జగన్ రివర్స్ టెండరింగ్కు తొలిషాక్- అదీ నవరత్నాల పథకంలోనే- తప్పని భారం
ఏపీలో వైసీపీ సర్కారు అధికారంలోకి రాగానే గతంలో టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన పలు కాంట్రాక్టులను సమీక్షించింది. వాటికి గతంలో నిర్ణయించిన ధరల కంటే తక్కువ ధరలకు పని పూర్తి చేసేందుకు సిద్ధమైన వారికి రివర్స్ టెండరింగ్ విధానంలో కాంట్రాక్టులు అప్పగించింది. పోలవరం ప్రాజెక్టుతో పాటు పలు కీలక ప్రాజెక్టుల్లో ఇదే పరిస్ధితి. దీని వల్ల భారీగా ప్రజాధనం ఆదా చేస్తున్నట్లు వైసీపీ సర్కారు చెప్పుకుంటోంది. అయితే తాజాగా ప్రభుత్వం నవరత్నాల్లో భాగంగా అమలు చేస్తున్న ఓ కీలక పథకం కోసం నిర్వహించిన రివర్స్ టెండరింగ్ విఫలమైంది. దీంతో ఈ వ్యవహారం చర్చనీయాంశమవుతోంది.
జగన్ మానసపుత్రిక రివర్స్ టెండరింగ్
ఏపీలో గత ప్రభుత్వాల హయాంలో తమకు నచ్చిన వారికి కాంట్రాక్టులు కట్టబెట్టారని, వాటి వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం వాటిల్లుతోందని వైసీపీ ఎప్పటినుంచో ఆరోపిస్తోంది. తాము అధికారంలోకి రాగానే వాటిని సమీక్షిస్తామని ప్రకటించిన జగన్ అన్నంత పనీ చేశారు. వైసీపీ అధికారం చేపట్టగానే కీలకమైన పోలవరం ప్రాజెక్టుతో పాటు ఎన్నో కాంట్రాక్టుల్లో రివర్స్ టెండరింగ్ ద్వారా కోట్లాది రూపాయలు ఆదా చేశారు.
గత ప్రభుత్వాలు చేసిన నిర్ణయాలను తప్పుపట్టే నెపంతో తన వారికి కాంట్రాక్టులు ఇచ్చేందుకే వైసీపీ సర్కార్ రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తున్నారని విపక్షాలు గగ్గోలు పెట్టినా జగన్ మాత్రం వెనక్కి తగ్గలేదు. పీపీఏల విషయంలో మాత్రం కేంద్రం జోక్యంతో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. మిగతా ప్రాజెక్టుల్లో ఇప్పటికీ రివర్స్ టెండరింగ్ అమలు చేస్తూనే ఉన్నారు.
రివర్స్ టెండరింగ్ రివర్స్ అయిన వేళ
వైసీపీ సర్కారు ప్రతిష్టాత్మంగా తీసుకుని అమలు చేస్తున్న రివర్స్ టెండరింగ్ విధానం ఇప్పటికే పలు శాఖల్లో విజయవంతంగా అమలు చేస్తున్నారు. అయితే తాజాగా ఓ ప్రభుత్వ పథకంలో చేపట్టిన రివర్స్ టెండరింగ్ బెడిసి కొట్టింది. ప్రభుత్వం కొరిన విధంగా తక్కువ ధరలకు పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాకపోవడంతో తప్పనిసరిగా వాటిని అధిక ధరలకే అప్పగించాల్సిన పరిస్ధితి నెలకొంది.
ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఎక్కువ ధరకే బిడ్లు దాఖలు కావడంతో చేసేది లేక వాటినే ఆమోదించాల్సిన పరిస్ధితి ఎదురైంది. దీంతో జగన్ మానసపుత్రిక రివర్స్ టెండరింగ్కు రాష్ట్రంలో తొలిసారి ఎదురుదెబ్బ తగినట్లయింది.
జగన్ నవరత్నాల పథకంలోనే షాక్
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోలవరం వంటి భారీ ప్రాజెక్టులతో పాటు చిన్నా చితకా వ్యవహారాల్లో సైతం అమలు చేస్తున్న రివర్స్ టెండరింగ్ విధానం ఇప్పుడు అదే సర్కారు ప్రతిష్టాత్మక నవరత్నాల పథకానికే షాక్ ఇచ్చింది. నవరత్నాల్లో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పేదలకు ఇళ్ల పథకం జగనన్న కాలనీల్లో తొలిసారి రివర్స్ టెండరింగ్ విఫలమైంది. జగనన్న కాలనీల నిర్మాణం కోసం రాష్ట్రస్ధాయిలో 13 వస్తువుల కొనుగోళ్లకు టెండర్లు పిలిచారు. అయితే ఇందులో ఆరు వస్తువులకు రివర్స్ టెండరింగ్ విధానంలో ధరలు నిర్ణయించారు. జిల్లా స్ధాయిలో ఆరు వస్తువులకు రివర్స్ టెండరింగ్ విధానంలో ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే తక్కువ ధరకు టెండర్లు దాఖలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు.
ఎక్కడ రివర్స్ అయిందంటే...
ప్రస్తుతం ప్రభుత్వం పేదలకు జగనన్న కాలనీల పథకంలో భాగంగా ఇళ్లను నిర్మించి ఇస్తోంది. ఇందుకోసం ఒక్కో ఇంటికి లక్షా 80వేలు కేటాయించారు. ఇందులోనే అన్ని వస్తువులు కొనుగోలు చేసి నిర్మించి ఇవ్వాలి. ఇందులో ఇనుము, మరుగుదొడ్డి తలుపులు, తెల్ల సున్నం, పెయింట్, ఎలక్ట్రికల్ సామాగ్రి, ఒడిశా పాన్ ఫర్ టాయిలెట్ (మరుగుదొడ్డి సీటు) కొనేందుకు రూ.30,448 కేటాయించారు. వీటిని నిర్వహించిన రివర్స్ టెండరింగ్లో రూ.35426 ధర ఖరారైంది. అంటే ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఐదు వేల రూపాయలు అదనపు భారం పడుతోంది. దీంతో ప్రతీ ఇంటికీ 5 వేల రూపాయల అదనపు ఖర్చుతో ఇళ్లను నిర్మించక తప్పని పరిస్ధితి ఎదురైంది.