గెలుపు మూడ్లోకి వెళ్లిపోయిన వైసీపీ...జగన్ పీకేల ఫస్ట్ మీటింగ్లో ఏం జరిగింది...?
Recommended Video
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిశాయి. ఇక ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. మే 23 వరకు ఫలితాల కోసం వేచిచూడాల్సిందే. ఈ క్రమంలోనే నేతలు నాయకులు తమ అంచనాలను వేసుకుంటున్నాయి. పోలింగ్ శాతం ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వ వ్యతిరేకతకు దారి తీస్తోందని వైసీపీ అంచనా వేస్తుండగా... విజయం మాత్రం తమనే వరిస్తుందని టీడీపీ లెక్కలు వేస్తోంది. ఇదిలా ఉంటే వైసీపీకి ముందునుంచి ఒక వ్యూహాన్ని అమలు చేస్తూ ఆ పార్టీకి పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ కార్యాలయానికి వైసీపీ అధినేత జగన్ తొలిసారి వెళ్లారు. అక్కడి సిబ్బందితో మాట్లాడారు.
ప్రశాంత్ కిషోర్ కార్యాలయానికి తొలిసారి జగన్
ప్రశాంత్ కిషోర్... పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. 2014లో తన వ్యూహాలతో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్కు మకాం మార్చి వైసీపీకి పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా వ్యవహరించారు. ప్రశాంత్ కిషోర్ తీసుకున్న నిర్ణయాలు కొన్ని వివాదాస్పదమైనప్పటికీ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకే అలాంటి నిర్ణయాలు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఏపీలో ఎన్నికలు ముగిశాయి.ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసిన తర్వాత వైసీపీలో ధీమా కనిపిస్తోంది. పోలింగ్ శాతం ఎక్కువ అవడంతో అది తమకు కలిసొస్తుందని ఆపార్టీ భావిస్తోంది. ఈ క్రమంలోనే నిన్న లోటస్ పాండ్లో వైసీపీకి పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ఆ పార్టీ అధినేత జగన్ను తొలిసారి కలిశారు. పోలింగ్ సరళిపై వీరిద్దరూ చర్చించారు. పోలింగ్ ట్రెండ్ను చూస్తే వైసీపీకి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు.
పాదయాత్ర విజయం వెనక ప్రశాంత్ కిషోర్ కీలకపాత్ర
లోటస్ పాండ్ నుంచి ప్రశాంత్ కిషోర్ కార్యాలయానికి జగన్ వెళ్లారు. అక్కడి సిబ్బందిని జగన్ అభినందించారు. పాదయాత్రతో క్షేత్ర స్థాయిలోకి వెళ్లి ప్రజల కష్టాలను తెలుసుకోగలిగానని జగన్ వ్యాఖ్యానించారు. ఇలానే కష్టపడితే 2024లో కూడా వైసీపీ అధికారంలోకి వస్తుందని జగన్ అన్నారు. తన పాదయాత్ర విజయవంతం కావడానికి ప్రశాంత్ కిషోర్ కీలక పాత్ర పోషించారని అందుకు ఆయన్ను అభినందించారు జగన్.ప్రజల్లోకి వెళ్లి వారితో మమేకం అవడం వల్లే భారీ మెజార్టీని ప్రజలు అందివ్వబోతున్నారని జగన్ సంతోషం వ్యక్తం చేశారు.
ఏపీకి జగన్ సుపరిపాలన అందిస్తారు: ప్రశాంత్ కిషోర్
ఆంధ్రప్రదేశ్కు జగన్ కచ్చితంగా సీఎం అవుతారని అన్నారు ప్రశాంత్ కిషోర్. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సుపరిపాలన జగన్ అందిస్తారన్న పూర్తి నమ్మకం తనకు ఉందని చెప్పారు. దేశంలోనే అత్యుత్తమ పాలన అందించాలని చెబుతూ జగన్కు శుభాకాంక్షలు తెలిపారు ప్రశాంత్ కిషోర్. తన ముందు ఏపీ భవిష్యత్ సీఎం ఉన్నారంటూ తన సిబ్బందికి పరిచయం చేశారు ప్రశాంత్ కిషోర్. జగన్ ప్రశాంత్ కిషోర్ కార్యాలయానికి ఎంటర్ అవగానే... సీఎం సీఎం అంటూ సిబ్బంది నినదించారు. ఇక సమావేశం ముగిసిన తర్వాత వీరిద్దరూ కాస్త భావోద్వేగానికి గురైనట్లు తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా జగన్ - ప్రశాంత్ కిషోర్ల మధ్య మంచి అనుబంధం కొనసాగింది. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ తన సొంత రాష్ట్రం బీహార్కు వెళ్లి అక్కడ తన రాజకీయ కార్యకలాపాలపై దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది.