జగన్ పాదయాత్ర: అనుమతిపై గందరగోళం, పొరపాటుపై పొరపాటు, నవ్వులపాలవుతున్న వ్యూహకర్తలు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పాదయాత్ర విషయంలో పోలీసుల అనుమతిపై ఆ పార్టీలో గందరగోళ పరిస్థితి నెలకొంది. నియోజకవర్గాల వారీగా జగన్ ఎక్కడికక్కడ పర్మిషన్ తీసుకుంటారని ఎమ్మెల్యే రోజా ప్రకటించారు.
Recommended Video
అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ పాదయాత్ర విషయంలో పోలీసుల అనుమతిపై ఆ పార్టీలో గందరగోళ పరిస్థితి నెలకొంది. నియోజకవర్గాల వారీగా జగన్ ఎక్కడికక్కడ పర్మిషన్ తీసుకుంటారని ఎమ్మెల్యే రోజా ప్రకటించారు.
జగన్ కుటుంబంలో ముసలం? ఎప్పుడూ 'వివేకా'కే ప్రాధాన్యం.. టీడీపీ వైపు బ్రదర్స్ చూపు!?
అయితే కాసేపటికే జగన్ పాదయాత్రకు భద్రత కల్పించాలంటూ జగన్ డీజీపీకి లేఖ రాశారని వైసీపీ కార్యాలయం ప్రకటించింది. అసలు పాదయాత్రకు పర్మిషన్ అడగకూడదనేది వైసీపీ విధానం. కానీ ఒక పొరపాటును సరిదిద్దుకునేందుకు మరో పొరపాటు చేస్తూ సొంత పార్టీ నేతల మధ్య వైసీపీ వ్యూహకర్తలు నవ్వుల పాలవుతున్నారు.
డీజీపీ వ్యాఖ్యలపైనే చర్చ...
లండన్ పర్యటన నుంచి తిరిగొచ్చిన వైసీపీ అధినేత జగన్ తన పాదయాత్ర సన్నాహాలపై చర్చించేందుకు ఆ పార్టీ సీనియర్ నాయకులతో సమావేశమయ్యారు. విజయసాయిరెడ్డి, ధర్మాన, రోజా, సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మరికొంతమంది నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రధానంగా పాదయాత్రకు అనుమతి తీసుకోవాలంటూ ఆంధ్రప్రదేశ్ డీజీపీ చేసిన వ్యాఖ్యలపైనే చర్చ జరిగింది.
కొత్త నిబంధనలు పెడుతున్నారంటే...
గతంలో పాదయాత్రలు చేసినప్పుడు వైఎస్ రాజశేఖర్రెడ్డి కానీ, చంద్రబాబునాయుడు కానీ పోలీసుల నుంచి అనుమతులు తీసుకోలేదని, అప్పుడు లేని నిబంధనలు కొత్తగా ఇప్పుడు పెడుతున్నారంటే ఇందులో ఏదో మతలబు ఉందని సమావేశంలో పాల్గొన్న వైసీపీ సీనియర్ నాయకులంతా ఒక అభిప్రాయానికి వచ్చారు.
అవసరాన్ని బట్టి ఎక్కడికక్కడ...
జగన్ పాదయాత్రకు అనుమతి విషయం నియోజకవర్గాల సమన్వయకర్తలకు వదిలివేయాలని, అవసరాన్ని బట్టి ఎక్కడికక్కడ కోఆర్డినేటర్లు పోలీసుల వద్ద పర్మిషన్లు తీసుకోవాలనే వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలకు తెలియజేయాలని కూడా జగన్ సూచించారు.
అనుమతి తీసుకునే పాదయాత్ర...
జగన్ తో సమావేశం తర్వాత ఎమ్మెల్యే రోజా మీడియాతో మాట్లాడుతూ.. జగన్ పాదయాత్రకు కచ్చితంగా పర్మిషన్ తీసుకుంటామని ప్రకటించారు. ఏ నియోజకవర్గంలో పాదయాత్ర జరుగుతుందో అక్కడి కోఆర్డినేటర్లు ముందస్తుగా అనుమతి తీసుకుంటారని ఆమె స్పష్టం చేశారు. అంతేకాదు, పనిలో పనిగా టీడీపీ ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శలు చేశారు.
రహస్యంగా ఉంచుతారనుకుంటే...
ఎమ్మెల్యే రోజా ప్రకటనతో వైసీపీ నేతలు ఉలిక్కి పడ్డారు. అంతర్గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రహస్యంగా ఉంచాల్సిందిపోయి రోజా బహిరంగంగా ప్రకటించడంతో సీనియర్లు అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అంతేకాదు, ఈ విషయంపై నేరుగా వైఎస్ జగన్ కూడా రోజాపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఓటమి బాధ నుంచి బయటపడాలనే...
వైసీపీ అధినేత జగన్ పై ఏపీ టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్ విమర్శలు గుప్పించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పాదయాత్రతో జగన్ కు నష్టమే తప్ప లాభం ఉండదని అన్నారు. నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన జగన్ ఆ బాధ నుంచి బయటపడాలన్న తాపత్రయంతోనే పాదయాత్ర చేస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని అనుకోవడం వైసీపీకి తగదని హితవు పలికారు.