ఆర్టీసీ స్ధలాలపై జగన్ సర్కార్ కన్ను-9 ప్రాంతాలు ఖరారు-33 ఏళ్ల లీజుకు-ఎక్కడెక్కడంటే
ఏపీలో ప్రభుత్వ ఆర్ధిక పరిస్ధితి అంతంతమాత్రంగా మారుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ స్ధలాలను లీజు ప్రాతిపదికన వ్యాపారవేత్తలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా వ్యాపారవేత్తలతో లీజులపై చర్చలు కూడా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. అసలే పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోతున్న ఆర్టీసీని బయటపడేయాలన్నా, ప్రభుత్వానికి ఆర్ధికంగా వెసులుబాటు రావాలన్నా ఇది తప్పనిసరని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఆర్టీసీ ఖాళీ స్ధలాలు ఇక క్రమంగా మాయం కానున్నాయి.
ఆర్టీసీ అప్పుల భారం
ఏపీలో ఆర్టీసీ అప్పుల భారం తడిసిమోపెడవుతోంది. ఉద్యోగుల్ని కార్పోరేషన్ నుంచి వేరు చేసి ప్రభుత్వంలోకి తీసుకోవడం వల్ల అటు ప్రభుత్వంపై ఆర్ధికభారం పెరుగుతుండగా.. కరోనా, చమురు ధరల పెరుగుదల కారణంగా కార్పోరేషన్ పై అప్పుల భారం నానాటికీ తీవ్రమవుతోంది. పాత అప్పులకు వడ్డీలు చెల్లిస్తూ కొత్తగా అప్పులు చేస్తూ ఆర్టీసీ చక్రం ముందుకు నడిపించాల్సిన పరిస్ధితి. ఈ పరిస్ధితిని ముందే గ్రహించిన ఉద్యోగులు ప్రభుత్వంలోకి తమను తీసుకోవాలని ఏళ్ల తరబడి డిమాండ్లు చేసి చివరికి రవాణాశాఖలోకి వచ్చేశారు. దీంతో ఉద్యోగులు సేఫ్ కార్పోరేషన్ లాస్ అన్నట్లుగా పరిస్ధితి మారిపోయింది.
అప్పులాంధ్రప్రదేశ్
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా అలవికాని సంక్షేమ పథకాలను తీసుకొచ్చి ప్రజలపై పెనుభారం మోపే వీలూ లేక అప్పుల పాలవుతోంది. కనీస ఆర్ధిక సూత్రాలు కూడా పాటించకుండా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న భారీ అప్పులతో ఏటికేడాది ప్రభుత్వంపై భారం పెరుగుతూనే ఉంది. ఇక్కడా పాత అప్పులకు వడ్డీలకు కడుతూ, కొత్త అప్పుల కోసం ప్రయత్నిస్తూ అప్పులాంధ్రప్రదేశ్ గా మారిపోతోంది. రాష్ట్ర ఖజానా ఖాళీ కావడంతో ఉద్యోగుల జీతభత్యాలకు సైతం ఎప్పటికప్పుడు కొత్త అప్పులు చేస్తూ ప్రయాణం సాగిస్తోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధుల రాక తగ్గడం కూడా పెను ప్రభావం చూపుతోంది. దీంతో ఆర్టీసీ స్ధలాల విక్రయం లేదా లీజు ప్రతిపాదనలు తెరపైకి వస్తున్నాయి. ప్రస్తుతానికి ఖాళీగా ఉన్న స్ధలాల్ని వాడుకోవడమే కాబట్టి పెద్దగా వ్యతిరేకత ఉండబోదని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
ఆర్టీసీ స్ధలాలపై జగన్ సర్కార్ కన్ను
ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన కార్పోరేషన్ (ఆర్టీసీ) అప్పుల బాటలో పయనిస్తున్న నేపథ్యంలో ఇక చేసేది లేక ఆస్తులు అమ్ముకునే లేదా లీజుకు ఇచ్చుకునే మార్గాలపై దృష్టిపెట్టారు. ఒక్కసారిగా ఆస్తులు అమ్మకానికి పెడితే సమస్యలు ఎదురవుతాయన్న భావనతో వాటిని లీజు ప్రాతిపదికన వ్యాపారవేత్తలకు కట్టబెట్టే్ందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని పలు ఆర్టీసీ బస్టాండ్లకు ఆనుకుని భారీగా కార్పోరేషన్ కు ఉన్న ఖాళీ స్ధలాల్ని లీజుకు ఇచ్చేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. వీటిని ఒక్కొక్కటిగా లీజు పద్ధతిన వ్యాపారవేత్తలకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. ఇందుకోసం త్వరలో చర్చలు ప్రారంభం కానున్నాయి.
