జగన్ మాఫియా..పాపాల చిట్టా .. అచ్చెన్నాయుడు లాంటి నిరపరాధులు జైళ్లలో : టీడీపీ నేతల తిట్ల దండకం
అచ్చెన్నాయుడును డిశ్చార్జ్ చేసి జైలుకు పంపించటంపై టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు . వైసీపీ ప్రభుత్వ తీరుపై ఏపీలో టీడీపీ నేతల ఆగ్రహ జ్వాలలు కొనసాగుతున్నాయి. ఎవరికి తోచినట్టు వారు విమర్శలు గుప్పిస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు , మాజీ మంత్రులు ప్రభుత్వ వైఖరిపై మండిపడుతున్నారు. టీడీపీ నేత ఆలపాటి రాజా, నిమ్మల రామానాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు , మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు తదితరులు ప్రభుత్వంపై, సీఎం జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
దొంగ రిపోర్టులు సృష్టించి డిశ్చార్జ్ చేస్తారా?
టిడిపి నేతలపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కుట్రలు చేసి కేసులలో ఇరికిస్తున్నారని టీడీపీఎంపీ రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. ఎలాగైనా అచ్చెన్నాయుడు జైలుకు పంపాలని దురుద్దేశంతోనే తప్పుడు కేసులు పెట్టారని విమర్శలు గుప్పించిన ఆయన అచ్చెన్నాయుడు పూర్తిగా కోల్పోకుండానే డాక్టర్లపై ఒత్తిడి తీసుకువచ్చి దొంగ రిపోర్టులు సృష్టించి డిశ్చార్జ్ చేశారని పేర్కొన్నారు. అనారోగ్యంతో ఉన్న ఆయన అరెస్టు చూస్తే జగన్ ఏ రకంగా అయినా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని అర్థమవుతోందని పేర్కొన్నారు.రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని హక్కులను కాలరాస్తూ ఈ విధంగా వ్యవహరించడం ఏపీ దౌర్భాగ్యమని రామానాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామని, ప్రజల్లో చైతన్యం తీసుకొస్తామని ఆయన పేర్కొన్నారు.
ఏపీలో సీఎం జగన్ మాఫియా నడుస్తోంది
అనారోగ్యంతో ఉన్న అచ్చెన్నాయుడును డిశ్చార్జ్ చేసి అరెస్టు చేసిన విధానం న్యాయం అంటూ టీడీపీ నేత ఆలపాటి రాజా మండిపడ్డారు. ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు. సామాన్య ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని ఆయన మండిపడ్డారు. న్యాయ వ్యవస్థ మరుగున పడుతుందని రాజా ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారి గొంతు నొక్కడం అన్యాయమన్నారు. అసలు రాష్ట్రంలో జగన్ మాఫియా నడుస్తోందని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం మొండి వైఖరి నశించాలని మండిపడిన ఆలపాటి రాజా వైసిపి తీరుపై విమర్శలు గుప్పించారు.
నేరస్తులు రోడ్లపై నిరపరాధులు జైళ్లలో
రాష్ట్రంలో రివర్స్ పాలన కొనసాగుతోందని సీఎం జగన్ మోహన్ రెడ్డి రివర్స్ పాలన మహిమతో రాష్ట్రంలో నేరస్తులు రోడ్లపై తిరుగుతున్నారని, నిరాపరాధులు జైళ్లలో మగ్గుతున్నారని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విమర్శలు గుప్పించారు.అచ్చెన్నాయుడు ఆరోగ్యం కుదుట పడక ముందే ఆయనను డిశ్చార్జ్ చేయించడం దారుణమని మండిపడ్డారు. 108, 104 అంబులెన్స్ లలో 300 కోట్లు కొట్టేసిన వాళ్లు ప్రారంభోత్సవాలు,పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు. కానీ నిరపరాధులు ఇబ్బంది పడుతున్నారు అని నిమ్మల రామానాయుడు విమర్శలు గుప్పించారు.
ఆరోగ్యంగా ఉంటే వీల్ చైర్ లో తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి?
అచ్చెన్నాయుడు ఆరోగ్యంగా ఉంటే వీల్ చైర్ లో తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు ఆపరేషన్ అయిన అచ్చెన్నాయుడును కావాలనే జగన్ పైశాచిక ఆనందం కోసమే జైల్లో ఉంచారన్నారు. బీసీలు అంటే వైయస్ జగన్ కు చులకన, కక్షసాధింపు అని పేర్కొన్నారు. అవినీతి ఆరోపణలతో 16 నెలలు జైల్లో ఉన్న జగన్, అందరికీ అవినీతి మరకలు అంటించాలని ప్రయత్నిస్తున్నారని నిమ్మల రామానాయుడు మండిపడ్డారు.
Recommended Video
ప్రభుత్వ పాపాల చిట్టా తయారవుతోంది
టిడిపి శాసనసభ పక్ష నేత అచ్చెన్నాయుడుని జైలుకు పంపించిన విధానం ప్రభుత్వ శాడిజాన్ని తెలియజేసిందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ప్రభుత్వం చేయని పాపాలు ఈ ప్రభుత్వం చేస్తుందని ప్రభుత్వ పాపాల చిట్టా తయారవుతుందని విమర్శలు గుప్పించారు. ఆపరేషన్ చేసిన వ్యక్తితో 24 గంటల పాటు ప్రయాణం చేయించారని మండిపడ్డారు. ప్రభుత్వ ఒత్తిడి వలనే అత్యవసర డిశ్చార్జ్ చేశారన్నారు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు.