జగన్ యువభేరీ ఎఫెక్ట్, సస్పెండ్: ఏయూ ప్రొఫెసర్కు చిక్కు, ఎవరీ ప్రసాద్ రెడ్డి?
విశాఖ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల విశాఖలో యువభేరీ నిర్వహించారు. ఇది ఆంధ్రా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ ప్రసాద్ రెడ్డిని చిక్కుల్లో పడేసింది! ప్రసాద్ రెడ్డి పైన సస్పెన్షన్ వేయాలని ప్రభుత్వం యోచిస్తోందని తెలుస్తోంది.
విశాఖలోని కళావాణి పోర్టు స్టేడియంలో ఇటీవల జగన్ యువభేరి సదస్సు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో పలువురు విద్యార్థులతో పాటు ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు కూడా పాల్గొన్నారు. ఇప్పుడు వారిపై చర్యలు తీసుకునే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి.
ఇందులో, కొందరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. ఈ క్రమంలో వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారంటూ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాస రావు ఏయూ వీసీ ఆచార్య జిఎన్ఎన్ రాజు ప్రశ్నించారు.
నాటి సదస్సుల్లో వర్శిటీకి చెందిన ఆరుగురు ప్రొఫెసర్లు పాల్గొన్నారని తెలిసిందని, వారిని సస్పెండ్ చేస్తారా? లేదా నోటీసు ఇస్తారా? అని మంత్రి అడిగారు. అయితే అందరి పైన కాకపోయినా కొందరిపై సస్పెన్షన్ వేటు తప్పక పడుతుందని తెలుస్తోంది. ఈ విషయాన్నంతటినీ మంత్రి గంటా కూడా ధ్రవీకరించారు. విచారిస్తున్నట్లు చెప్పారు.
ముఖ్యంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారని, ప్రసాద్ రెడ్డిని సస్పెండ్ చేయాలని ఆంధ్రా వర్సిటీ ఉన్నతాధికారులకు ఆదేశాలు అందాయని తెలుస్తోంది.
ఎవరీ ప్రొపెసర్ ప్రసాద్ రెడ్డి?
ప్రొఫెసర్ ప్రసాద్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆంధ్రా వర్సిటీ రిజిస్ట్రార్గా ఉన్నారు. ప్రస్తుతం ఆయన ప్రస్తుతం కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ డిపార్టుమెంట్లో ప్రొఫెసర్. అంతేకాదు, ఇతను గతంలో దివంగత వైయస్ విగ్రహాన్ని క్యాంపస్లో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించి విమర్శలు ఎదుర్కొన్నారు.
తాజాగా, జగన్ యువభేరీ నిర్వహణకు ఆయనే కీలకమని తెలుస్తోంది. అంతేకాదు, సమావేశంలో జగన్ పైన ప్రశంసలు కురిపించారు. జగన్ రాష్ట్రం కోసం దీర్ఘకాలిక ప్రణాళికతో పని చేస్తున్నారని కితాబిచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినట్లుగా కూడా తెలుస్తోంది. కాగా, ప్రసాద్ రెడ్డిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేయడం సిగ్గుచేటు అని జ్యోతుల నెహ్రూ మండిపడ్డారు.