రాజ్యసభ ఎన్నికల తర్వాత జగన్ కేబినెట్ విస్తరణ- నాలుగైదు మార్పులు- డిప్యూటీగా కన్నబాబు..?
ఏపీలో గతేడాది వైసీపీ అధికారంలోకి వచ్చాక సుస్ధిర ప్రభుత్వం నడుపుతున్న వైఎస్ జగన్.. త్వరలో కేబినెట్ లో మార్పులు చేర్పులకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. మండలి రద్దు నిర్ణయంతో మాజీలుగా మారనున్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణను రాజ్యసభకు పంపనుండటంతో వారి స్ధానాల్లో మరో ఇద్దరు బీసీలకు అవకాశం కల్పించవచ్చని భావిస్తున్నారు. మరికొందరు మంత్రుల శాఖల్లో మార్పులు కూడా ఉండే అవకాశముంది.
ఏపీ కేబినెట్ మార్పులు-జగన్ కసరత్తు....?
ఏపీలో అధికార పగ్గాలు చేపట్టి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా పార్టీతో పాటు ప్రభుత్వంలోనూ పలు మార్పులకు సీఎం జగన్ సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. తనపై పార్టీ వ్యవహారాల భారం తగ్గించుకునేందుకు సీనియర్ నేత, సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి కొన్ని బాధ్యతలు అప్పగించిన జగన్.. తాజాగా కేబినెట్ లోనూ మార్పులకు సిద్ధమవుతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటు సమయంలో మంత్రులందరికీ రెండున్నరేళ్లు పదవీకాలం ఉంటుందని జగన్ స్పష్టం చేశారు. ఆ తర్వాత 90 శాతం కేబినెట్ లో మార్పులు తప్పవని తేల్చిచెప్పారు. అయితే అనూహ్యంగా మండలి రద్దుతో ఎదురైన పరిస్ధితుల్లో కేబినెట్ లో ఇద్దరి స్ధానాలు భర్తీ చేయక తప్పడం లేదని అర్ధమవుతోంది.
ఇద్దరు మంత్రుల స్ధానాల్లో....
శాసనమండలి రద్దుతో మాజీలుగా మారబోతున్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణారావు స్ధానాల్లో మరో ఇద్దరిని కేబినెట్లోకి తీసుకోక తప్పని పరిస్ధితి. ఇద్దరూ బీసీ మంత్రులకే కావడంతో సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని మరో ఇద్దరు బీసీలకు అవకాశం కల్పించాలని జగన్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. వీరిలో పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రాతినిధ్యం వహిస్తున్న తూర్పుగోదావరి జిల్లా నుంచి ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ కు అవకాశం దక్కవచ్చని చెబుతున్నారు. బీసీల్లోని మత్యకార సామాజికవర్గానికి చెందిన సతీష్ కు కేబినెట్ బెర్త్ వరించే అవకాశముంది. అలాగే కోస్తా జిల్లాల్లోనే మరో బీసీ ఎమ్మెల్యేకు అవకాశం కల్పించేందుకు కసరత్తు జరుగుతోందని తెలుస్తోంది.
డిప్యూటీ రేసులో కన్నబాబు....?
ప్రస్తుతం కేబినెట్ మంత్రుల్లో విద్యాధికుల్లో ఒకరిగా, కీలకమైన శాఖలు, బాధ్యతలు నిర్వర్తిస్తున్న మంత్రి కురసాల కన్నబాబుకు ప్రమోషన్ ఇచ్చేందుకు జగన్ దాదాపుగా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజీనామాతో ఖాళీ అవుతున్న డిప్యూటీ సీఎం పోస్టులో కన్నబాబుకు అవకాశం లభించవచ్చని చెబుతున్నారు. అదే జరిగితే కాపు కోటాలో ఇద్దరు డిప్యూటీ సీఎంలు అవుతారు. ఇప్పటికే ఏలూరు ఎమ్మెల్యే ఆళ్లనాని కాపు కోటాలో డిప్యూటీ సీఎంగా ఉన్నారు. కన్నబాబుకు డిప్యూటీ ఇవ్వాల్సి వస్తే ఆళ్లనాని డిప్యూటీ సీఎం బాధ్యతల్లో మార్పు జరిగే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.
కేబినెట్ పై మరింత పట్టు...
ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా కేబినెట్ లో చేపట్టే మార్పులు మంత్రుల పనితీరుకు సూచికగా... కేబినెట్ పై జగన్ పట్టుకు నిదర్శనంగా ఉండొచ్చని చెబుతున్నారు. ఈ మార్పులతో ఒకరిద్దరి అసంతృప్తికి లోనయినా భవిష్యత్తుపై వారికి హామీ ఇచ్చే అవకాశాలు మెండుగా ఉండబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద నాలుగైదు మార్పులు ఉండొచ్చని తెలుస్తోంది. అందుకే ప్రస్తుతం జగన్ కేబినెట్ మార్పులపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. త్వరలో కేబినెట్ మార్పులపై మరింత క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి.