జగన్ పులిస్వారీ- ఎన్వీ రమణ అభిశంసన కోసం ప్రయత్నాలు- ఢిల్లీలో చావో రేవో...
దేశ చరిత్రలోనే ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో ఓ సుప్రీంకోర్టు జడ్జికి వ్యతిరేకంగా పోరు ప్రారంభించిన ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇక వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. ఇప్పటికే జస్టిస్ ఎన్వీ రమణ వ్యవహారంపై సుప్రీం ఛీఫ్ జస్టిస్ బాబ్డేకు లేఖ రాసిన జగన్.. తుదపరి చర్యల కోసం ఒత్తిడి పెంచేందుకు సిద్ధమయ్యారు. ఈ వారంలో మరోసారి ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి కోవింద్కు ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేయడంతో పాటు కేంద్రంలోని పెద్దలను, ఇతర పార్టీల నేతలను కలిసి రమణ అభిశంసన కోసం ఒప్పించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే ఓ సుప్రీంకోర్టు జడ్జికి వ్యతిరేకంగా అభిశంసన కోసం దేశంలో జరుగుతున్న అతిపెద్ద రాజకీయ ప్రయత్నంగా ఇది మిగిలిపోనుంది. ఇందులో ఎలాగైనా సఫలం కావాలని జగన్ పావులు కదుపుతుండగా.. అడ్డుకునేందుకు అంతకుమించిన ప్రయత్నాలే సాగుతున్నట్లు తెలుస్తోంది.
జస్టిస్ ఎన్వీ రమణ ఉద్వాసనకు ఒత్తిడి...
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ హైకోర్టు న్యాయమూర్తులతో కలిసి ఏపీ ప్రభుత్వాన్ని అస్ధిర పరిచేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపిస్తూ జస్టిస్ ఎన్వీ రమణపై పోరు ప్రారంభించిన సీఎం జగన్.. దాన్ని మరింత మందుకు తీసుకెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు. ఛీఫ్ జస్టిస్ జస్టిస్ బాబ్డేకు ఇదే ఆరోపణలతో లేఖ రాసిన జగన్.. ఆయన నుంచి స్పందన కోసం ఎదురుచూస్తున్నారు. ఆలోపే జస్టిస్ రమణ ఉద్వాసన కోసం ఒత్తిడి పెంచేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలని భావిస్తున్న జగన్.. త్వరలో ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అక్కడ రాష్ట్రపతితో పాటు కేంద్రంలోని పెద్దలు, ఇతర పార్టీల అధినేతల అపాయింట్మెంట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రపతికి ఫిర్యాదుకు నిర్ణయం..
ఈ వారంలో ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో సమావేశం కావాలని సీఎం జగన్ భావిస్తున్నారు. జస్టిస్ రమణ వ్యవహారశైలిపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేయడం ద్వారా ఆయన ఉద్వాసనకు ఒత్తిడి పెంచాలని భావిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరినట్లు తెలుస్తోంది. అది ఖరారు కాగానే జగన్ ఢిల్లీ పర్యటనకు ఏర్పాట్లు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో గతేడాది తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హైకోర్టు న్యాయమూర్తులు ఇస్తున్న పలు తీర్పులు, వాటి పర్యవసానాలు, వాటి వెనుక జస్టిస్ ఎన్వీ రమణ పాత్రకు సంబంధించి అన్ని ఆధారాలను రాష్ట్రపతికి అందించేందుకు జగన్ రంగం సిద్ధం చేస్తున్నారు. వీటిలో కొన్ని ఆడియోతో పాటు వీడియో ఆధారాలు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
అభింశసస కోసం ప్రయత్నాలు ?
సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి అయిన జస్టిస్ ఎన్వీరమణపై చర్యలు తీసుకునే విషయంలో ఛీఫ్ జస్టిస్ బాబ్డే స్వయంగా కానీ ఓ విచారణ కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంటారని జగన్ భావిస్తున్నారు. అలా కుదరని పక్షంలో పార్లమెంటు అభిశంసన కోసం జగన్ ప్రయత్నిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం త్వరలో ఢిల్లీ పర్యటనలో వివిధ జాతీయ పార్టీలకు చెందిన నేతలను సంప్రదించేందుకు జగన్ ప్రయత్నించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా కేంద్రంలో అధికార బీజేపీ తోడ్పాటు తప్పనిసరి. బీజేపీ సహకరిస్తే చాలు మిగతా పార్టీల సహకారం అవసరం లేకపోయినా అభిశంసనకు వీలు కలుగుతుంది. దీంతో ముందుగా బీజేపీ నేతలను, అదే సమయంలో మిగతా పార్టీల సహకారం కూడా జగన్ కోరబోతున్నట్లు సమాచారం.
బీజేపీనీ ఇరుకున పెడుతున్న జగన్...
జస్టిస్ ఎన్వీరమణపై చర్యల విషయంలో కేంద్రంలోని అధికార బీజేపీని జగన్ ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు మరో ప్రచారం కూడా సాగుతోంది. ఇప్పటికే తాము కోరిన విధంగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్పై సీబీఐ దర్యాప్తుకు కేంద్రం సహకరించని నేపథ్యంలో బీజేపీని ఏదో ఒకటి తేల్చుకోమని జగన్ కోరబోతున్నారా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. దీంతో బీజేపీ కాదంటే ఇతర విపక్షాలతో కలిసి జస్టిస్ రమణపై అభిశంసనకు జగన్ ప్రయత్నించవచ్చని ఢిల్లీ సర్కిళ్లలో ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే బీజేపీయేతర పక్షాల్లో జగన్కు కలిసి వచ్చేదెవరు ? టీఆర్ఎస్ మినహా జగన్కు ప్రస్తుత పరిస్ధితుల్లో నమ్మకమైన మిత్రులెవరు ? జగన్తో సత్సంబంధాలు నడుపుతున్న తమిళనాడు పార్టీలు సహకరిస్తాయా ? అలా కుదరకపోతే జగన్ తిరిగి కాంగ్రెస్ పార్టీవైపు చూస్తారా అన్న చర్చ కూడా సాగుతోంది. ఇందులో ఏదో ఒక నిర్ణయం తప్పనిసరిగా తీసుకోవాల్సిన పరిస్ధితుల్లో జగన్ అడుగులు ఎటు అన్నది ఆసక్తి రేపుతోంది.