జగన్ అక్రమాస్తుల కేసు: రూ.148కోట్ల విలువైన నిమ్మగడ్డ ఆస్తుల అటాచ్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో నిమ్మగడ్డ ప్రసాద్ భూములను ఈడీ అటాచ్ చేసింది.
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో నిమ్మగడ్డ ప్రసాద్ భూములను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసింది. రూ. 148.89 కోట్ల విలువైన భూములను అటాచ్మెంట్ చేస్తూ ఈడీ శుక్రవారం ఉత్తర్వులను జారీచేసింది.
జగన్ అక్రమాస్తులకు సంబంధించి వ్యాంపిక్ కేసులో నిమ్మగడ్డ ప్రసాద్ అప్పట్లో అరెస్టు అయిన విషయం తెలిసిందే. నిమ్మగడ్డ ద్వారా జగన్ ప్రయోజనాలు పొందారని, జగన్ సంస్థల్లోకి పెద్ద ఎత్తున డబ్బులు రావడం జరిగిందని, అలాగే నిమ్మగడ్డ కూడా జగన్ తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ద్వారా లబ్ది పొందారని సీబీఐ ప్రధాన ఆరోపణ.
సీబీఐ చార్జిషీటుల ఆధారంగా ఈడీ అధికారులు కూడా చార్జిషీటు దాఖలు చేసి విచారణ జరిపారు. వ్యాంపిక్ భూముల వ్యవహారంలో నిమ్మగడ్డ అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో ఆయన కంపెనీలకు సంబంధించిన 148.89 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేస్తున్నట్లు ఈడీ అధికారులు ప్రకటించారు.