అక్రమాస్తుల కేసు.. సీబీఐ కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో జగన్ పిటీషన్
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ కొనసాగుతుంది . తాను ముఖ్యమంత్రి కావటం వల్ల, అధికారిక కార్యక్రమాల నేపధ్యంలో వ్యక్తిగత మినహాయింపు ఇవ్వాలని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని పదేపదే విజ్ఞప్తి చేస్తున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. అయితే సీబీఐ ప్రత్యేక న్యాయ స్థానం మాత్రం జగన్ విజ్ఞప్తిని తోసిపుచ్చి నేరానికి హోదాకు సంబంధం లేదని తేల్చి చెప్తుంది. ఇప్పటికి పలు మార్లు వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటీషన్ ను కొట్టివేసింది.
ఇక ఈ నేపధ్యంలో వచ్చే శుక్రవారం జగన్ అక్రమాస్తుల కేసులో కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. దీంతో ఆయన ఈసారి హైకోర్టును ఆశ్రయించారు. సీఎం జగన్ తన అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టు విచారణ నుంచి వ్యక్తిగత హాజరుపై మినహాయింపు ఇవ్వకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ కోర్టు తనకు వ్యక్తిగత హాజరు మినహాయింపును నిరాకరించడాన్ని జగన్ హైకోర్టులో సవాల్ చేశారు.
ఏపీ ముఖ్యమంత్రిగా పరిపాలనాపరమైన విధులు నిర్వర్తించాల్సిన బాధ్యత తనపై ఉందని జగన్ తన పిటిషన్లో పేర్కొన్నారు. అందుకే సీబీఐ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఇక గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ మోహన్ రెడ్డి హైకోర్టులో ఇదే తరహాలో పిటిషన్ వేశారు. అయితే సీబీఐ కోర్టు విచారణకు వ్యక్తగతంగా హాజరు కావాలంటూ అప్పట్లో హైకోర్టు ఆదేశించింది. ఇక ఇప్పుడు తాజా పిటీషన్ పై హైకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.