ఏపీ కోవిడ్ కొత్త రూల్స్- మాస్కుల్లేక పోతే రూ.100 ఫైన్- పరీక్షలపై నిర్ణయం అప్పుడే ?
ఏపీలో కరోనా కేసుల కల్లోలం కొనసాగుతోంది. వేలకు వేలుగా వస్తున్న కొత్త కేసుల నేపథ్యంలో ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. వీటిని క్షేత్రస్దాయిలో కచ్చితంగా అమలు చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఇందులో మాస్కుల వాడకం, భౌతిక దూరం నిబందనలతో పాటు విద్యార్దులు, విద్యాసంస్ధలకు సంబంధించిన పలు నిర్ణయాలు ఉన్నాయి. పరిస్దితి బట్టి పదో తరగతి, ఇంటర్ పరీక్షల రద్దుపై నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు.
జగన్ కీలక నిర్ణయాలు
ఏపీలో కరోనా పరిస్దితిపై నిన్న అధికారులతో కీలక సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో కరోనా కేసుల వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో విద్యాసంవత్సరాన్ని ఇంతటితో ముగించాలని నిర్ణయించారు. 1 నుంచి 9వ తరగతి విద్యార్ధులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ప్రస్తుతానికి పదో తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణకే ప్రభుత్వం మొగ్గు చూపింది. క్షేత్రస్ధాయిలో కరోనా కట్టడికి సీఎం జగన్ అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ఇవన్నీ ఇవాళ్టి నుంచి అమల్లోకి రాబోతున్నాయి.
కోవిడ్ కొత్త మార్గదర్శకాలు
ఏపీలో కరోనా విజృంభణ నేపథ్యంలో మాస్కు వాడకాన్ని పూర్తిస్దాయిలో తప్పనిసరి చేయాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలిచ్చారు. దీంతో ఇవాళ్టి నుంచి మాస్కు లేకపోతే రూ.100 జరిమానా విధించబోతున్నారు. అలాగే హోటళ్లు, సినిమా హాళ్లు, కన్వెన్షన్ సెంటర్లలో భౌతిక దూరం నిబంధనల్ని పకడ్బందీగా అమలు చేస్తారు. హోటళ్లలో కుర్చీకీ, కుర్చీకీ మధ్య ఆరడుగుల దూరం అమలు చేయబోతున్నారు. అలాగే సినిమా హాళ్లలో కుర్చీకీ, కుర్చీకి మధ్య ఓ కుర్చీ వదిలేయాల్సి ఉంటుంది. అలాగే బహిరంగ ప్రదేశాల్లోనూ భౌతిక దూరం నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తారు.
వాలంటీర్లతో మరోసారి సర్వే
రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలు, వార్డుల పరిధిలో ఉన్న వాలంటీర్లతో స్ధానికంగా సర్వే చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎవరైనా కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్నారేమో వీరు గుర్తిస్తారు. వెంటనే వారికి కోవిడ్ పరీక్షలు చేయిస్తారు. అనంతరం అవసరాన్ని బట్టి ఆస్పత్రులకు పంపి చికిత్స అందిస్తారు. ఇందుకోసం ముందుగా సర్వే నిర్వహించబోతున్నారు. గతేడాది కూడా ప్రభుత్వం పలు దఫాలుగా వాలంటీర్లతో సర్వేలు చేయించి బాధితుల్ని గుర్తించింది. మరోసారి ఇలా బాధితుల గుర్తింపు చేపట్టడంతో పాటు పెద్ద ఎత్తున పరీక్షల నిర్వహణకు సిద్దమవుతున్నారు.
పరిస్ధితిని బట్టి పదోతరగతి, ఇంటర్ పరీక్షలు
కీలకమైన పదోతరగతి, ఇంటర్ మీడియట్ పరీక్షలపై ప్రస్తుతానికి కొనసాగింపు నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. పరిస్ధితిని నిశితంగా గమనిస్తోంది. ఇతర రాష్ట్రాల తరహాలో వెంటనే పరీక్షలు రద్దు చేస్తే విద్యార్ధులు నష్టపోతారని భావిస్తున్న ప్రభుత్వం కేసుల పరిస్ధితిని బట్టి టెన్త్, ఇంటర్ పరీక్షలపై నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించింది. ఇప్పటికే విద్యార్ధులకు కొనసాగుతున్న క్లాసులను కూడా కొనసాగించబోతున్నారు. పరీక్షలు జూన్లో ఉన్నందున, ఆ లోపు ఏ క్షణాన అయినా తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.
Recommended Video