పవన్ నెత్తిన పాలు పోస్తున్న జగన్ వ్యవహార శైలి..! ఇమడలేని నేతల చూపు జనసేన వైపు..!!
హైదరాబాద్: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వైఖరి అర్థం కాకపోవడంతో ఆ పార్టీ నేతలు అయోమయానికి గురౌతున్నరనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఏ రాజకీయ పార్టీలో లేని విచిత్ర పరిస్థితి వైసీపిలో ఏర్పడిందనే చర్చ జరుగుతోంది. పార్టీ అధినేత ఎవరని ఎప్పుడు ఎందుకు ఎక్కడ ఏ పదవుల్లో నియమిస్తారో, ఎందుకు వారిని తొలగిస్తారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయని పార్టీ నేతల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో ఎంతో కాలంగా పార్టీని నమ్ముకుని ఉన్నా చివరి నిమిషంలో న్యాయం జరుగుతుందా అంటే గ్యారెంటీ లేదనే సమాధానం వినిపిస్తోందట. దీంతో పార్టీ పుట్టి ముంచేలోపు మేల్కొని ఇతర పార్టీ పంచన చేరితే సీనియారికి గౌరవమన్నా దక్కుతుందని వైసీపిలో కొందరు నేతలు సమాలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
జగన్ తో ప్రయాణం ప్రమాదమే..! ప్రత్యామ్నాయం పవన్ కళ్యాణే..!!
దీంతో కొందరు చోటామోటా నేతలు, కార్యకర్తలు మరో పార్టీవైపు చూస్తున్నారట. ఈ నేపధ్యంలో వీరందరికీ ప్రత్యామ్నాయంగా పవన్ కల్యాణ్ పార్టీ ‘జనసేన'కనిపిస్తోందని తెలుస్తోంది. ప్రధానంగా ఉభయగోదావరి జిల్లాల్లో ఇటువంటి పరిస్థితి కనిపిస్తోందని సమాచారం. ఇన్నేళ్ల నుంచి పార్టీని నమ్ముకున్నప్పటికీ జగన్ పార్టీ నుంచి అన్యాయమే ఎదురవుతున్నదని పలువురు వాపోతున్నారట.‘జగన్' అనుసరిస్తున్న వైఖరితో ముఖ్యంగా కాపు సామాజికవర్గానికి చెందిన నేతలు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారట. వారంతా జనసేనలోకి వెళ్లడానికి ప్రణాళిక రూపొందించుకున్నారని సమాచారం.
నేతలకు ఎప్పుడు చివాట్లో..!ఎప్పుడు ప్రశంసలో తెలియదు..!జగన్ విచిత్ర మనస్థత్వం..!
దీనికితోడు ఆర్థికంగా మాంచి స్థితిలో న్నవారినే జగన్ ఆదరిస్తున్నారని, వారికే టిక్కెట్లు కేటాయించేందుకు మొగ్గుచూపుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఇన్నాళ్లూ పార్టీ కోసం కష్టించిన వారంతా తమ శ్రమ వృథాగా పోయిందని వాపోతున్నారట. దీనికితోడు జగన్ పార్టీ నేతలకు మరో సమస్య కూడా ఉంది. వారు టీడీపీలో చేరినా ప్రస్తుతం ఆదరణ లభించే పరిస్థితి లేదంటున్నారు. అందుకే వారంతా పవన్ పంచన చేరాలని యోచిస్తున్నారట. అలాగే ఆ పార్టీలో ఉన్న కొంతమంది అసంతృప్తి నేతలు ఇప్పటికే ‘జనసేన' నేతలతో మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. నాలుగున్నరేళ్లు జగన్ పార్టీ కోసం పోరాడామని, తమ పోరాటాలను జగన్ గుర్తించలేకపోయినా, ఇప్పుడు జనసేన అధినేత పవన్ గుర్తిస్తారేమో అని ఆ పార్టీ నేతలు తాపత్రయపడుతున్నట్టు తెలుస్తోంది.
విసిగిన నేతలకు కల్పవ్రుక్షంగా జనసేన..! మంతనాలు మొదలెట్టిన పలువురు నేతలు..!
ఎప్పుడు ఏ నియోజకవర్గ సమన్వయకర్తను బాధ్యతల నుంచి తప్పిస్తారో తెలియడం లేదని, కొత్తగా తిరిగి అక్కడ ఎవరిని నియమిస్తారో అవగతం కావడం లేదని అంటున్నారు. అయితే టిడిపిలో ఇటువంటి పరిస్థితి లేదని, కానీ ఆ పార్టీలో చేరినా తమకు వైకాపాలో ఉన్న సీనియార్టీ పోతుందని కొందరు నేతలు భయపడుతున్నారట. మరికొందరు నేతలు జనసేన లో చేరితే పోటీ చేసే అవకాశం రాకపోయినా జనంలో గుర్తింపు వస్తుందని భావిస్తున్నారట. ఫలింతంగా ఆ పార్టీ నేతలు పవన్ పార్టీలో చేరేందుకు మానసికంగా సిద్ధమయ్యారని సమాచారం.
ఏపిలో రెండవ ప్రత్యామ్నాయంగా జనసేన..! మార్క్ చూపిస్తున్న గబ్బర్ సింగ్..!
కొత్తగా తెరమీదకు వచ్చిన జనసేనకు ప్రజాబలం కావాలని తామంతా చేరితే పవన్ పార్టీ బలపడుతుందని వారు అనుకుంటున్నారట. దీనితోపాటు వైకాపా టిక్కెట్ లభించదనుకున్నవారు, టిడిపిలో టిక్కెట్ రాని పరిస్థితులున్నవారు జనసేన వైపు చూస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విధంగా అవకాశం కోసం చూస్తున్న వారిలో పవన్ సామాజికవర్గానికి చెందిన వారే అధికంగా ఉన్నారని సమాచారం. ఇటువంటి పరిస్థితుల్లో వైకాపా అధిష్టానం దిద్దుబాటు చర్యలు ప్రారంభించాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.