వీక్లీ ఆఫ్ లతో పాదయాత్రలు చేసే ఏకైక నాయకుడు జగన్:మంత్రి పుల్లారావు సెటైర్
గుంటూరు:దేశంలో వీక్లీ ఆఫ్ లతో పాదయాత్ర చేస్తున్న ఏకైక నాయకుడు జగన్ మాత్రమేనని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఎద్దేవా చేశారు. మంత్రి పుల్లారావు తన సొంత నియోజకవర్గం గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో మీడియా సమావేశంలో మాట్లాడారు.
వైసిపి నేతలు ఏం సాధిద్దామని వంచన దీక్షలు చేస్తున్నారని మంత్రి పుల్లారావు మండిపడ్డారు.కేంద్రం, బీజేపీని వెనకేసుకు రావడానికే దీక్షలు చేస్తున్నారా అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని వంచించింది జగన్మోహన్రెడ్డి కాదా అని మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రాజెక్టులు రాకుండా చేసిన వారు టీడీపీ గురించి మాట్లాడటం హాస్యాస్పదమని మంత్రి పుల్లారావు అన్నారు. బీజేపీతో వైసీపీ లాలూచీ పడి కుట్ర రాజకీయాలు చేస్తోందని ఆయన విమర్శించారు.
కడప జిల్లాలో అభివృద్ధిని వైసిపి జగన్ అడ్డుకుంటున్నారని మంత్రి ఆరోపించారు. కడప ఉక్కఫ్యాక్టరీ విషయంలో కేంద్రం అన్యాయం చేసినా జగన్ ప్రశ్నించకపోవడం వెనక ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. అధికారం కోసం అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను జగన్ వంచించే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి దుయ్యబట్టారు. ఏపీకి న్యాయం కోసం టీడీపీ ఎంపీలు పోరాడుతుంటే వైసీపీ ఎంపీలు కేంద్ర పెద్దల వద్ద లాలూచీ రాజకీయాలు చేయడం వంచనకాదా అని ఆయన నిలదీశారు.
దేశ చరిత్రలో పారిశ్రమికవేత్తలను, ఐఏఎస్ అధికారులను జైలుకు పంపించి ఆంధ్రప్రదేశ్ పరువు తీశారని, అందుకు మూలకారణం జగనేనని అన్నారు.5 కోట్ల ప్రజలను వంచించడంతో పాటు రాష్ట్రంలో వర్షాలు పడకూడదని వైకాపా వారు కోరుకుంటున్నారు.ఆలీబాబా 40 దొంగలు లాగా రాష్ట్రాన్ని పది సంవత్సరాలు దోచుకున్నారన్నారు.దొంగలు, అవినీతి పరులు, రాష్ట్రానికి ప్రాజెక్టులు రాకుండా చేసిన వాళ్ళు టిడిపి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.
విభజన హామీల కోసం ఎన్టీయే నుంచి టిడిపి బయటకు వస్తే మీరు మోడికి సహకరిస్తున్నారని వైసిపిపై ధ్వజమెత్తారు. జగన్ అవినీతికి పాల్పడి జైలు పాలైతే రాష్ట్రంలో యాత్ర చేసిన చెల్లెలిని కూడా వంచించి కనీసం సీటివ్వకుండా మోసం చేశారని విమర్శించారు.
కాపు రిజర్వేషన్లపై ఇచ్చిన మాట ప్రకారం అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే..కనీసం ఆవిషయంలో కేంద్రం జాప్యాన్ని నిలదీయకుండ కాపు జాతిని వంచించిన ఘనత మీ పార్టీది కాదా?...అని జగన్ ను ప్రశ్నించారు.అధికారం కోసం ఆచరణ సాధ్యం కాని హామీలిస్తూ ప్రజల్ని వంచించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.ప్రజలను వంచిస్తున్న మీరే వంచన పేరుతో దీక్షలు చేయటం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని మంత్రి పుల్లారావు ఎద్దేవా చేశారు.12 లక్షల మందికి యువనేస్తం కింద నిరుద్యోగ భృతి ఇస్తుంటే కూడా ఓర్చుకోలేకపోతున్నారని దుయ్యబట్టారు.ముఖ్యమంత్రి చంద్రబాబు కష్టమే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధి అని మంత్రి పుల్లారావు ప్రస్తుతించారు.