జగన్, కేసీఆర్ కు భంగపాటు తప్పదు..! బాబు ఇచ్చే గిఫ్ట్ కోసం రెడీగా ఉండాలంటున్న టీడిపి నేతలు...!!
Recommended Video
అమరావతి : అమరావతిలో అదికాక, ప్రతిపక్ష నేతల మద్య మాటల యుద్దం కొనసాగుతోంది. కేసీఆర్, జగన్లకు త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వనున్నారని టీడిపి నేత పుట్టా సుధాకర్ యాదవ్ తెలిపారు. టీడిపి అత్యదిక స్థానాలు గెలవబోతున్నట్లు వెల్లడించారు. ఏపీలో మళ్లీ అధికారంలోకి వచ్చేది టీడిపి ప్రభుత్వమేనని, ఈ సారి జగన్కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మోదీ, జగన్, కేసీఆర్లు కలిసి చేస్తున్న కుట్రల నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు చంద్రబాబు పోరాటం చేస్తున్నారని యాదవ్ తెలిపారు.
ఎక్కువ స్థానాలపై టీడిపి గెలుపు..! పుట్టా సుధాకర్ యాదవ్ వ్యాఖ్యలు..!!
తెలంగాణలో బీసీలకు అదికార గులాబీ పార్టీ అడుగడుగునా అన్యాయం చేసినా నోరుమెదపని తలసాని శ్రీనివాస యాదవ్, కేసీఆర్ దగ్గర మార్కులు కొట్టేసేందుకు జగన్ను వెనకేసుకొస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకుని ఓటర్ల జాబితాను తారుమారు చేసి అధికారంలోకి వచ్చిన గులాబీ నేతలు చంద్రబాబు పనితీరును విమర్శించడం ఏమిటని నిలదీశారు.
అవినీతి పరునికి అధికారం దక్కదు..! గళం పెంచిన తెలుగు తమ్ముళ్లు..!!
రాష్ట్రంపై గులాబీ నేతలు ఎంత కుట్ర పూరితంగా వ్యవహరించినా, జగన్కు ఎన్ని రకాలుగా అండగా నిలిచినా అవినీతిపరునికి అధికారాన్ని కట్టబెట్టేందుకు ఏపీ ప్రజలు సిద్ధంగా లేరని తెదేపా ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు స్పష్టం చేశారు. ప్రజల కోసం 40 ఏళ్లుగా పనిచేస్తున్న చంద్రబాబును, తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని 40ఏళ్లకే లక్ష కోట్లు దోచుకున్న జగన్తో పోల్చడం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ అజ్ఞానానికి నిదర్శనమని మండిపడ్డారు. ఓటమి భయంతో లోటస్పాండ్లో ఉన్న జగన్కు ధైర్యం నూరిపోసేందుకే గులాబీ నేతలు ఇలా మాట్లాడుతున్నారని ప్రజలందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ నేతలు ఎంత ప్రయత్నించినా జగన్ సీఎం కాలేరని మంతెన స్పష్టం చేశారు.
నేమ్ ప్లేట్ తయారు చేయించుకోవడం ఏంటి..! మండిపడ్డ టీడిపి..!!
ఈవీఎంలపై చర్చ తప్పించుకునేందుకు ఈసీ కుంటి సాకులు వెతుకుతోందని మంత్రి దేవినేని ఆగ్రహం వ్యక్తంచేశారు. 31 కేసులున్న జగన్, 13 కేసులున్న విజయ్ సాయిరెడ్డి ఫిర్యాదులపై ఈసీ వెంటనే స్పందించడాన్ని ఆయన తప్పుబట్టారు. కేసు ఉందనే కారణంతో వేమూరు హరికృష్ణ ప్రసాద్ను చర్చకు వద్దంటున్నారని, ఈవీఎంలు ఏ విధంగా హ్యాక్ చేయొచ్చో చూపి అందరినీ అప్రమత్తం చేసినందుకే ఆయనపై కేసు పెట్టారని తెలిపారు. పీకే బృందం చివరి పేమెంట్ కోసం జగన్ని భ్రమల్లో ఉంచుతోందని, జగన్ అప్పుడే ముఖ్యమంత్రి అన్నట్లు నేమ్ ప్లేట్ తయారు చేసుకోవటం పిచ్చికి పరాకాష్ఠ అని మండిపడ్డారు.
జనాలు కసిగా ఓటేసారు..! మహిళలు టీడిపి కి అండగా ఉన్నారన్న దేవినేని ఉమ..!!
దేశ రాజధానిలో చంద్రబాబు చేసిన పోరాటం ఇతర పార్టీలను మేలుకొల్పిందని దేవినేని ఉమా అన్నారు. పోలింగ్ని ఏ విధంగా ఆలస్యం చేయొచ్చో ఆంధ్రప్రదేశ్లో ఈసీ చేసి చూపిందని దుయ్యబట్టారు. ఓటింగ్ శాతం పెరగకుండా నియంత్రించే కుట్ర ఈసీ పన్నిందని ఆరోపించారు. అయినా ప్రజలు కసిగా ఓటింగ్లో పాల్గొని గట్టిగా బుద్ది చెప్పారన్నారు. తెలుగుదేశం సానుభూతిపరులు ఉన్న పోలింగ్ బూత్లోనే ఎక్కువ ఈవీఎంలు పనిచేయలేదని, మహిళలు అండగా నిలబడి ప్రజాస్వామ్యాన్ని కాపాడారని ఉమా అన్నారు.