ప్రత్యేక హోదాపై పోరుకు.. : జగన్ మాస్టర్ ప్లాన్
ఓవైపు ప్రత్యేక హోదా లేదని తేల్చేసిన కేంద్రం.. మరోవైపు కేంద్రంపై నమ్మకముందని చెప్తున్న చంద్రబాబు ప్రభుత్వం.. ఏపీలో రాజకీయమంతా ఇప్పుడు ప్రత్యేక హోదా చుట్టూ తిరుగుతోంది. ప్రత్యేక ప్యాకేజీలకు కూడా అవకాశం లేదని తేల్చి చెప్పిన కేంద్రం ఆర్థిక సహాయం అందించే విషయంలోను నీతి ఆయోగ్, 14వ ఆర్థిక సంఘం ప్రతిపాదనల మేరకే రాష్ట్రానికి నిధుల కేటాయింపు ఉంటుందని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
ఇలాంటి తరుణంలో ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత జగన్ తదుపరి కార్యాచరణ ఏంటనేది ఆసక్తిగా మారింది. మరోవైపు మిత్రపక్షం బీజేపీని గట్టిగా నిలదీయడానికి తటపటాయిస్తున్న టీడీపీ నేతలు, బీజేపీని ఇంకా వెనుకేసుకొచ్చే ప్రయత్నమే చేస్తున్నారు. తాజాగా అవంతి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు ఉదాహరణ. ప్రత్యేక హోదా లేదని చెప్పింది కేంద్రమంత్రులే కదా.. అసలు విషయం తేల్చాల్సింది ప్రధాని అని అంటూ బీజేపీపై ఇంకా నమ్మకముందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
టీడీపీ, బీజేపీలు రెండూ రెండే. ఇక రాష్ట్ర కాంగ్రెస్ దీనిపై స్పందించినా స్పందించకున్నా పట్టించుకునే స్థితిలో అటు ఏపీ జనం కూడా ఉన్నట్టు లేరు. ఇక మిగిలింది జగన్ ఒక్కరే. ప్రతిపక్ష హోదాలో ఉన్నారు కాబట్టి ఈ విషయంలో టీడీపీ, బీజేపీని సమర్థంగా ఎదుర్కోవడం పొలిటికల్ గాను జగన్ కు మైలేజ్ ఇచ్చే అంశం. ఇదే విషయాన్ని పెట్టుకుని ప్రత్యేక హోదాపై ఫైట్ కి సిద్దమవుతున్నారు జగన్.
ఇందులో భాగంగానే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తో కలిసి ప్రత్యేక హోదాపై పోరాడాలని జగన్ నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్, వైసీపీ ఎంపీలు కలిసి ఈ అంశంపై కేంద్రాన్ని నిలదీయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. కేంద్రంలో కాంగ్రెస్ కి వైసీపీ మద్దతునిచ్చేలా.. అలాగే రాష్ట్రంలో వైసీపీకి కాంగ్రెస్ మద్దతునిచ్చేలా వ్యూహాలు సిద్దం చేసుకుంటున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.