అనంతపురం వేదికగా నేడే వైఎస్సార్ కంటి వెలుగు పథకం ప్రారంభం: అమలుకు సైతం జగన్ ప్లాన్
Recommended Video
ఏపీ ప్రజల కంటి ఆరోగ్యం కోసం దృష్టి దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏపీలో ప్రభుత్వం వైఎస్సార్ కంటి వెలుగు పథకం నేటి నుండి ప్రారంభించనుంది. ఎన్నికల హామీల్లో ఒకటైన నవరత్నాలు అందించే క్రమంలో భాగంగా ఆయన కంటి వెలుగు పథకాన్ని అందిస్తున్నారు. అనంతపురం వేదికగా నేడు జరగనున్న ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది.అక్టోబర్ 10వ తేదీ నేడు గురువారం సీఎం జగన్ ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని అనంతపురం నుండి ప్రారంభించనున్నారు. అక్కడ భారీ బహిరంగ సభలో ఏపీ సీఎం జగన్ పాల్గొననున్నారు.
అనంతపురం ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో కంటి వెలుగు పథకం ప్రారంభం
రాష్ట్ర ప్రజలందరికీ కంటి పరీక్షలు చేసి.. వారి కంటి సమస్యలకు పరిష్కారం చూపడమే లక్ష్యంగా కంటివెలుగు పథకం ప్రారంభిస్తోంది ఏపీ సర్కార్. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే అమలవుతున్న ఈ పథకం, ఇకనుండి ఏపీలో సైతం అమలుకు నోచుకోనుంది. ఈ ప్రతిష్టాత్మక పథకం ప్రారంభోత్సవానికి అనంతపురం వేదికవుతోంది. ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో సీఎం జగన్ ఈ స్కీమ్ను ప్రారంభించనున్నారు. ఇందుకోసం జిల్లా యంత్రాంగం ఘనంగా ఏర్పాట్లు చేసింది.
ఘనంగా ఏర్పాట్లు చేసిన వైసీపీ నేతలు
సీఎం హోదాలో జగన్ అనంతపురం పర్యటన సందర్భంగా వైసీపీ నేతలు ఘనంగా స్వాగత ఏర్పాట్లు చేశారు. అనంత రోడ్లన్నీ స్వాగత తోరణాలు, ప్లెక్సీలతో నింపేశారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఏపీ ప్రజా ఆరోగ్య సంరక్షణ కోసం పలు సంస్కరణల దిశగా అడుగులు వేస్తున్న జగన్ వైఎస్సార్ కంటివెలుగు పథకం నేడు ప్రారంభించనున్నారు.
విద్యార్థులకు సైతం కంటి పరీక్షలు .. వైద్య సేవలు
తొలి విడతలో సుమారు 70 లక్షల మంది విద్యార్థులకు ప్రాథమిక కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నెల 16 వరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్లో కంటి పరీక్షలు నిర్వహిస్తారు. కంటి సమస్యలు ఎదుర్కొంటున్న విద్యార్థులను నవంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు విజన్ సెంటర్లకు పంపిస్తారు. ఆ తరువాత 3, 4, 5, 6 దశల్లో కమ్యూనిటీబేస్ ఆధారంగా కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి వీరికి పరీక్షలు, చికిత్సలు మొదలుపెట్టే ఆలోచనలో ఉంది వైసీపీ ప్రభుత్వం.
స్కీమ్ అమలుకు టాస్క్ ఫోర్స్ కమిటీలు
కంటివెలుగు పథకాన్ని ప్రారంభించటమే కాకుండా అమలుకు సంబంధించి కలెక్టర్ల నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ కమిటీలు వేసింది ఏపీ సర్కార్. ఇందులో భాగంగా.. 160 మంది జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్లు, 1415 మంది వైద్యాధికారులను నియమించారు. ఇప్పటికే అన్ని పీహెచ్సీలకు కంటి పరీక్షలకు సంబంధించిన కిట్లను పంపారు. 42 వేల మంది ఆశావర్కర్లు, 62 వేల మంది టీచర్లు, 14 వేల మంది ఏఎన్ఎంలు, 14 వేల మంది ప్రజారోగ్య సిబ్బంది కంటి వెలుగు పథకం అమలులో తమ వంతు బాధ్యతను నిర్వర్తించనున్నారు .