హోదా ఇవ్వండి.. ఆర్దికంగా ఆదుకోండి: షాకు సీఎం జగన్ వినతి : వారికి కలవకుండానే..సడన్ గా తిరుగు ప్రయాణం.
ఒక రోజు నిరీక్షణ తరువాత ముఖ్యమంత్రి జగన్ కు అమిత్ షా అప్పాయింట్ మెంట్ ఖరారైంది. దాదాపు 45 నిమిషాల సేపు జగన్ కేంద్ర హోం మంత్రితో సమావేశమయ్యారు. అనేక అంశాల మీద చర్చలు చేసారు. రాష్ట్రంలో ఆర్దిక పరిస్థితులను వివరించారు. అమిత్ షా జన్మదినం కావటంతో ముందుగా ఆయనకు పార్టీ ఎంపీలతో కలిసి శుభాకాంక్షలు చెప్పారు.
వైఎస్ జగన్ సంచలనం: ఇసుక, మద్యం రవాణా బాధ్యత నిరుద్యోగ యువతకు: ఓసీలు అనర్హులు!
అనంతరం పోలవరం రివర్స్ టెండిరింగ్ ద్వారా ఏ మేరకు ఆదా అయిందీ వివరించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే దిశగా చర్యలు తీసుకోవాలని అభ్యర్ధించారు. రెవిన్యూ లోటు భర్తీ చేయాలని కోరారు. పీపీఏల సీమీక్ష ఎందుకు కోరుకుంటుందీ వివరించారు. అదే విధంగా బొగ్గు నిల్వలు అందేలా చూడాలని వినతి పత్రంలో కోరారు. అయితే, అమిత్ షాతో భేటీ తరువాత కేంద్ర మంత్రులు రవి శంకర్ ప్రసాద్.. ప్రహ్లాద్ జోషీ తో సమావేశం కోసం అప్పాయింట్ మెంట్ తీసుకు న్నారు. కానీ, అమిత్ షాతో భేటీ ముగిసిన వెంటనే ముఖ్యమంత్రి జగన్ ఆకస్మికంగా ఆ మంత్రులను కలవకుండానే ఏపీకి తిరుగు పయనమయ్యారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వండి...
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని సీఎం జగన్ మరోసారి అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక హోదా, రెవెన్యూలోటు కింద రావాల్సిన నిధులు, పోలవరం అంచనాలకు ఆమోదం, విభజన చట్టంలోని హామీలు, వెనకబడ్డ జిల్లాలకు నిధులు, నాగార్జునసాగర్, శ్రీశైలంలకు గోదావరి వరదజలాల తరలింపుపై సీఎం వైఎస్ జగన్ అమిత్ షాతో చర్చించారు. రాష్ట్ర విభజన పరిశ్రమలు , సేవా రంగాలపై ప్రతికూల ప్రభావం చూపిందని తెలిపారు. ఆదాయంలో ఈ రంగాల వాటా 76.2 శాతం నుంచి 68.2 శాతానికి తగ్గిందన్నారు. ప్రత్యేక హోదా ద్వారానే ఈ సమస్యలను అధిగమించగలమని అమిత్ షాకి సీఎం వైఎస్ జగన్ వివరించారు. 201-15 రెవెన్యూ లోటును కాగ్తో సంప్రదించి సవరిస్తామని గతంలో ఇచ్చిన హామీని అమిత్షాకు గుర్తుచేశారు. ఆ మేరకు సంబంధిత శాఖలకు తగిన ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో పారిశ్రామిక అభివృద్ధికోసం రాష్ట్ర పునర్ విభజన చట్టంద్వారా కడపలో స్టీల్ప్లాంట్ నిర్మాణం చేపట్టాలన్నారు. అలాగే ప్రకాశం జిల్లా రామాయపట్నంలో పోర్టు నిర్మాణ అంశాన్నికూడా సీఎం ప్రస్తావించారు. వీటితోపాటు విశాఖపట్నం-చెన్నై ఇండస్ట్రీయల్ కారిడార్, కాకినాడలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ప్రాజెక్టుల పూర్తికి కావాల్సిన నిధులను సమకూర్చాల్సిందిగా కోరారు.
పోలవరంకు నిధులు కేటాయించండి..
పోలవరం ప్రాజెక్టులో తమ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ ద్వారా దాదాపు రూ.838 కోట్లు ఆదా చేయగలిగామని సీఎం వివరించారు. అదే సమయంలో పోలవరం ప్రాజెక్టులో సవరించిన అంచనాల ప్రకారం రూ. 55,548.87 కోట్లకు ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. అందులో రూ.33వేలకోట్లు భూసేకరణ, ఆర్ అండ్ ఆర్కు ఖర్చు అవుతుందని తెలిపారు. రాష్ట్రప్రభుత్వం ఖర్చుచేసిన రూ. 5,073 కోట్లను వెంటనే విడుదలచేయాలని కోరారు. ఈ ఆర్థిక సంవత్సరంలో భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ కోసం రూ.16 వేల కోట్లు ఇవ్వాల్సి ఉందన్నారు. వీలైనంత త్వరలో నిధులు ఇవ్వడానికి సంబంధిత మంత్రిత్వశాఖను కోరాలన్నారు. వెనకబడ్డ జిల్లాలకు కేటాయించే నిధుల క్రైటీరియాను మార్చాలన్నారు. ఏపీలో వెనకబడ్డ జిల్లాల్లో తలసరి రూ. 400 రూపాయలు ఇస్తే, బుందేల్ఖండ్, కలహండి ప్రాంతాలకు తలసరి రూ. 4000 ఇస్తున్నారని చెప్పారు. అదే తరహాలో ఏపీలోని వెనకబడ్డ జిల్లాలకు ఇవ్వాలన్నారు. ఏపీలో వెనకబడ్డ 7 జిల్లాలకు ఇప్పటివరకూ రూ. 2100కోట్లు ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ. 1050 కోట్లుమాత్రమే ఇచ్చారని.. మిగిలిన మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి వినతి పత్రాన్ని సమర్పించారు.
వారిని కలవకుండానే..తిరుగు పయణం..
అమిత్ షాతో భేటీ తరువాత ముఖ్యమంత్రి జగన్ న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ అదే విధంగా బొగ్గు శాఖా మంత్రి ప్రహ్లాద్ జోషీల అప్పాయింట్ మెంట్ కోరారు. వారు సైతం సమయం కేటాయించారు. అయితే, అమిత్ షా తో సమావేశం తరువాత ముఖ్యమంత్రి జగన్ వారిని కలవకుండానే ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో నేరుగా విశాఖకు బయల్దేరారు. ముఖ్యమంత్రి ఆ ఇద్దరిని ఎందుకు కలవలేదనే దాని పైన బిన్న వాదనలు వినిపిస్తున్నాయి. రవి శంకర్ ప్రసాద్ అప్పాయింట్ మెంట్ వాయిదా వేసారని సమాచారం ఇచ్చారని చెబుతున్నారు. అయితే, అమిత్ షా తో భేటీ తరువాత త్వరలోనే సంబంధిత మంత్రులతో అన్ని అంశాల పరిష్కార దిశగా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తానని అమిత్ షా హామీ ఇచ్చినట్లు సమాచారం. దీంతో..ఇతర మంత్రులను ప్రత్యేకంగా కలవాల్సిన అవసరం లేదని చెప్పారని..దీంతోనే సీఎం జగన్ అక్కడ అమిత్ షా తో సమావేశం ముగిసిన తరువాత నేరుగా విశాఖకు బయల్దేరినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.