జగన్ శత్రువే, చంద్రబాబు మోసగాడు-టీడీపీతో కలిస్తే బీజేపీకి అధోగతే -తిరుపతిలో ప్లాన్ 47: దేవధర్ సంచలనం
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అంశంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు పొరపాటు చేయలేదని, ప్రాంతీయ పార్టీలైన వైసీపీ, టీడీపీలు హోదాను తమ రాజకీయానికి వాడుకున్నాయని, వాళ్లిద్దరి మోసాలను ప్రజల్లోకి తీసుకెళతామని ఏపీ బీజేపీ ఇంచార్జి సునీల్ దేవధర్ చెప్పారు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో సత్తా చాటుకోవడం ద్వారా ఏపీలో బీజేపీ పట్ల ప్రస్తుతమున్న నెరేటివ్స్ మార్చుకుంటామన్నారు. అదే సమయంలో ఏపీ సీఎం, వైసీపీ చీఫ్ జగన్, ప్రతిపక్ష నేత, టీడీపీ చీఫ్ చంద్రబాబులను ఉద్దేశించి దేవధర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా 'ది న్యూస్ మినిట్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బీజేపీ నేత ఏమన్నారో ఆయన మాటల్లోనే..
షాకింగ్: శశికళకు ఏమైంది? -జైలు నుంచి ఆస్పత్రికి -పడిపోయిన ఆక్సిజన్ లెవల్స్ -27న విడుదలనగా
47మంది విస్తారక్లతో పక్కాగా..
''తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికను బీజేపీ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. గడిచిన రెండు నెలలుగా నేను ఇక్కడే అద్దె ఇల్లు తీసుకుని మకాం వేశాను. తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్ లో మొత్తం 47 మండలాలున్నాయి. మడలానికి ఒక్కరు చొప్పున 47 మంది బీజేపీ విస్తారక్ లను బరిలోకి దింపాం. వారంతా 20 రోజులపాటు పనిచేశారు. వీళ్లు కాకుండా కీలక నేతలు ఒక్కొక్కరిని ఒక్కో మండలానికి ఇంచార్జిలుగా నియమించాం. తిరుపతి సీటులో కచ్చితంగా సత్తా చాటుకుంటాం. కానీ..
పవన్ను ఒప్పించాకే నిర్ణయం..
తిరుపతి ఉప ఎన్నిక కోసం బీజేపీ స్పష్టమైన, పదునైన ప్రణాలికలో ముందుకు పోతున్నది. కానీ అభ్యర్థి ఎవరనేది మాత్రం ఇప్పుడే చెప్పలేం. ఎందుకంటే, ఏపీలో మాకు పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీతో పొత్తు కొనసాగుతోంది. ఉమ్మడి అభ్యర్థిపై కమిటీ కూడా ఏర్పడింది. పవన్ ను ఒప్పించాకే ఒక నిర్ణయానికి వస్తాం. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాతే అభ్యర్థిని ప్రకటిస్తాం. మత రాజకీయాల ద్వారా తిరుపతిలో పాగాకు బీజేపీ యత్నిస్తోందన్నది నిజం కాదు. అసలు విషయం ఏంటంటే..
జగన్ మాకు శత్రువే.. బీజేపీది రియాక్షన్
ఏపీలో అధికార వైసీపీని మేం ప్రత్యర్థిగానే చూస్తాం. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ను శత్రువుగానే భావిస్తాం. ఆయనతో మాకు వ్యక్తిగత విభేదాలేవీ లేవు. కానీ రాజకీయంగా వైసీపీ అనుసరిస్తోన్న తీరు ఆక్షేపణీయంగా ఉంది. ఏపీలో ఆలయాలపై దాడుల వెనుక టీడీపీ-బీజేపీ హస్తం ఉందని అధికార పార్టీ వాళ్లు ఆరోపిస్తున్నారు. ప్రతిదానికి సీబీఐ ఎంక్వైరీ అంటున్నారు. ఏం? ఆలయాలపై దాడులు చేసిన దుండగులను పట్టుకునే సామర్థ్యం ఏపీ పోలీసులకు లేదా? క్రైస్తవులకు, చర్చిలకు అనుకూలంగా జగన్ సర్కారు వ్యవహరిస్తున్న తీరుకు బీజేపీ కేవలం రియాక్షన్ మాత్రమే ఇస్తున్నది. స్వతహాగా మేం మతరాజకీయాలు చేయం. డీజీపీ గౌతం సవాంగ్ రాజీనామా చేయాలని మా పార్టీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు డిమాండ్ చేశారు. దానిపై నేను మాట్లాడలేను. కానీ డీజీపీ తానొక అధికారినన్న సంగతి మర్చిపోయి, వైసీపీ మనిషిలా మాట్లాడటం సరికాదు. అధికార పార్టీ ఇచ్చిన డైరెక్షన్ ఫాలో కావడం అధికారుల విధే కావొచ్చు. కానీ ప్రతిపక్షాలను టార్గెట్ చేసేలా ఆయన మాట్లాడటమేంటి? గతంలో వెస్ట్ బెంగాల్, త్రిపురలోనూ అధికారులతో మాకు ఇలాంటి సమస్యలే వచ్చాయి. అంతమాత్రాన..