తొలి దశలో 9 స్ధలాల ఎంపిక
తొలిదశలో రాష్ట్రంలోని కొన్ని ఎంపిక చేసిన ఆర్టీసీ ఖాళీ స్ధలాల్ని లీజుకు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకోసం 9 స్ధలాలను ఎంపిక చేశారు. వీటిలో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో 12,642 చదరపు గజాలు, విశాఖ జిల్లా తగరపువలసలో 4259 చదరపు గజాలు, గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో 3415 చదరపు గజాలు, తెనాలిలో 2500 చదరపు గజాలు, నరసరావుపేటలో 1542 చదరపు గజాలు, బాపట్లలో 2388 చదరపు గజాలు, నెల్లూరు జిల్లా గూడూరులో 4075 చదరపు గజాలు, అనంతపురం జిల్లా హిందూపురంలో 2200 చదరపు గజాలు, ఉరవకొండలో 1760 చదరపు గజాలు లీజుకు ఇవ్వబోతున్నారు. వీటితో పాటు మరికొన్ని స్ధలాల దశలవారీ లీజులకూ ప్రతిపాదనలు ఉన్నాయి.
బీవోటీ, పీపీపీ విధానంలో 33 ఏళ్లకు లీజులు
ప్రస్తుతం లీజుకు ఇచ్చే ఆర్టీసీ ఖాళీ స్ధలాలను బీవోటీ ( నిర్మాణం, నిర్వహణ, బదలాయింపు), పీపీపీ ( ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం) పద్దతుల్లో వ్యాపార వేత్తలకు ఇవ్వబోతున్నారు. దీని వల్ల ప్రస్తుతానికి ప్రభుత్వంపై ఎలాంటి ఆర్ధిక భారం పడబోదని, దీర్ఘకాలంలో ప్రయోజనం ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికి ఆదాయం, దీర్ఘకాలంలో పెరిగే రేట్లతో ప్రయోజనాల్ని ప్రభుత్వం అంచనా వేసుకుటోంది. ఆర్టీసీ ఖాళీ స్ధలాల లీజులపై ప్రాధమికంగా చర్చించేందుకు ఔత్సాహిక వ్యాపారవేత్తలతో ప్రభుత్వం ఈ నెల 24న విశాఖలో భేటీ ఏర్పాటు చేసింది. ఇందులో వారు వ్యక్తం చేసే అభిప్రాయాల ఆధారంగా తర్వాత టెండర్ల ప్రక్రియకు వెళ్తారని చెప్తున్నారు. 33 ఏళ్ల లీజు ప్రాతిపదికన ఈ ఖాళీ స్ధలాల్ని ఇచ్చేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
Recommended Video
ఆర్టీసీ స్ధలాల లీజులపై విమర్శల వెల్లువ
ఏపీలో ప్రభుత్వ సంస్ధ అయిన ఏపీఎస్ఆర్టీసీకి గతంలో వేలాది ఎకరాల భూముల్ని ప్రభుత్వాలు గతంలో కేటాయించాయి. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్టీసీ బస్టాండులు, ఖాళీ స్ధలాలు విశాలంగా కనిపిస్తున్నాయి. సర్వీసుల సంఖ్య పెరిగినా ఖాళీ స్ధలాల్ని వాడుకునే వెలుసుబాటు కూడా ఉంది. కానీ గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఆర్టీసీ ఖాళీ స్ధలాల విక్రయం లేదా లీజులపై ప్రయత్నాలు మొదలయ్యాయి. అప్పట్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఇప్పుడు వైసీపీ సర్కార్ మరోసారి అవే ప్రతిపాదనల్ని అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఆర్టీసీకి ఉన్న కోట్లాది రూపాయల విలువైన స్ధలాల్ని ప్రైవేటు వ్యక్తులకు, సంస్ధలకు కట్టబెడితే భవిష్యత్తులో పెరిగే అవసరాల సంగతేంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయినా ప్రభుత్వం మాత్రం మొండిగా ముందుకెళ్లడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.