అమరావతిలో మరో టీడీపీ ప్లాన్ కు చెక్ - బెజవాడలో భారీ అంబేద్కర్ విగ్రహంతో స్మృతి వనానికి గండి..
గతేడాది అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్కొక్కటిగా అమరావతి రెక్కలు కత్తిరించుకుంటూ వస్తున్న జగన్ సర్కారు.. తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. గతంలో అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేసే క్రమంలో టీడీపీ సర్కారు ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టుకు చెక్ పెట్టడంతో పాటు విజయవాడలో కొత్త రాజకీయానికి తెరలేపింది. ఈ విగ్రహం ఏర్పాటుకు ఎంచుకున్న స్ధలం కూడా వివాదాస్పదం కావడంతో మొత్తం రాజకీయం రసకందాయంలో పడింది. బెజవాడలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుతో జగన్ సర్కార్ బహుముఖ వ్యూహానికి తెరలేపినట్లయింది.
అంబేద్కర్ స్మృతివనం ప్రాజెక్టు...
2015లో అమరావతి రాజధాని ప్రకటన తర్వాత అప్పటి చంద్రబాబు ప్రభుత్వం రాజధాని పరిధిలోకి వచ్చే శాఖమూరు వద్ద 125 అడుగుల ఎత్తులో రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ విగ్రహంతో పాటు 20 ఎకరాల్లో స్మృతివనం ఏర్పాటుకు నిర్ణయించింది. రాజధాని ప్రాంతంలో ఉన్న సామాజిక సమీకరణాలు, ఇతరత్రా కారణాలతో చంద్రబాబు ప్రభుత్వం అప్పట్లో ఈ నిర్ణయం తీసుకుంది. కారణాలు ఏవైనా ఈ ప్రాజెక్టు ముందుకు సాగలేదు. అంతలోనే టీడీపీ ఎన్నికల్లో ఓడిపోవడం, వైసీపీ అధికారంలోకి రావడం జరిగిపోయాయి. ఆ తర్వాత స్మృతివనం ప్రాజెక్టు గురించి ఎవరూ మాట్లాడింది లేదు. టీడీపీ కూడా రాజధాని కోసం పోరాడింది కానీ స్మృతివనం గురించి ఏనాడూ మాట్లాడలేదు.
జగన్ మాస్టర్ ప్లాన్....
ఎలాగో రాజధాని అమరావతి నుంచి తరలిపోవడం ఖాయమే. అటువంటప్పుడు టీడీపీ ప్రభుత్వ మానసపుత్రిక అయిన స్మృతివనం ప్రాజెక్టును 200 కోట్లతో కొనసాగించాల్సిన అవసరం తనకేముందని సీఎం జగన్ భావించారు. ఈ ప్రాజెక్టు అనుకున్నట్లుగా పూర్తి చేసినా అదంతా తమ ఘనతేనని టీడీపీ చెప్పుకుంటుంది. అందుకే జగన్ వ్యూహం మార్చారు. ఈ ప్రాజెక్టు స్ధానంలో అంతే స్ధాయిలో అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించారు. చివరికి నగరం నడిబొడ్డున ఉన్న స్వరాజ్ మైదాన్ లో ఈ విగ్రహం ఏర్పాటుకు సై అనేశారు. తాజాగా దీనికి ప్రభుత్వం శంఖుస్ధాపన కూడా చేసేసింది. విగ్రహంతో పాటు స్మారక పార్కును ఏర్పాటు చేయడం ద్వారా అమరావతిలో స్మృతివనం ప్లాన్ కు చెక్ పెట్టినట్లయింది.
వివాదాల స్వరాజ్ మైదాన్....
గతంలో ప్రజాపనులశాఖ ఆధ్వర్యంలో ఉండి ఆ తర్వాత జలవనరులశాఖ పరిధిలోకి వెళ్లిన బందరు రోడ్డులోని స్వరాజ్ మైదాన్ తాజాగా సాంఘిక సంక్షేమశాఖ చేతుల్లోకి వెళ్లింది. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు నిర్ణయం వల్ల వచ్చిన మార్పు ఇది. అయితే అంతకు ముందే నగరం నడిబొడ్డున ఉన్న విలువైన స్ధలమైన స్వరాజ్ మైదాన్ ను ఇతర పనులకు కేటాయించడానికి ప్రయత్నాలు జరిగినప్పుడు స్ధానికుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. దీంతో చంద్రబాబు ప్రభుత్వం సైతం వెనక్కి తగ్గింది. ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నగరంలో మరో చిచ్చురేపేలా కనిపిస్తోంది.
Recommended Video
ఆత్మరక్షణలో టీడీపీ...
భారీ అంబేద్కర్ విగ్రహాన్ని నగరం మధ్యన ఉన్న స్వరాజ్ మైదాన్ లో ఏర్పాటు చేయాలని జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయంపై మిశ్రమ స్పందన వస్తోంది. నగరంలో విలువైన స్ధలమైన స్వరాజ్ మైదాన్ లో ఇప్పటివరకూ తాత్కాలికంగా ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేయడం, కారు డ్రైవింగ్ స్కూళ్లకు తాత్కాలిక ప్రాతిపదికన అద్దెకు ఇవ్వడం వంటి నిర్ణయాలే జరిగాయి. కానీ తొలిసారిగా అంబేద్కర్ విగ్రహం, స్మారక పార్కు ఏర్పాటు చేయాలన్న జగన్ సర్కార్ నిర్ణయంతో ఇక్కడ టీడీపీకి అండగా నిలిచే బలమైన కమ్మ సామాజికవర్గం కూడా మారు మాట్లాడలేని పరిస్ధితి. విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తే బలహీనవర్గాల వ్యతిరేక ముద్ర వేస్తారనే భయంతో టీడీపీ కూడా ఆచితూచి స్పందిస్తోంది. ఓసారి విగ్రహం ఏర్పాటు ప్రారంభమైతే అప్పుడు చూడొచ్చన్న భావన ఆ పార్టీలో వ్యక్తమవుతోంది.