బాబుది దిక్కుమాలిన పాలనా.. బహిరంగ లేఖలో జగన్ నిప్పులు
సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వ నిర్లక్ష్యపూరిత వైఖరిని ఎండగడుతూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు బహిరంగ లేఖ రాశారు వైసీపీ అధినేత జగన్.
రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం దుర్మార్గపు పాలన కొనసాగిస్తుందంటూ ప్రతిపక్ష వైసీపీ అధినేత జగన్ ఘాటైన విమర్శలతో బహిరంగ లేఖ రాశారు. విద్య,వైద్య, ఆరోగ్య సంక్షేమ పథకాల్లో ప్రభుత్వ నిర్లక్ష్యపూరిత వైఖరిని ఎండగడుతూ లేఖలో తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు జగన్. టీడీపీ ప్రభుత్వం అరాచాకాల వల్ల రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తికి భరోసా లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.
బలవంతంగా భూములు లాక్కుంటున్నారు?
రాష్ట్రంలో సంక్షేమ పథకాల పనితీరు అధ్వాన్నంగా ఉన్నందువల్ల.. విద్య, వైద్యం కోసం రాష్ట్ర ప్రజలు తమ పొలాలు అమ్ముకోవాల్సిన దుస్థితి తలెత్తిందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆఖరికి పొలాలు అమ్ముకుందామనుకున్నా.. రిజిస్ట్రేషన్లు బంద్ చేయించి బలవంతంగా వారినుంచి భూములు లాక్కుంటున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ విషయాన్ని బాధితులు తనతో చెప్పినప్పుడు తీవ్రంగా ఆవేదన చెందానని చెప్పుకొచ్చిన జగన్.. ఇదేం దుర్మార్గం చంద్రబాబు గారూ? అంటూ ప్రశ్నించారు.
దిక్కుమాలిన పాలనా :
చంద్రబాబు గారి పాలనా పుణ్యమాని రాష్ట్ర ప్రజలు వైద్యం కోసం భూములను అమ్ముకోవాల్సి వస్తుందంటే.. మీరెంత దిక్కుమాలిన పాలనా చేస్తున్నారు? అంటూ దుయ్యబట్టారు జగన్. నెట్ వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ అమలు అధ్వాన్నంగా ఉందన్న బుద్ది, జ్ఞానం చంద్రబాబుకు ఏ కోశానా లేకుండా పోయిందని విమర్శించిన జగన్.. దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిందిగా డిమాండ్ చేశారు.
పథకం ప్రకారమే ఆరోగ్యశ్రీపై దెబ్బ..
పథకం ప్రకారమే సీఎం చంద్రబాబు ఆరోగ్యశ్రీని బలహీనపరుస్తున్నారని జగన్ ఆరోపించారు. రాష్ట్రంలో పేదలకు, బలహీన వర్గాల వారికి అండగా నిలిచిన ఆరోగ్యశ్రీని పథకం ప్రకారం బలహీనపరిచారా లేక మీ అసమర్థత వల్ల ప్రాణాలు పోసే పథకాన్ని బలహీనపరుస్తున్నారా అన్నది తేలాల్సిన సమయం వచ్చిందని జగన్ లేఖలో పేర్కొన్నారు.
ఎన్టీఆర్ పేరు పెట్టడమే సంతోషమే కానీ..
ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ ఆరోగ్య సేవగా మార్పు చేశారని, అయినా సంతోషమేనని జగన్ అన్నారు. అయితే తమ బాధంతా.. ఎన్టీఆర్ ఆరోగ్యానికి ఆయన చివరి రోజుల్లో తమరు ఎలాంటి అమూల్యమైన సేవలు అందించారో ఈ పథకానికి కూడా అలాంటి సేవలే అందించి కోట్ల ప్రజలకు సంజీవని అయిన పథకానికి ఎక్కడ పాడె కడుతారోనన్నదే తమ ఆందోళన అని చంద్రబాబుపై తీవ్రస్థాయి ఆరోపణలు చేశారు.
నిధుల లెక్క తేల్చండి..
ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి 2016-17 సంవత్సరానికి కనీసంగా రూ.910.77కోట్ల అవసరమవుతాయని, కానీ ప్రభుత్వం కేటాయించింది మాత్రం రూ.568.23కోట్లేనని జగన్ లేఖ ద్వారా వెల్లడించారు. ఈ రెండింటికి చాలా వ్యత్యాసం ఉందని, మార్చిలో బడ్జెట్ ప్రవేశపెట్టేనాటికే ఏకంగా రూ.359.69కోట్లు ఆరోగ్యశ్రీ బకాయిలు ఉన్నాయని గుర్తుచేశారు.
కార్పోరేట్ ఆసుపత్రుల్లోనే గాక ప్రభుత్వ ఆసుపత్రుల్లోను ఆరోగ్యశ్రీ పథకం పడకవేస్తున్న పరిస్థితి నెలకొందని జగన్ లేఖలో తెలిపారు.
డిసెంబర్ 9న ధర్నా:
తెల్లకార్డు ఉండికూడా వైద్య సదుపాయం పొందలేక ప్రజలు అవస్థలు పడుతున్నారని, తక్షణం టీడీపీ ప్రభుత్వం తమ తప్పుల్ని సరిదిద్దుకోవాలని జగన్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రంలో వైద్య పరిస్థితులపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని డిసెంబర్ 9న ధర్నా చేపట్టబోతున్నామని జగన్ లేఖ ద్వారా ప్రకటించారు. రోగులను, వారి బంధువులను కలుపుకుని కలెక్టరేట్ల ముందు ధర్నాకు దిగుతామని స్పష్టం చేశారు.