రోజాకు జగన్ హ్యాండ్: కొలగట్లకు దక్కని బెర్త్: ముగ్గురు నానిలకు దక్కిన ఛాన్స్..!
వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజాకు జగన్ హ్యాండ్ ఇచ్చారు. వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా తనకు మంత్రి పదవి ఖాయమనే ధీమాతో ఉన్నారు. అయితే, చివరకు ప్రకటించిన జాబితాలో రోజా పేరు లేదు. ఇక, విజయనగరం జిల్లా నుండి మంత్రి పదవి ఖాయమని నమ్ముకున్న కొలగొట్ల వీరభద్రస్వామికి ఛాన్స్ దక్కలేదు. ఆయన కంటే పార్టీలో జూనియర్గా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్కు పదవి దక్కింది. ఇక, వైసీపీలో కీలక వాయిస్గా ఉన్న పార్ధసారధిని పక్కన పెట్టారు. ముగ్గురు నానీలు ఇప్పుడు జగన్ కేబినెట్లో మంత్రులుగా ఉన్నారు...
రోజాకు షాకింగ్ న్యూస్...
వైసీపీలో కీలక మహిళా నేతగా ఉన్న రోజాకు మంత్రి పదవి దక్కలేదు. తొలి నుండి స్పీకర్ అని..డిప్యూటీ స్పీకర్ అంటూ ప్రచారం సాగింది. అయితే, తొలి నుండి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పదవి ఖాయమని చెబుతూ..అదే సామాజిక వర్గానికి..అదే జిల్లాకు చెందిన రోజాకు మంత్రి పదవి పైన అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. కేబినెట్ కూర్పు గురించి వివరించేందుకు జగన్ ఏర్పాటు చేసిన శాసనసభా పక్ష సమావేశానికి హాజరైన రోజా ఆ సమయంలోనూ తనకు మంత్రి పదవి ఖాయమని చెప్పుకొచ్చారు. అయితే, సామాజిక సమీకరణాల కారణంగానే రోజాకు మంత్రి పదవి ఇవ్వలేదని..సముచిత స్థానం కల్పించటం ఖాయమని వైసీపీ ముఖ్య నేతలు చెబుతున్నారు. అయితే, రోజాకు మంత్రి పదవి లేకుండా పక్కన పెట్టటం పైన వైసీపీతో పాటుగా రాజకీయంగానే చర్చ మొదలైంది.
కొలగొట్ల..పార్ధసారధికి
దక్కని
ఛాన్స్..
విజయనగరంలో వైసీపీకి ఆర్దికంగా..అన్ని రకాలుగా అండగా నిలిచిన వైశ్య సామాజిక వర్గానికి చెందిన కొలగొట్ల వీర భద్రస్వామి పేరు చివరి నిమిషంలో వైశ్య సామాజిక వర్గం నుండి విజయవాడ పశ్చిమం నుండి గెలిచిన వెల్లంపల్లి శ్రీనివాస్కు అవకాశం ఇచ్చారు. ఇదే కృష్ణా జిల్లా నుండి బీసీ నేతగా ఉన్న పార్ధసారధికి అవకాశం దక్కుతుందని అందరూ భావించారు. అయితే, ఈ జిల్లా నుండి వైశ్య, కాపు, కమ్మ వర్గానికి ప్రాతినిధ్యం ఇచ్చిన జగన్ బీసీలకు ఇక్కడ అవకాశం ఇవ్వలేదు. జగన్ కొత్త కేబినెట్లో ఆళ్ల నాని, పేర్ని నాని, కొడాలి నాని మంత్రులుగా అవకాశం దక్కించుకు న్నారు. అదే విధంగా అంబటి రాంబాబు, భూమన కరుణాకర రెడ్డి, పవన్ కళ్యాణ్ పైన గెలుపొందిన గ్రంధి శ్రీనివాస్ మంత్రి పదవులు ఆశించారు. అయితే, వీరికి అవకాశం దక్కలేదు.