త్వరలో జగన్ మరో కుంభకోణం బహిర్గతం...ఇక ప్రజలకు ముఖం చూపించుకోలేరు:కుటుంబరావు
అమరావతి:వైసిపి అధినేత జగన్ కు సంబంధించిన మరో అవినీతి కుంభకోణం త్వరలోనే బహిర్గతం కానుందని ఏపీ ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు వెల్లడించారు. ఆ తర్వాత ఇక ఆయన ప్రజలకు తన ముఖం కూడా చూపించుకోలేని పరిస్థితి వస్తుందని కుటుంబరావు వ్యాఖ్యానించారు.
విజయవాడలోని సీఎం క్యాంప్ ఆఫీసులో జరిగిన విలేకరుల సమావేశంలో కుటుంబరావు మాట్లాడుతూ గతంలోనే తాను వెల్లడించిన ఎస్సార్ ఆయిల్ కుంభకోణం లోనూ బిజెపి బండారం బైటపడనుందని చెప్పారు. ఈ స్కామ్ గురించి ఒక ప్రతిష్ఠాత్మక జాతీయ మ్యాగజైన్లో రెండు వారాల్లోపే ప్రత్యేక కథనం ప్రచురితం కానున్నట్లు కుటుంబరావు వివరించారు.
త్వరలో...జగన్ బండారం
విజయవాడలో ఏపీ ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష నేత జగన్ ను ఆర్థిక ఉగ్రవాదిగా పేర్కొన్నారు. ఆర్థిక ఉగ్రవాదిగా మారిన వైసీపీ అధ్యక్షుడు జగన్ తన కుట్రలన్నీ సొంత రాష్ట్రంపైనే ప్రయోగిస్తున్నారని కుటుంబరావు ఆరోపించారు. అమరావతి బాండ్లకు వచ్చిన స్పందనను భరించలేక జగన్, వైసీపీ నేతలు.. తమసొంత మీడియా ద్వారా రకరకాల దుష్ప్రచారాలు చేస్తున్నారన్నారు. "ఎక్కువ వడ్డీకి బాండ్లు జారీ చేశామంటున్నారు...మేం ఇస్తున్న వడ్డీ కంటే కేవలం అర శాతం తక్కువకు ఎక్కడైనా రుణం ఇప్పిస్తే వారికి ఒకటిన్నర శాతం కమీషన్ కూడా ఇస్తాం"...అని మరోసారి సవాల్ విసిరారు.
Recommended Video
టెంపుల్టన్ కి భూమి...స్కామా?
అమరావతి బాండ్లలో అంతర్జాతీయ సంస్థ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ రూ.1,000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టిందని, జగన్ బృందం దానిపై కూడా ఆరోపణలు చేయడం విడ్డూరమని కుటుంబరావు దుయ్యబట్టారు. "విశాఖలో టెంపుల్టన్ కంపెనీకి ఎపి ప్రభుత్వం తక్కువ రేటుకు భూమి ఇచ్చామని, అందుకే వారు పెట్టుబడి పెట్టారని ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఎక్కడైనా 40 ఎకరాల భూమి తక్కువ ధరకు ఇస్తే రూ. 1000 కోట్లు పెట్టుబడులు పెడతారా?...మాట్లాడేదానికి అర్థం ఉండాలి. వైఎస్ సిఎంగా ఉన్నప్పుడు ఇదే కంపెనీకి హైదరాబాద్లో బాగా తక్కువ ధరకు 15 ఎకరాలు ఇచ్చారు. వాళ్లు ఇస్తే మంచి పని.. మేం ఇస్తే స్కామా"...అని ధ్వజమెత్తారు.
బిజెపి...బండారం కూడా
అమరావతి బాండ్ల వ్యవహారంలో ఒక్క రూపాయి అవినీతి జరిగిందని నిరూపిస్తే 24 గంటల్లో రాజీనామా చేస్తా. ఆరోపణలు చేస్తున్న వారు ఎక్కడైనా ఫిర్యాదు చేసుకోవచ్చు. గతంలోనే తాను చెప్పినట్లుగా ఎస్సార్ అయిల్ కుంభకోణంలో కూడా బిజెపి బండారం బయటపడనుందని, ఒక ప్రతిష్ఠాత్మక జాతీయ మ్యాగజైన్లో ఈ కుంభకోణంపై రెండు వారాల్లోగా కథనం ప్రచురితం కానుందని ఈ సందర్భంగా కుటుంబరావు వెల్లడించారు. జాతీయ స్థాయిలోనూ ఈ అంశంపై పెద్ద ఎత్తున పరిశోధన జరుగుతోందని ఆయన వివరించారు.
అగ్రిగోల్డ్ వివరాలు...హైకోర్టుకు
అగ్రిగోల్డ్ ఆస్తులకు సంబంధించిన బహిరంగ మార్కెట్ విలువ వివరాలను రెండు, మూడు రోజుల్లో హైకోర్టుకు సమర్పించనున్నట్లు కుటుంబరావు వెల్లడించారు. హైకోర్టు పర్యవేక్షణలో జిల్లా స్థాయి కమిటీల నేతృత్వంలో అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం జరగనుంది. దీనికి సంబంధించి గుర్తించిన ఆస్తుల జాబితా, వాటి రిజిస్ట్రేషన్ విలువను ఇప్పటికే హైకోర్టుకు సమర్పించామని...బహిరంగ మార్కెట్ విలువను కూడా అందులో పేర్కొనాలని హైకోర్టు సూచించినందున ఆ వివరాలను అందిస్తామని చెప్పారు. వచ్చే శుక్రవారం మళ్లీ ఈ అంశంపై విచారణ ఉంది. ఈలోపే దానిని కోర్టుకు అందజేస్తామని కుటుంబరావు తెలిపారు.
అత్తసొమ్ము...అల్లుడి దానంలాగా
"అగ్రిగోల్డ్ ఆస్తులన్నింటినీ స్వాధీనం చేసుకుని వాటిని అభివృద్ధి చేసి ఆదాయం వచ్చాక వాటిని బాధితులకు చెల్లిస్తామని జీ గ్రూపునకు చెందిన సుభాష్చంద్ర ఫౌండేషన్ హైకోర్టుకు విన్నవించింది. ఇది అత్త సొమ్ము అల్లుడు దానం చేసిన చందమే...కనీసం బ్యాంకు గ్యారంటీ ఇవ్వడానికి, ఈఎండీ చెల్లించడానికి ఆ సంస్థ ముందుకు రాలేదు...అందుకే ఆ సంస్థ వెనక్కి వెళ్లిపోయింది"...అని కుటుంబరావు చెప్పుకొచ్చారు. ఆస్తులను వేలంలో కొనేవారు దానికి సంబంధించిన చెల్లింపులను చట్టబద్ధమైన నగదు(వైట్ మనీ)చెల్లించాల్సి ఉంటుందని, బయట ఇతరత్రా కొనుగోళ్లలో కొంత బ్లాక్.. కొంత వైట్లో జరుగుతోందని చెప్పారు. అంతా తెలుపులోనే చెల్లింపులు చేయాల్సి రావడం వల్ల అగ్రిగోల్డ్ ఆస్తుల కొనుగోళ్లలో ధర కొంత తగ్గే అవకాశం ఉందని, ఈ అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్తామని వివరించారు. ఆస్తుల విక్రయం పూర్తిగా కోర్టు పర్యవేక్షణలోనే జరుగుతుందని, ప్రభుత్వ సొంత నిర్ణయం అంటూ ఏమీ ఉండదని కుటుంబరావు స్పష్టం చేశారు.