రాజధాని విషయంలో జగన్ తాజా వ్యూహం .. డైలమాలో రాజధాని గ్రామాల ప్రజలు, ప్రతిపక్షాలు
రాజధానిగా అమరావతి విషయంలో నేడు తుది నిర్ణయం వెల్లడించేందుకు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సిద్ధమయ్యారు. ఏపీలో బలమైన మెజార్టీ ఉన్న వైసీపీ ప్రభుత్వం ఎవరు అవునన్నా, కాదన్నా తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తుంది. ఇక మూడు రాజధానుల నిర్ణయానికే కట్టుబడిన జగన్ సర్కార్ రాజధాని తరలింపు మాట రాకుండా తాజా వ్యూహం అమలు చెయ్యనుంది. ఇక సీఎం జగన్ తాజా వ్యూహం ఇప్పటికే డైలమాలో ఉన్న రాజధాని గ్రామాల ప్రజలను మరోమారు డైలమాలో పడెయ్యనుంది .
గృహ నిర్బంధాలు, అరెస్ట్ లు .. టీడీపీ , అమరావతి జేఏసీ అసెంబ్లీ ముట్టడి సాధ్యమేనా ? రాజధానిలో టెన్షన్
రాజధాని ప్రకటన విషయంలో రూటు మార్చిన జగన్ సర్కార్
ప్రజలు ఇచ్చిన 151 సీట్లతో సీఎం జగన్ మోహన్ రెడ్డి రాజధానిని విశాఖకు తరలించడానికి అసెంబ్లీలో బిల్లు పెట్టబోతున్నారని సమాచారం . అయితే.. ఈ తరలింపును నేరుగా చెయ్యకుండా రాజధాని తరలింపు అనే విషయాన్ని ఎక్కడా ప్రస్తావించకుండా చెయ్యాలని వైసీపీ సర్కార్ భావిస్తుంది . తాను ప్రవేశ పెట్టబోయే బిల్లుల్లో రాజధానిగా అమరావతి ఉండబోదని ఎక్కడా చెప్పటం లేదు. అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళటానికి రూట్ ఎలా మార్చుకున్నారో అదే విధంగా నేడు చేసే ప్రకటనలో కూడా చాలా జాగ్రత్తగా రూటు మార్చి ప్రకటన చెయ్యనుంది వైసీపీ సర్కార్ .
రాజధాని తరలింపు అనే పదం రాకుండా జాగ్రత్త
రాష్ట్రాన్ని నాలుగు జోన్లుగా విభజించి జోనల్ కమీషనరేట్ లను ఏర్పాటు చేసి పాలన ఎక్కడికక్కడ సాగేలా చేస్తామని చెప్పనున్నారని సమాచారం . అంతే కాదు ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్న బిల్లుల్లో ఎక్కడా రాజధాని తరలింపు అనే పదం రాకుండా జాగ్రత్త పడుతున్నారు. విశాఖకు రాజధానిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కానీ రాజధాని తరలింపు అనే మాట వాడకుండా జాగ్రత్త పడుతూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది .
రాజధాని తరలిస్తే రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి
రాజధాని తరలిస్తున్నామని చెబితే రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకు రూ. నాలుగు లక్షల కోట్ల పరిహారం చెల్లించాల్సి వస్తుంది. అందుకే.. రాజధాని తరలిస్తున్నామనే మాట లేకుండా పని పూర్తి చెయ్యాలని సీఎం జగన్ తాజా వ్యూహం అని చెప్తున్నారు . మొత్తానికి ప్రభుత్వం అడ్డదారిలో వెళ్లడానికి సిద్ధమయిందన్న విషయం అసెంబ్లీకి వెళ్లే విషయంలో చెప్పేసింది. ఇక ఇటు బిల్లులో ఉన్న అంశాలతోనూ చాలా జాగ్రత్తగా కర్ర విరగకుండా , పాము చావకుండా ప్రకటన చెయ్యనుంది అని స్పష్టమయ్యింది.
రాజధాని అమరావతి విషయంలో ఏ ప్రకటన చేసిన ఇబ్బందులే
సీఎం జగన్ రాజధాని అమరావతి విషయంలో రాజధానిగా అమరావతి రద్దు చేస్తున్నట్టు ప్రకటిస్తే , లేదా రాజధాని తరలిస్తున్నట్టు ప్రకటిస్తే రాజధాని ప్రాంత రైతులు , ప్రజలు ఊరుకోరు . ఈ నేపధ్యంలో వారికి నష్ట పరిహారం కూడా చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్రభుత్వం ఉన్న పరిస్థితుల్లో అంత పెద్ద మొత్తం చెల్లించటం చాలా కష్టం . ఇక నష్ట పరిహారం ఇస్తామని చెప్పినా అగ్రహ జ్వాలలు ఆగుతాయన్న నమ్మకం లేదు.
త్రిశంకు స్వర్గంగా అమరావతి.. రైతులు, ప్రతిపక్షాలు షాక్
ఇక ఈ నేపధ్యంలోనే ఎక్కడా రాజధాని అమరావతి తరలింపు ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడనున్న జగన్ చాలా పెద్ద స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుతం సీఎం జగన్ వ్యూహంతో త్రిశంకు స్వర్గంలో రాజధాని అమరావతి పడిందని చెప్పాలి . ఇక ఇప్పుడు రాజధానిగా అమరావతి ఉన్నట్టా .. లేనట్టా .. ఉండీ లేనట్టా ? అన్నది అర్ధం కాక రాజధాని రైతులు డైలమాలో పడనున్నారు. అటు ప్రతిపక్ష పార్టీలకు సైతం జగన్ వ్యూహం షాకింగ్ అని చెప్పక తప్పదు .