జగన్కు ఆర్&బీ గెస్ట్ హౌజ్: 'బడ్జెట్ సెషన్స్' కోసం విడిది అక్కడే!
జగన్ కు రాజధాని అమరావతిలో నివాసం లేకపోవడంతో తొలుత విజయవాడలోని స్టేట్ గెస్ట్ హౌజ్ లో ఆయనకు విడిది ఏర్పాటు చేయాలని భావించినప్పటికీ అది కుదరలేదు.
విజయవాడ: ఏపీ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి విడిది కోసం అధికారులు ఆర్&బి గెస్ట్ హౌజ్ కేటాయించారు. ఈ మేరకు ప్రోటోకాల్ డిపార్ట్ మెంట్ నుంచి ఆర్&బీ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.
జగన్కు కేటాయించిన ఈ అతిథి గృహంలో మొత్తం ఐదు గెస్ట్ రూమ్స్, ఒక విజిటర్ హాల్, ఒక కిచెన్ మరియు పార్కింగ్ అవసరమైన మేర స్థలం ఉన్నాయి. కాగా, ప్రోటోకాల్ నిబంధనల ప్రకారం ప్రతిపక్ష నేతకు విడిది గృహం కేటాయించాల్సిన బాధ్యత శాసనసభ వ్యవహారాల శాఖపై ఉంటుంది.
ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్ లో క్వార్టర్స్ ఉండటంతో వాటిని నేతలకు కేటాయించేవారు. రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. కొత్త రాజధాని అమరావతిలో క్వార్టర్స్ లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా వేరే భవనాలను ప్రభుత్వం నేతలకు కేటాయిస్తోంది.
కాగా, అమరావతిలో క్వార్టర్స్ లేకపోవడంతో ఎమ్మెల్యేల విడిది కోసం ప్రభుత్వం అదనంగా రూ.50వేలను ఎమ్మెల్యేలకు చెల్లిస్తోంది. జగన్ కు రాజధాని అమరావతిలో నివాసం లేకపోవడంతో తొలుత విజయవాడలోని స్టేట్ గెస్ట్ హౌజ్ లో ఆయనకు విడిది ఏర్పాటు చేయాలని భావించినప్పటికీ అది కుదరలేదు.
అయితే వైసీపీ నేతల నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు జగన్ కు ప్రత్యేకంగా ఆర్&బీ గెస్ట్ హౌజ్ ను కేటాయించినట్లు ప్రోటోకాల్ అడిషనల్ సెక్రటరీ, లెఫ్టినెంట్ కల్నల్ ఎం.అశోక్ తెలిపారు.