పోలవరం ప్రాజెక్ట్ పై జగన్ మీడియా విషం:మంత్రి ఉమ;చంద్రబాబు చేసేది ఆ హత్యలే:సిపిఐ నేత నారాయణ
అమరావతి:పోలవరం ప్రాజెక్టుపై జగన్ మీడియా విషం చిమ్ముతూనే ఉందని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దుయ్యబట్టారు. పోలవరం ప్రాజెక్టుపై సిఎం చంద్రబాబు మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమీక్షలో రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతోపాటు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం మంత్రి ఉమ మాట్లాడుతూ చరిత్రలో ఎన్నడూలేని విధంగా రాష్ట్రంలో నదుల అనుసంధానం చేపట్టిన ఘనత సిఎం చంద్రబాబుదే అన్నారు. మరోవైపు సిపిఐ జాతీయ నేత నారాయణ జగన్ పై దాడి గురించి మాట్లాడుతూ చంద్రబాబు రాజకీయహత్యలు మాత్రమే చేస్తారని వ్యాఖ్యానించారు.
ప్రాజెక్టులు...నీటితో కళకళ
మంగళవారం ఉదయం పోలవరం ప్రాజెక్ట్ పై సిఎం చంద్రబాబు నిర్వహించిన సమీక్షా సమావేశం అనంతరం మంత్రి దేవినేని ఉమ మీడియాతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించిన డయా ఫ్రమ్ వాల్ పనులు నూరు శాతం పూర్తి చేశామని చెప్పారు. మరోవైపు పట్టిసీమ ప్రాజెక్ట్ వల్ల ఇప్పటికే డెల్టా, రాయలసీమలు నీటితో కళకళలాడుతున్నాయని మంత్రి ఉమ చెప్పుకొచ్చారు.
ఇద్దరికీ...సిఎం పదవి పిచ్చి
నదుల అనుసంధానం లో భాగంగా గోదావరి, పెన్నా నదుల అనుసంధానం కోసం ఈనెల 21న నాగార్జున సాగర్ కుడికాలువ దగ్గర చంద్రబాబు శంకుస్థాపన చేస్తారని మంత్రి ఉమ వెల్లడించారు. ఆ తరువాత త్వరలోనే వైకుంఠపురం బ్యారేజీ పనులు ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. విపక్షాల అధ్యక్షలు జగన్-పవన్ గురించి మాట్లాడుతూ...ఒకరు సీఎం పదవి పిచ్చి పట్టి రోడ్ల వెంట తిరుగుతుంటే...మరొకరు తనను సీఎం అని పిలవాలంటూ అడుగుతూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.
ఆ ప్రచారం...వాళ్లకే నష్టం
ఇదిలావుంటే సిపిఐ జాతీయ నాయకులు నారాయణ విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విశాఖ ఎయిర్పోర్టులో దాడి అనంతరం సీఎం చంద్రబాబు, డీజీపీ ఠాకూర్ స్పందన సరిగా లేదన్నారు. అయితే జగన్పై దాడి చంద్రబాబే చేయించారన్న ప్రచారం వైసిపి నేతలు ఆపకపోతే అది వారికే నష్టం కలిగిస్తుందని నారాయణ అభిప్రాయపడ్డారు.
చంద్రబాబు...రాజకీయ హత్యలు
అయినా చంద్రబాబు రాజకీయహత్యలు మాత్రమే చేస్తారని నారాయణ సంచలన వ్యాఖ్య చేశారు. ప్రస్తుతం ఎపిలో సెంటిమెంట్ రాజకీయాలు నడుస్తున్నాయని నారాయణ విశ్లేషించారు. తాము ముందునుంచే ప్రధాని నరేంద్రమోడీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడని ఎంత చెప్పినా చంద్రబాబు వినిపించుకోలేదన్నారు. ప్రధాని మోడీ తీరు వల్లే కాంగ్రెస్, టీడీపీ ఒక్కటయ్యాయని అభిప్రాయపడ్డారు.