అవిశ్వాసంపై జగన్ వెనకడుగు: సైకో బతకనివ్వరని సిఎం
ముఖ్యమంత్రి పదవి కోసమే జగన్ తపన పడుతున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గెలవదని, గెలిచినా ప్రజలను బతకనివ్వదన్నారు. విభజనపై జగన్ పార్టీ నాటకాలు ఆడుతోందన్నారు. జగన్ ఓ సైకో అని దుయ్యబట్టారు. తమ అవిశ్వాస తీర్మానం లోక్పాల్ బిల్లుకు ఆటంకం కాదన్నారు. మొన్నటి ఉప ఎన్నికల్లో జగన్ పార్టీకి ఓట్లు వేసి మోసపోయామని ప్రజలు ఆవేదన చెందుతున్నారన్నారు. విభజనపై ఆ పార్టీ నాటకాలను అందరు అర్థం చేసుకోవాలన్నారు.
కాగా, కేంద్ర ప్రభుత్వంపై సమావేశాల సమయంలో అన్ని పార్టీలకు చెందిన ఎంపీలు అవిశ్వాస తీర్మానం పెట్టారు. అయితే, జగన్, మేకపాటి నోటీసును ఉపసంహరించుకున్నట్లు లోకసభ సంయుక్త కార్యదర్శి విఆర్ రమేష్ వెల్లడించారు. ఎంతమంది సభ్యులు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చారో వివరాలు తెలపాల్సిందిగా సిఎం రమేష్ లోకసభ సంయుక్త కార్యదర్శి విఆర్ రమేష్కు లేఖ రాశారు.
దీనిపై ఆయన జవాబిస్తూ డిసెంబర్ 9 నుండి 18వ తేదీ వరకు ఎంపీలు రాయపాటి, సబ్బం, ఉండవల్లి, సాయి ప్రతాప్, లగడపాటి, హర్ష, కొణతాల, శివప్రసాద్, నిమ్మల, మోదుగుల, జగన్ మేకపాటి, ఎస్పీవై రెడ్డిలు ప్రతిరోజు నోటీసులు ఇచ్చారని చెప్పారు. డిసెంబర్ 12న అవిశ్వాస తీర్మానాన్ని పరిగణలోకి తీసుకునే లోగానే జగన్, మేకపాటి వెనక్కి తీసుకున్నారని రమేష్కు ఇచ్చిన లేఖలో పేర్కొన్నారు. లోకసభ సంయుక్త కార్యదర్శి ఇచ్చిన లేఖను సిఎం రమేష్ అసెంబ్లీలో సభ్యులకు అందజేశారు.
సభ నుండి పారిపోతున్నారు: దూళిపాళ్ల
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని దూళిపాళ్ల నరేంద్ర వేరుగా అన్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లు పైన చర్చ జరుగతుంటే బయటకు వచ్చి సభాపతిని సమయం కోరడమేమిటని ప్రశ్నించారు. సీమాంధ్ర ప్రజలు సమైక్యాంధ్ర కోరుకుంటున్నారని, అందుకోసం వారు సభలో ఎందుకు గొంతు విప్పడం లేదన్నారు. ఓ దిశ లేకుండా ఆ పార్టీ వెళ్తోందని మండిపడ్డారు.
బయట సమైక్యవాదం వినిపిస్తున్న జగన్ సభ లోపల ఎందుకు మాట్లాడటం లేదన్నారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలు సభలో వినిపించాల్సి ఉందన్నారు. కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల మధ్య చీకటి ఒప్పందం అమలుకు సభను వేదికగా చేసుకుంటున్నారన్నారు. చర్చ అనంతరం ఓటింగ్ కోసం అందరం పట్టుబడుతున్నామని చెప్పారు.
శైలజానాథ్ పైన గండ్ర
శాసన సభలో సమైక్యవాణి వినిపించిన మంత్రి శైలజానాథ్ పైన ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణ రెడ్డి సిఎల్పీ కార్యాలయంలో మండిపడ్డారు. సకల జనుల సమ్మె జరిగినప్పుడు, విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు బాధ్యతగల మంత్రిగా ఎందుకు స్పందించలేదన్నారు. శాసన సభ వ్యవహారాల మంత్రిగా మొత్తం రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా మాట్లాడాలన్నారు. ఓ ప్రాంతానికి అనుకూలంగా మాట్లాడటం సరికాదన్నారు.
అశోక్ బాబుపై కేసు నమోదుకు ఆదేశం
తెలంగాణ ముసాయిదా బిల్లు ప్రతులను భోగి మంటల్లో దగ్ధం చేసిన ఎపిఎన్జీవో అధ్యక్షులు అశోక్ బాబు పైన కేసు నమోదు చేయాలని రంగారెడ్డి జిల్లా కోర్టు సరూర్ నగర్ పోలీసులను ఆదేశించింది. సుంకరి జనార్ధన్ గౌడ్ అనే న్యాయవాది అశోక్ బాబు పైన కోర్టుకెక్కారు. 20వ తేదీ లోపు కేసు నమోదు చేయాలని సూచించింది.