా అన్నారు అంటే ముందు ముందు జగన్ పాలన కేసీఆర్ పాలన రెంటినీ పోలుస్తూ మరి ఎన్ని కామెంట్లు రానున్నాయో .