జగన్ లండన్ టూర్ క్యాన్సిల్ : కారణమిదేనా ?
హైదరాబాద్ : వైసీపీ అధినేత జగన్ లండన్ పర్యటన అనివార్య కారణాల వల్ల మళ్లీ వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఇవాళ కుటుంబసభ్యులతో కలిసి జగన్ లండన్ వెళ్లాల్సి ఉంది. అయితే అర్ధాంతరంగా పర్యటన క్యాన్సిల్ అయినట్టు తెలుస్తోంది. అయితే టూర్ రద్దు కావడానికి కారణాలు ఇంకా తెలియరాలేదు.
కూతురును చూసేందుకు ..
లండన్ లో జగన్ కుమార్తె చదువుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన కుటుంబంతోపాటు వెళ్లాల్సి ఉంది. ఎన్నికల ఫలితాలకు సమయం ఉండటంతో టూర్ షెడ్యూల్ ప్రిపేర్ చేశారు. ఇదివరకే ఓ సారి విదేశీ పర్యటనకు వెళ్లొచ్చిన జగన్ .. మరోసారి లండన్ షెడ్యూల్ సిద్ధం చేశారు. ఇవాళ్టి నుంచి 14 వరకు జగన్ ఫ్యామిలీతో లండన్లో ఉండేందుకు షెడ్యూల్ ప్రిపేర్ చేశారు.
తుఫాను ప్రభావం ..
ఫొణి తుఫాను ప్రభావంతో సిక్కోలు వణుకుతోంది. ఈ క్రమంలో ప్రతిపక్ష నేత విదేశీ పర్యటనలు, సినిమాలకు వెళ్లడం ఏంటని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు. ఆయన ఇక్కడున్నా .. ఏపీలో ఉండరని, లోటస్ పాండే కావాలని విమర్శించారు. తుఫాను ప్రభావం .. చంద్రబాబు విమర్శలతో ఫారిన్ టూర్ వెళితే బాగుండదని క్యాన్సిల్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవలే ఆయన అవెంజర్స్ సినిమా చూసిన సంగతి తెలిసిందే.
రెండోసారి క్యాన్సిల్
మరో 19 రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెలువడే ముందే .. విదేశీ టూర్ల పేరుతో పర్యటిస్తే బాగుండదనే అభిప్రాయంతో జగన్ తన పర్యటనకు వాయిదా వేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఏపీలో ఎన్నికలు ముగిసిన వెంటనే జగన్ లండన్ వెళ్లాల్సి ఉంది. అయితే అప్పుడు కూడా పర్యటన వాయిదా పడింది. తాజాగా మరోసారి లండన్ టూర్ క్యాన్సిల్ కావడం చర్చనీయాంశమవుతోంది.