రూ.6లక్షలేనా?: నమ్మశక్యం కాని లెక్కలు, అది 300కోట్లు, నంద్యాలలో టీడీపీ ఖర్చుపై జగన్ మీడియా!
భూమా బ్రహ్మానందరెడ్డి తరుపున రూ.300కోట్ల వరకు డబ్బు పంపిణీ జరిగిందని ఆరోపిస్తోంది.
కర్నూల్: నంద్యాల ఉపఎన్నికల్లో వైసీపీ అంచనాలన్ని తలకిందులైన సంగతి తెలిసిందే. అనుకున్నదాని కంటే టీడీపీకి ఎక్కువ మెజారిటీతో దక్కడంతో వైసీపీకి షాక్ తప్పలేదు. అయితే ఈ గెలుపుకు కారణం ప్రలోభాలే తప్ప మరొకటి కాదనేది ఆ పార్టీ ఇప్పటికీ చేస్తున్న ప్రధాన ఆరోపణ.
తాజాగా నంద్యాలలో టీడీపీ యథేచ్చగా నోట్ల కట్టలు పంపిణీ చేసిందంటూ జగన్ మీడియా ఒక ఆసక్తికర కథనాన్ని వెలువరించింది. టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి రూ.300కోట్ల దాకా ఖర్చు చేస్తే.. అధికారులు మాత్రం కేవలం రూ.16.60లక్షలు మాత్రమే లెక్క తేల్చారనేది అందులో కనిపిస్తున్న ఆరోపణ.
కాంగ్రెస్ కన్నా 20వేలు ఎక్కువ:
ఏం చేసైనా సరే ఉపఎన్నికలో గెలవాలన్న ఉద్దేశంతో అధికార పార్టీ మద్యాన్ని ఏరులై పారేలా చేసిందని, మద్యం ఖర్చు కూడా కోట్లలోనే ఉంటుందని ఆ కథనంలో పేర్కొన్నారు. టీడీపీ అభ్యర్థి ఖర్చు కింద చూపించిన లెక్కలను ఇక్కడ ప్రస్తావించారు. బ్రహ్మానందరెడ్డి కేవలం రూ.6.49లక్షలు మాత్రమే ఖర్చు చేసినట్లు చూపించారని, కాంగ్రెస్ అభ్యర్థి కంటే ఇది కేవలం రూ.20వేలు ఎక్కువ అని అందులో చెప్పుకొచ్చారు.
నమ్మశక్యంగా లేదని:
నంద్యాలలో 20మందికి పైగా మంత్రులు, సీఎం సైతం రెండు రోజులు పర్యటనకు వస్తే అభ్యర్థి ఖర్చు మరీ రూ.6.49లక్షలే అంటే నమ్మశక్యంగా లేదని జగన్ మీడియా ఆరోపిస్తోంది. చంద్రబాబు పర్యటించిన రెండు రోజులకే రోజుకు రూ.కోటి చొప్పున ఖర్చు అయి ఉంటుందని చెబుతున్నారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా పర్యటించిన నేపథ్యంలో.. కచ్చితంగా ఖర్చును చాలా తక్కువ చేసి చూపించారని అంటున్నారు.
షాడో అబ్జర్వేషన్లో ఇలా:
షాడో అబ్జర్వేషన్ లో ఎన్నికల అధికారులు ఈ ఖర్చు వివరాలను పొందుపరచడంతో.. ఈ లెక్కలు బయటకొచ్చినట్లు తెలుస్తోంది. టీడీపీ అభ్యర్థి ఖర్చు రూ.16.60లక్షలుగా అందులో పేర్కొనడంతో జనం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నట్లు జగన్ మీడియా చెబుతోంది.
వైసీపీ ఖర్చు:
ఇక వైసీపీ విషయానికొస్తే.. రూ.17.50లక్షలు, కాంగ్రెస్ అభ్యర్థి రూ.6.59లక్షలు ఖర్చు చేసినట్లు షాడో అబ్జర్వేషన్ రికార్డులో నమోదు చేయడం గమనార్హం. ఇందులో ఉఎన్నికల ఖర్చు కింద వైసీపీ అభ్యర్థి రూ.10.39లక్షలు తన ఖర్చుగా చూపించారు.