సీఎం జగన్ మరో కీలక నిర్ణయం .. జూనియర్ న్యాయవాదులకు వరం
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో తనదైన దూకుడు కొనసాగించాలని ప్రయత్నం చేస్తున్నారు. గత ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు నిర్ణయం తీసుకున్న జగన్ ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా హామీల అమలుకు కృషి చేస్తున్నారు.
తాజాగా సీఎం జగన్ మరొక కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జూనియర్ న్యాయవాదులందరికి స్టైఫండ్ ఇస్తామని ప్రకటించి వారికి గుడ్ న్యూస్ చెప్పారు .రాష్ట్రంలోని జూనియర్ న్యాయవాదులందరికి కూడా దీపావళి పండుగ సందర్భంగా రూ.5వేలు ఇస్తామని అధికారికంగా ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి.
ఎన్నికల హామీలను నెరవేర్చే క్రమంలో జూనియర్ న్యాయవాదులకు 5000 స్టైఫండ్ ఇస్తామని చెప్పిన జగన్ తాను ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటన జారీ చేసింది. ఇందుకు కొన్ని అర్హతలను కూడా ప్రకటించింది. జూనియర్ న్యాయవాదులు స్టైఫండ్ పొందాలంటే న్యాయశాస్త్రంలో బ్యాచిలర్స్ డిగ్రీ చేసి ఉండాలి.
2016 సంవత్సరం, ఆ తర్వాత డిగ్రీ పూర్తి చేసిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఇక అంతే కాదు దరఖాస్తుదారుని అప్లికేషన్ ఫామ్ తో పాటుగా 15 సంవత్సరాల అనుభవం ఉన్న అడ్వకేట్ తో ధ్రువీకరించిన అఫిడవిట్ కూడా పొందుపరచాలి.
ఇక ఈ పథకాన్ని ఒక కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఇచ్చే అవకాశం ఉంది. 35 సంవత్సరాల లోపు ఉన్న వారికి మాత్రమే ఈ పథకం కింద లబ్ధి చేకూరుతుంది. ఈ జీవో జారీ అయ్యే సమయానికి మూడేళ్ల ప్రాక్టీస్ పూర్తి చేసుకున్నవారు ఈ పథకాన్ని పొందటానికి అనర్హులుగా నిర్ణయించింది. ఇక అంతే కాదు దరఖాస్తుదారులకు ఆధార్ కార్డు ఉండాలి.
వారికి వారి పేరు మీద కారు గాని, మరి ఏ ఇతర నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు. ఇక అన్నిటికంటే ప్రాక్టీస్ చెయ్యని అడ్వకేట్లు ఈ పథకం పొందడానికి అనర్హులని ప్రభుత్వం జూనియర్ న్యాయవాదులకు సంబంధించిన స్టైఫండ్ పథకానికి అర్హతలను రూపొందించింది. మొత్తానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జూనియర్ న్యాయవాదులు సంతోషంగా ఉన్నారు.