పోలీసు చరిత్రలో జగన్కు ఒక పేజీ ఉంటుంది.. రేపటి నుంచే వీక్లీ ఆఫ్లు అమలు
ఆంధ్రప్రదేశ్ పోలీసులకు శుభవార్త. ఎప్పటి నుంచో వీక్లీ ఆఫ్ కోసం ఎదురుచూస్తోన్న వారి కల ఫలిస్తోంది. ఏపీలో కొత్త ప్రభుత్వం రావడంతో అన్ని నిర్ణయాలు చాలా వేగంగా జరిగిపోతున్నాయి. ఇప్పటికే ఆశావర్కర్ల జీతం రూ.10వేలకు పెంచడం, ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కమిటీని ఏర్పాటు చేయడం, అమ్మఒడి పథకం ఇలా నిర్ణయాలు అన్ని త్వరతగతిన తీసుకుంటున్నారు ముఖ్యమంత్రి వైయస్ జగన్. ప్రతిపక్షనేతగా పాదయాత్ర చేసిన సమయంలో తన దృష్టికి వచ్చిన సమస్యలు, ప్రజలు పడుతున్న ఇబ్బందులకు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక చెక్ పెడుతున్నారు. ఈ క్రమంలోనే పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇస్తామని తన పాదయాత్ర సందర్భంగా హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీని నెరవేర్చుతుండటంతో సీఎం జగన్కు పోలీసు కుటుంబాలు ధన్యవాదాలు తెలుపుతున్నాయి.
ఏపీ పోలీసులకు వారాంతపు సెలవు
ఎండనక, వాననక, చలి అనక నిత్యం ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండేవాడు పోలీస్. అలాంటి పోలీసులు తమ కుటుంబాలను సైతం వదులుకొని డ్యూటీ చేస్తుంటారు. ఇప్పటి వరకు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా పోలీసుల సంక్షేమం కోసం కృషి చేసినా వారికున్న ఏకైక డిమాండ్ను మాత్రం ఎప్పుడూ పట్టించుకోలేదు. అలాంటి సమయంలో సుదీర్ఘ పాదయాత్రలో తన దృష్టికి వచ్చిన పోలీస్ వీక్లీ ఆఫ్ సమస్యపై నాటి ప్రతిపక్షనేత ప్రస్తుత ముఖ్యమంత్రి వైయస్ జగన్ స్పందించారు. శాంతిభద్రతలను పరిరక్షించే క్రమంలో కొన్నిసార్లు పోలీసులు ప్రాణత్యాగాలు కూడా చేస్తుంటారన్న విషయాన్ని గ్రహించిన సీఎం జగన్.... అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీ ప్రకారం వారికి వరాన్ని ప్రకటించారు. పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీచేశారు. దీంతో పోలీసులతో పాటు వారి కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది.
సభలో సీఎం తొలి ప్రకటన..తీర్మానం: జగన్ ఏం చెప్పబోతున్నారు: చంద్రబాబు చేతికి అస్త్రం..!
మధ్యప్రదేశ్లో కూడా వీక్లీ ఆఫ్ ఇచ్చిన కమల్నాథ్ సర్కార్
ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటై నెల రోజులు కూడా పూర్తి కాకుండానే ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు సీఎం జగన్. ఇందులో ఒకటి పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇవ్వడం. గతేడాది డిసెంబరులో ఐదురాష్ట్రాలకు ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో మధ్యప్రదేశ్లో పోలీసులకు వీక్లీ ఆఫ్లు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మధ్యప్రదేశ్ పోలీసులకు అచ్చేదిన్ మొదలయ్యాయి. హామీ ఇచ్చినట్లుగానే పోలీసులకు వీక్లీ ఆఫ్లు ఇచ్చి మాట నిలబెట్టుకుంది కమలనాథ్ ప్రభుత్వం. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కరికీ వీక్లీ ఆఫ్ ఇస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది కమల్ నాథ్ సర్కార్.
సీఎం జగన్కు ధన్యవాదాలు తెలిపిన పోలీసులు
ఆంధ్రప్రదేశ్లో కూడా ముందుగా విశాఖపట్నం, వైయస్ఆర్ జిల్లాలో ఉన్న పోలీసులకు వీక్లీ ఆఫ్ను ప్రయోగాత్మకంగా చేపట్టారు. ఇక బుధవారం నుంచి సీఎం జగన్ ఆదేశాల మేరకు కానిస్టేబుల్ నుంచి సీఐల వరకు వీక్లీ ఆఫ్లు ఇస్తున్నట్లు లా అండ్ ఆర్డర్ డీజీ డాక్టర్ రవిశంకర్ అయ్యన్నార్ తెలిపారు. ప్రతినెలా వారాంతపు సెలవుపై ఫీడ్ బ్యాక్ కూడా తీసుకుంటామన్నారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల పోలీస్ శాఖ ధన్యవాదాలు తెలుపుతోందన్నారు. పోలీసులు ఏడు రోజులు 24 గంటలు డ్యూటీలు చేయడం వల్ల వారి ఆరోగ్యాలు కూడా దెబ్బతింటున్నాయని చెప్పిన డీజీ... వీక్లీ ఆఫ్తో పనిఒత్తిడి తగ్గుతుందని చెప్పారు.