వైసీపీ సర్కారును పడగొట్టడమా?
ఏపీలో కొద్ది రోజులుగా నెలకొన్న రాజకీయ, ఇతర పరిణామాలు.. వైసీపీ సర్కారు కూల్చివేతకు దారి తీస్తాయని, కేంద్రం తన శక్తిని ఉపయోగించి జగన్ ను నిర్వీర్యం చేస్తుందని ఎవరైనా అనుకుంటూ అది పొరపాటే. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు జగన్ పాదయాత్ర చేసింది టీడీపీ ప్రభుత్వాన్ని పడగొట్టడానికా? తాను అధికారంలోకి రావడానికా? ఇవాళ బీజేపీ రథయాత్ర చేస్తానంటుంటే వైసీపీ వింత వాదనలు చేయడంలో అర్థంలేదు. ఏపీలో బీజేపీ ప్రజాబలంతోనే అధికారంలోకి వస్తుంది. అంతేతప్ప అధికారంలో ఉన్న పార్టీని దెబ్బతీయడం ద్వారా కాదు. అయినా, దేశంలోనే అత్యధిక మెజార్టీ, మార్జిన్ తో ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. ఇక..
చంద్రబాబు మోసగాడు.. టీడీపీతో దోస్తీనా?
ఆలయాలపై దాడుల అంశంపై ఇవాళ మాట్లాడుతోన్న చంద్రబాబు తన హాయంలో జరిగిన మత మార్పిడులకు సమాధానం చెప్పగలరా? పాస్టర్ ప్రవీణ్ చెబుతున్నట్లు 699గ్రామాలను పూర్తిగా క్రైస్తవంలోకి మార్చిన సమయం బాబు హయాంలో కాదా? అప్పుడాయన ఏం చేస్తున్నట్లు? టీడీపీగానీ, వైసీపీగానీ క్రిస్టియన్లు, ముస్లింల పేరుతో యధేచ్చగా రాజకీయాలు చేస్తున్నారు. మేం(బీజేపీ) వాళ్లను ఎండగడుతున్నామే తప్ప మత రాజకీయాలతో మాకు పనిలేదు. గతంలో ఉన్న చనువుకొద్దీ బీజేపీ మళ్లీ టీడీపీతో జతకండుతుందని పొరపాటున కూడా అనుకోవద్దు. చంద్రబాబు టీడీపీతో చేతులు కలిపితేగనుక బీజేపీ తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి ఆ ప్రస్తక్తే ఉండదు. అయినా..
పోవాలి బాబు-జగన్.. రావాలి సోము-పవన్
ఆంధ్రప్రదేశ్ పట్ల బీజేపీ స్పష్టమైన వ్యూహాలున్నాయి. రాజధాని విషయంలోనూ బీజేపీకి మాత్రమే పూర్తి క్లారిటీ ఉంది. మాకు అవకాశం ఇస్తే బంగారు అమరావతిని నిర్మిస్తాం. అక్కడి రైతులకు సరైన న్యాయం చేస్తాం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో వైసీపీ, టీడీపీల నాటకాలను ప్రజల్లో ఎండగడుతాం. వైసీపీతోనో, టీడీపీతోనో అంటకాగాల్సిన లేదా చేయి కలపాల్సిన దుస్థితి బీజేపీకి లేనేలేదు. జగన్, చంద్రబాబులిద్దరూ మాకు శత్రువులే. కాబట్టే మేం.. ''పోవాలి బాబు-జగన్.. రావాలి సోము-పవన్'' అనే నినాదంతో ముందుకు వెళుతున్నాం'' అని ఏపీ బీజేపీ ఇంచార్జి సునీల్ దేవధర్ అన్నారు.