ఇప్పుడొస్తావా.. జగన్కు టిట్లీ దెబ్బ: శ్రీకాకుళం జిల్లాలోకి అడుగు, జడ్ ప్లస్ సెక్యూరిటీ
శ్రీకాకుళం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఆదివారం కురుపాం నియోజకవర్గం తురకనాయుడు శివారు నుంచి ప్రారంభమైంది. జగన్ను చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. నగురు, దట్టివలస క్రాస్ రోడ్డు, చిలకం క్రాస్ రోడ్డు, రావివలస క్రాస్ రోడ్డు మీదుగా శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గంలోకి ప్రవేశిస్తారు.
అక్కడి నుంచి కెల్ల, నడిమికెల్ల వరకు జగన్ పాదయాత్ర కొనసాగుతుంది. జగన్కు శ్రీకాకుళం జిల్లాలోకి ఘన స్వాగతం పలికేందుకు అభిమానులు, కార్యకర్తలు, నేతలు సిద్ధమయ్యారు. తమ పార్టీ అధినేతకు దాదాపు వెయ్యి కార్లతో స్వాగతం పలికేందుకు నేతలు సిద్ధమయ్యారు.
తెలంగాణ నుంచి హామీ ఇస్తున్నా!: ఏపీకి ప్రత్యేకహోదాపై సోనియా గాంధీ ప్రకటన
వెయ్యి కార్లతో స్వాగతం
విజయనగరం జిల్లాలో ఆదివారం సాయంత్రానికి జగన్ పాదయాత్ర ముగుస్తుంది. అనంతరం వీరఘట్టం మండలంలోని కెల్ల గ్రామానికి జగన్ చేరుకుంటారు. ఇక్కడ ఆయనకు స్వాగతం పలికేందుకు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని, వెయ్యి కార్లతో స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉండాలని ఆ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ భూమన కరుణాకర్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభం కానున్న యాత్ర రాజాంలోని బహిరంగ సభతో ముగుస్తుంది.
జగన్కు జడ్ ప్లస్ భద్రత
మరోవైపు, విశాఖపట్నంలోని విమానాశ్రయంలో జరిగిన దాడి నేపథ్యంలో జగన్కు ప్రభుత్వం భద్రతను మరింత పెంచింది. మాజీ సీఎం కుమారుడిగా, ప్రతిపక్ష నేతగా ఆయనకు జడ్ ప్లస్ భద్రత కల్పిస్తారు. ఇద్దరు డీఎస్పీలు, ఇద్దరు సీఐలు, ఆరుగురు ఐఏఎస్లు, అరవై మంది ఏఎస్ఐలు, సివిల్ పోలీసులు జగన్ పాదయాత్రలో భద్రత కల్పిస్తారు.
నిత్యం అప్రమత్తంగా ఉండాలని ఆదేశం
ప్రత్యేక భద్రతలో భాగంగా స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, హోంగార్డులు నిత్యం రక్షణగా ఉంటారు. జగన్ పాదయాత్రపై శనివారం డీఎస్పీ, ఆర్మ్డ్ రిజర్వ్ ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీలతో ఎస్పీ త్రివిక్రమ్ వర్మ సమీక్ష నిర్వహించారు. నిత్యం అప్రమత్తమంగా ఉండాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా చూడాలని ఆదేశించారు.
జగన్కు టిట్లీ దెబ్బ
శ్రీకాకుళం జిల్లాలో టిట్లీ తుఫాను బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పర్యటించారు. కానీ ప్రతిపక్ష నేత జగన్ మాత్రం పక్కనే ఉన్న విజయనగరంలో పర్యటించినా.. పరామర్శకు రాలేదు. దీనిపై టీడీపీ నేతలు పదేపదే విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో టిట్లీ తుఫాను బాధితులు ఆయనను అడ్డుకునే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అయితే జగన్ వెళ్లకపోయినప్పటికీ పార్టీ నుంచి పలువురు నేతలు పరామర్శకు వెళ్లారు. వైసీపీ కార్యకర్తలు బాధితులకు అండగా నిలబడ్డారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
పరామర్శకు రాకుండా జిల్లాలోకి ఇప్పుడు ఎలా వస్తారు?
జగన్ శ్రీకాకుళం జిల్లాలో అడుగుపెడుతున్న నేపథ్యంలో టీడీపీ కేడర్ నిరసనలకు దిగుతోంది. టీడీపీ నేతలు శనివారమే పలుచోట్ల మీడియా సమావేశం ఏర్పాటు చేసి జగన్ పైన మండిపడ్డారు. జగన్ ఏ ముఖం పెట్టుకొని జిల్లాలోకి వస్తారని ప్రశ్నిస్తున్నారు. పలువురు టీడీపీ నేతలు భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. టిట్లీ తుఫాను బాధితుల పరామర్శకు రాని జగన్ జిల్లాలోకి ఇప్పుడు ఎలా వస్తున్నారని 22 ప్రశ్నలతో లేఖాస్త్రం సంధిస్తున్నారు.