జగన్కు మరో షాక్: రూ.7.85 కోట్ల ఆస్తుల జఫ్తు, హైద్రాబాద్లోని హోటల్ కూడా
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి ఆస్తులు జఫ్తు చేసింది.
జగన్ ఆస్తుల కేసులో ఈడీ రూ.7.85 కోట్ల ఆస్తులను గురువారం నాడు జఫ్తు చేసింది. అనంతపురం జిల్లాలో పెన్నా గ్రూపుకు చెందిన 231 ఎకరాల భూమిని తాత్కాలికంగా ఈడి జఫ్తు చేసింది. అలాగే హైదరాబాదులోని హోటల్ను కూడా తాత్కాలికంగా జఫ్తు చేసింది.
వైయస్ జగన్ కంపెనీల్లో పెన్నా ప్రతాప్ రెడ్డి రూ.68 కోట్లు పెట్టుబడులు పెట్టారు. సిబిఐ ఛార్జీషీట్ ఆధారంగా విచారణ జరిపిన ఈడీ.. ఈ కేసులో రూ.7.85 కోట్ల ఆస్తులను జఫ్తు చేసింది.
కాగా, జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి గతంలో జప్తుకు ఆదేశించిన 250 ఎకరాల భూమిపై ఎటువంటి లావాదేవీలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఈడి... రంగారెడ్డి జిల్లా రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారులకు దాదాపు నెల రోజుల క్రితం ఆదేశాలు జారీ చేసింది.
జగన్ కేసుకు సంబంధించి జిల్లాలలోని.. నాటి లెక్కల ప్రకారం రూ.53 కోట్ల విలువైన భూములను గత ఫిబ్రవరిలో జఫ్తుకు ఈడి ఆదేశించింది. క్విడ్ ప్రోకో కేసుకు సంబంధించి జఫ్తు చేసిన ఈ భూములపై ఎలాంటి లావాదేవీలు జరగకుండా చూడాలని ఆదేశించింది.