జగన్ పిరికోడు, బలహీనుడు .. సీఎం కావాలన్న ఆయన కోరిక పగటి కలే ... సాధినేని యామిని
తెలుగుదేశం పార్టీ మహిళా అధికార ప్రతినిధి, ఫైర్ బ్రాండ్ సాధినేని యామిని జగన్ పై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు . నిన్నటికి నిన్న జగన్ పాపపు సొమ్ము ఇప్పటికైనా పంచితే వచ్చే జన్మలో అయినా సీఎం అవుతాడని ఘాటు వ్యాఖ్యలు చేసిన యామిని జగన్ ఒక పిరికోడని, బలహీనుడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు .
తొడగొట్టి చెబుతున్నా ... వచ్చేది టీడీపీ ప్రభుత్వమే .. విజయసాయికి బుద్దా వెంకన్న కౌంటర్
జగన్ పగటి కలలు కంటున్నారు .. అవి నెరవేరవు అన్న యామిని
ఏపీ లో ప్రజలు గత ఎన్నికల్లో రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ కి పట్టం కట్టారని, చంద్రబాబును ఆదరించారని ఆమె అన్నారు. ఇక ఈ సారి ఎన్నికల్లో టీడీపీని దెబ్బ తియ్యాలనే లక్ష్యంతో వైసీపీ అధినేత జగన్ చాలా కుట్రలు చేశారని , సీఎం కావాలని వైఎస్ జగన్ పగటి కలలు కంటున్నారంటూ విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష పార్టీ ముసుగులో ఎన్నో అరాచకాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాల్పడిందని ఆరోపించారు.
టీడీపీ అధికారంలోకి రావటం వెయ్యిశాతం నిజం అన్న యామిని సాధినేని
ఏప్రిల్ 11న ప్రజలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా తీర్పునిచ్చారని టీడీపీ అధికారంలోకి రావటం ఖాయమని ఆమె పేర్కొన్నారు . మే 23 తర్వాత రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికి వెయ్యిశాతం నిజమన్నారు. రాష్ట్రంలో, దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనే లక్ష్యంతో చంద్రబాబు పోరాటం చేస్తున్నారని యామిని తెలిపారు . ఏపీ ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు ఒక యుద్ధమే చేస్తున్నారన్న యామిని దేశంలో ప్రాంతీయ పార్టీలను ఏకతాటి మీదకు తీసుకురావటానికి చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారని ఆన్నారు .
జగన్ బలహీనుడు , పిరికోడు .. వైసీపీది మేకపోతు గాంభీర్యం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని తెలిసి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోందన్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిరికోడు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ కు మోదీ అన్నా, కేసీఆర్ అన్నా భయమని పేర్కొన్నారు . జగన్ ఒక బలహీనుడు కాబట్టే ప్రధాని నరేంద్రమోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ జగన్ ను పావుగా చేసుకుని రాష్ట్రంలో కుట్రలు పన్నుతున్నారని, జగన్ సీఎం అయితే ఏపీని నాశనం చెయ్యాలని కుట్ర చేశారని ఆమె ఆరోపించారు. జగన్ పై రోజుకో విధంగా విరుచుకుపడుతున్న యామిని ఎన్నికల ఫలితాల్లో టీడీపీకి అధికారం ఖాయం అని జోస్యం చెప్పారు.