జగన్కు ఈడి సమన్లు: విచారణ తర్వాత అరెస్టు చేస్తారా?
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నుంచి పిలుపు వెళ్లింది. గురువారం ఢిల్లీలోని తమ కార్యాలయానికి విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. ఈడీ విచారణకు హాజరయ్యేందుకు జగన్ గురువారం ఉదయం ఢిల్లీకి వస్తున్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.
జగన్ ఆడిటర్ విజయసాయిరెడ్డికి కూడా సమన్లు జారీచేయగా ఆయన బుధవారమే ఢిల్లీకి వస్తున్నట్లు తెలిసింది. ఢిల్లీ ఖాన్ మార్కెట్లో గల ఈడీ ప్రధాన కార్యాలయంలో జగన్ను ప్రశ్నించనున్నారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉండగా కార్పొరేట్ సంస్థలకు, కాంట్రాక్టర్లకు చేసిన మేళ్లకు సబంధించి క్విడ్ప్రోకో కింద వందల కోట్ల రూపాయలు జగన్ కంపెనీలలోకి పెట్టుబడుల రూపంలో వచ్చాయనేది ప్రధాన అభియోగం. ఈ వ్యవహారంలో సీబీఐ పలు చార్జిషీట్లు దాఖలు చేసింది.
ఈడీ తరఫున మాత్రం కొన్ని చార్జిషీట్లు పెండింగ్లో ఉన్నట్లు సమాచారం. అక్రమ ఆస్తులు, పెట్టుబడులపై గతంలో జగన్ ఆడిటర్ విజయసాయిరెడ్డి, జగన్మోహన్రెడ్డి ఇచ్చిన వాంగ్మూలాలకు, తమ దర్యాప్తులో తేలిన లెక్కలకు మధ్య చాలా వ్యత్యాసం ఉన్నదని ఈడీ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయమై జగన్ వివరణ తీసుకునేందుకే తాజాగా సమన్లు జారీచేసినట్లు తెలుస్తోంది.
విచారణలో భాగంగా ఆయన వద్దనుంచి అఫిడవిట్ తీసుకొని పంపిస్తామని, అరెస్టులాంటివేమీ ఉండకపోవచ్చని కూడా ఆ వర్గాలు తెలిపాయి. విచారణలో జగన్ నుంచి సంతృప్తికరమైన సమాచారం రాకపోయినా, ఆశించిన సహకారం లభించకపోయినా అరెస్టు చేయవచ్చని, గతంలో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధుకోడాను కూడా ఇలాగే విచారణకు పిలిచి అరెస్టు చేశామని ఈడీ అధికారులు గుర్తు చేశారు.