రాజధాని స్కాం బయటకు తెస్తాం, పోలవరంలో అవసరమైతే రీటెండర్లు: జగన్
తన పాలనలో ఏపీలో విప్లవాత్మక మార్పులు..నిర్ణయాలు ఉంటాయని జగన్ ప్రకటించారు. ఏపి ప్రస్తుతం 2.58లక్షల కోట్ల అప్పుల్లో ఉందన్నారు. ప్రధాని మోదీ సహకారం కోరానని..అమిత్షాను మర్యాద పూర్కంగా కలిసానని చెప్పారు. ఇక, ఏపీలో రాజధానిలో భారీ స్కాం జరిగిందని బయకు తీయాల్సిన అవసరం ఉందన్నారు. పోలవరంలోనూ అవినీతి జరిగి ఉంటే రీటెండర్లు పిలుస్తామని స్పష్టం చేసారు. ఏపీలో అవినీతి రహిత..పారదర్శకత పాలన సాగిస్తామని..ఆరు నెలల్లోగా ఫలితాలు కనిపిస్తాయని ధీమా వ్యక్తం చేసారు. హోదా కోసం ప్రయత్నాలు సాగుతాయని..ఖచ్చితంగా ఏదో ఒక రోజు వచ్చి తీరుతుందని చెప్పుకొచ్చారు.
ఏపీలో అప్పులు రూ.2.58 లక్షల కోట్లు..
రాష్ట్ర విభజన సమయంలో ఏపీ వాటాగా 97వేల కోట్ల అప్పులు నాడు ఉండగా..అయిదేళ్ల చంద్రబాబు పాలనలో ఆ మొత్తం ఏకంగా రెండు లక్షల 58వేల కోట్లకు చేరిందన్నారు. వడ్డీల రూపంలో ఏటా 20వేల కోట్లు చెల్లిస్తున్నారని చెప్పుకొచ్చారు. తమ మీద ప్రజలు విశ్వాసంతో గెలిపించారని..ఇచ్చిన ప్రతీ మాట నిలబెట్టుకుంటామన్నారు. ఈ నెల 30న తాను ఒక్కడినే ప్రమాణ స్వీకారం చేస్తానని ప్రకటించారు. ఏపీలో దశల వారీగా మద్యపాన నిషేదం అమలు చేసి.. 2024లో ఓట్లు అడుగుతామని స్పష్టం చేసారు. కేంద్ర సాయం లేకుండా ఏపీ మనుగడ కష్టమనే విషయాన్ని..ఓడితో ఏపీ ప్రభుత్వం కొనసాగుతున్న అంశాన్ని ప్రధానికి వివరించి..అండగా నిలవమని కోరానని చెప్పారు. కేసీఆర్..అమిత్ షాతో మర్యాద పూర్వంకంగానే కలిసానన్నారు. ఏపీలో శాఖల వారీగా సమీక్షలు చేసి.. శ్వేత పత్రాల ద్వారా వాస్తవాలు ప్రజల ముందు ఉంచుతామని వెల్లడించారు.
రాజధాని స్కాం బయటకు తీస్తాం..
ఏపీ రాజధాని భూముల వ్యవహారంలో భారీ స్కాం చోటు చేసుకుందని జగన్ ఆరోపించారు. రాజధాని ఎక్కడో ముందుగానే మద్దతుదారులకు లీక్ చేసి..భూములు కొనుగోలు చేయించారని వివరించారు. కొన్ని గ్రామాల్లో లాండ్ పూలింగ్ పేరుతో బలవంతంగా భూములు తీసుకొన్నారన్నారు. రాజధాని మ్యాప్లో మంత్రులు..నేతల భూములను తప్పించి రైతుల భూములను మాత్రం అందులో చేర్చారని వివరించారు. తనకు చంద్రబాబు మీద వ్యక్తిగతంగా కోపం లేదని..జరిగిన అవినీతి మాత్రం బయటకు రావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం ఇన్సైడర్ ట్రేడింగ్ చేసిందని ఆరోపించారు. దీని మీద పూర్తి స్థాయి వివరాలు ప్రజల ముందు ఉంచుతామని ప్రకటించారు.
పోలవరంలో అవసరమైతే రీటెండర్లు..
పోలవరం విషయంలో ఆరోపణలు ఉన్నాయని..అవసరమైతే టెండర్లు రద్దు చేసి రీటెండర్లకు పిలుస్తామని వెల్లడించారు. పోలవరం ఏపీ ప్రభుత్వం కట్టదని..కేంద్రమే పూర్తి చేయాలని..అయితే నిర్ణతీ సమయానికి మాత్రం ప్రాజెక్టు పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. తమ పాలనలో అనినీతి రహిత-పారదర్శక పాలన అందిస్తామని.. ఆరు నెలల్లో విప్లవాత్మక మార్పులు చూస్తారని ధీమా వ్యక్తం చేసారు. కాంట్రాక్టులు అప్పచెప్పే విషయంలోనూ పారదర్శకంగా ఉంటామన్నారు. ప్రధాని మోదీని పదేపదే కలవాల్సిన అవసరం ఉంటుందని..ప్రత్యేక హోదా సాధిస్తామనే నమ్మకం ఉందన్నారు జగన్.