వైజాగ్ స్టీల్పై వైసీపీ వ్యూహమిదే- విపక్షాలకు సరైన కౌంటర్- బహుళ ప్రయోజనకారిగా
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం ఏపీలో రాజకీయ వేడి పుట్టిస్తోంది. అసలే ఎన్నికల వేళ ప్రత్యర్ధులను ఎధుర్కొనేందుకు వ్యూహాల్లో తలమునకలు అవుతున్న వైసీపీకి స్టీల్ ప్లాంట్ వ్యవహారం కొత్త తలనొప్పిగా మారింది. దీంతో స్టీల్ ప్లాంట్పై విపక్షాల దాడిని ఎదుర్కొనేందుకు సీఎం జగన్ వ్యూహాలకు పదునుపెడుతున్నారు. అయితే ఎన్నికల వేళ ఎలాంటి నిర్ణయాలు తీసుకునేందుకు వీల్లేకపోవడంతో ఎన్నికలు ముగియయానే కీలక నిర్ణయం దిశగా అడుగులేస్తున్నారు. ఈ మేరకు ఇవాళ విశాఖలో తనను కలిసిన కార్మిక సంఘాల నేతలకూ జగన్ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
స్టీల్ ప్లాంట్పై వైసీపీ వ్యూహమిదే
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు వీలవుతుందా ? అసలు వైసీపీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోలదా అంటూ విపక్షాలు ప్రశ్నలు సంధిస్తున్న వేళ.. వైసీపీ వ్యూహలకు పదునుపెడుతోంది. ఇప్పటికే విశాఖ నగరంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా భారీ పాదయాత్రకు ప్లాన్ చేస్తున్న వైసీపీ ఇప్పుడు మరో వ్యూహాన్ని కూడా సిద్ధం చేస్తోంది. టీడీపీ తరహాలో పాదయాత్ర చేయడం ద్వారా మైలేజ్ వస్తుందో లేదో తెలియదు కానీ ఇప్పుడు వైసీపీ తీసుకున్న మరో కీలక నిర్ణయం ద్వారా కచ్చితంగా మైలేజ్ రావడం ఖాయమంటున్నారు.
అసెంబ్లీ తీర్మానంతో కేంద్రంపై ఒత్తిడి పెంచే వ్యూహం
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై విపక్షాలు ఒత్తిడి పెంచుతున్న నేపథ్యంలో వారికి కౌంటర్ ఇచ్చేందుకు వైసీపీ ఓ కొత్త వ్యూహం ఎంచుకుంది. ఇందులో భాగంగా కేంద్రం తీసుకున్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో ఓ తీర్మానం చేయాలని వైసీపీ నిర్ణయించింది. ఇందులో కేంద్రం తీసుకున్న నిర్ణయం పర్యవసానాలు, ఉక్కు కర్మాగారం చరిత్ర వంటి అంశాలను ప్రస్తావించడం ద్వారా స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తు చేయబోతోంది. ఈ తీర్మానం కేంద్రానికి పంపడం ద్వారా స్టీల్ ప్లాంట్పై దూకుడుగా ముందుకెళ్లకుండా అడ్డుకట్ట వేయొచ్చని సీఎం జగన్ భావిస్తున్నారు.
అసెంబ్లీ తీర్మానమే ఎందుకంటే ?
స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడం కోసం ఇప్పటికే విశాఖ నగరంతో పాటు రాష్ట్రంలో పలు చోట్ల టీడీపీతో పాటు కమ్యూనిస్టులు కూడా ఉద్యమాలు చేస్తున్నారు. వీరితో పాటు తామూ ఉద్యమాలు చేసినా పెద్దగా ఫలితం ఉండబోదని వైసీపీ భావిస్తోంది. దీంతో పాటు అధికారంలో ఉంటూ దూకుడుగా ఉద్యమాలు చేయాలనుకున్నా సాధ్యం కాదు. కాబట్టి అసెంబ్లీలో తీర్మానం చేయడం ద్వారా వైసీపీ సర్కారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉందన్న సందేశాన్ని ప్రజల్లోకి పంపేందుకు వీలవుతుంది. దీనిపై ఇప్పటినుంచే లీకులు ఇవ్వడం ద్వారా ఎన్నికల్లోనూ గట్టెక్కే అవకాశం ఉంటుందని వైసీపీ అంచనా వేసుకుంటోంది.
Recommended Video
విపక్షాల మద్దతు పొందే వ్యూహం
స్టీల్ ప్లాంట్ కోసం రోడ్లెక్కి ఎన్ని ఉద్యమాలు చేసినా విపక్షాలు వైసీపీతో కలిసి రావడం కష్టం. అలాగని విపక్షాల ఉద్యమాల్లో వైసీపీ పాల్గొనడం కూడా కష్టమే. కానీ అసెంబ్లీ తీర్మానం చేయాల్సి వస్తే దీనికి విపక్షాలు తప్పనిసరిగా మద్దతు ఇవ్వాల్సిన పరిస్ధితి వస్తుంది. వైసీపీ సర్కారు ప్రవేశపెట్టే తీర్మానానికి విపక్షాలు మద్దతు లబిస్తే ఆ మైలేజ్ అంతిమంగా వైసీపీకే దక్కుతుంది. దీంతో భవిష్యత్తులోనూ విపక్షాలను కౌంటర్ చేసే అవకాశం దొరుకుతుంది. కాబట్టి బహుళ ప్రయోజనాలు ఉన్న అసెంబ్లీ తీర్మానం వైపు వైసీపీ ప్రభుత్వం మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.