మరో విషయంలో మాట తప్పిన జగన్- ఇక వారికీ రూట్ క్లియర్ అయినట్లే !
వైఎస్సార్సీపీ అధినేత, సీఎం జగన్ మరో విషయంలో మాట తప్పారు. విపక్ష పార్టీల నుంచి వచ్చే ప్రజాప్రతినిధులను ఆయా పార్టీలకు గుడ్ బై చెప్పాకే వైసీపీలోకి తీసుకుంటామని నిబంధన పెట్టిన జగన్.. ఇప్పుడు రాజీనామా ఆమోదం పొందని టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ కు కండువా కప్పేశారు. దీంతో భవిష్యత్తులో రాజీనామాలు ఆమోదం పొందని నేతలంతా వైసీపీ బాట పట్టే అవకాశముంది.
ఫిరాయింపులపై జగన్ విధానం
గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో వైసీపీ తరఫున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు తన పార్టీలోకి తీసుకుని కండువా కప్పారు. అభివృద్ధి కోసమే ఎమ్మెల్యేలు వైసీపీని వీడి టీడీపీలోకి వస్తున్నారని చెప్పడమే కాకుండా సదరు ఎమ్మెల్యేలతో కూడా ఇదే చెప్పించేవారు. అప్పట్లో తమ పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలను చంద్రబాబు సంతలో పశువుల మాదిరిగా కొంటున్నారని, ఎమ్మెల్యేలు డబ్బులకు అమ్ముడుపోతున్నారని వైసీపీ తీవ్ర ఆరోపణలు చేసేది. దీంతో తమ పార్టీలోకి వచ్చే ఇతర పార్టీల ప్రజాప్రతినిధులు ఎవరైనా రాజీనామాలు చేసి రావాల్సిందేనని జగన్ ఓ రూల్ తీసుకొచ్చారు.
జగన్ పెట్టిన రూల్ ప్రభావం
వైసీపీలోకి రావాలనుకునే ఇతర విపక్ష పార్టీల నేతలు రాజీనామా చేసి వాటిని ఆమోదింపజేసుకుని రావాల్సిన పరిస్ధితుల్లో గత 9 నెలలో టీడీపీ నుంచి రావాలనుకున్న పలువురు ఎమ్మెల్యేలు దూరంగా ఉండిపోయారు. జగన్ కూడా తమ పార్టీ నిబంధన మేరకు రాజీనామా ఆమోదం పొందాకే వైసీపీలోకి రావాలని, అంతగా టీడీపీని వీడాలనుకుంటే మాత్రం తాము అండగా ఉంటామని మాత్రమే హామీ ఇచ్చారు. దీంతో జనసేన తరఫున ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తో పాటు టీడీపీ అసంతృప్త ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాలి గిరిధర్ ఆ పార్టీకి రాజీనామా చేసినా వైసీపీలో చేరకుండా దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది. వీరంతా తమ రాజీనామాలను తమ అధినేతలకు పంపించారు. వాటిని ఆమోదించడం ద్వారా వైసీపీలోకి వెళ్లేందుకు ఎందుకు రూట్ క్లియర్ చేయాలని చంద్రబాబు, పవన్ భావించారు. అందుకే వారి రాజీనామాలు అధినేతల వద్ద అలాగే పెండింగ్ లో ఉన్నాయి. దీంతో ఎవరి పని వారు చూసుకుంటున్నారు.
డొక్కా విషయంలో మాత్రం..
గతంలో టీడీపీ ఎమ్మెల్యేలు తమ రాజీనామా పత్రాలు అధినేత చంద్రబాబుకు పంపినా వాటిని స్పీకర్ కు పంపకపోవడం, ఆమోదం పొందకపోవడం వంటి కారణాలతో వారిని జగన్ వైసీపీలో చేర్చుకోలేదు. కానీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ విషయంలో మాత్రం జగన్ ఎందుకో అలా వ్యవహరించలేకపోయారు. ఇవాళ సాయంత్రం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో డొక్కాకు జగన్ కండువా కప్పేశారు. దీంతో అవాక్కవడం వైసీపీ నేతల వంతయింది. జగన్ ఇలా పార్టీలో చేర్చుకుంటారని అనుకుంటే ఎప్పుడో చేరిపోయేవాళ్లమని విపక్ష పార్టీల నాయకులు ఇప్పుడు చెవులు కొరుక్కుంటున్నారు.
Recommended Video
మరోసారి మాట తప్పిన జగన్...
ఇప్పటికే పింఛన్ల పెంపు, బీసీ రిజర్వేషన్లతో పాటు పలు విషయాల్లో మాట తప్పారని విపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న జగన్ ఈసారి ఫిరాయింపుల విషయంలో పార్టీ విధానాన్ని పక్కనబెట్టి మరీ డొక్కాకు తలుపులు తెరవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పార్టీకి అంతగా అవసరం అనుకుంటే మండలి ఛైర్మన్ వద్దకు వెళ్లి రాజీనామా అమోదించుకున్నాక రావాలని డొక్కాకు సూచిస్తే సరిపోయే దానికి జగన్ అవేమీ పట్టించుకోకుండా కండువా కప్పేయడం ఇప్పుడు సొంత పార్టీ నేతలను సైతం కలవరపెడుతోంది. ఇదే పరిస్ధితి కొనసాగితే భవిష్యత్తులో పార్టీని నమ్ముకున్న తమ పరిస్ధితి ఏం కావాలని వారు ప్రశ్నిస్తున్నారు.