జగన్ అపరిపక్వత: వ్యూహరాహిత్యం, రోజా ఉదంతమే...
ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న ఒంటెద్దు పోకడలే క్రమక్రమంగా ఆ పార్టీ బలహీనపడటానికి కారణమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు
అమరావతి/ హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న ఒంటెద్దు పోకడలే క్రమక్రమంగా ఆ పార్టీ బలహీనపడటానికి కారణమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఫలితాలు మొదలు ఇటీవల హఠాన్మరణం పాలైన భూమా నాగిరెడ్డి ఉదంతం..
అధికార తెలుగుదేశం పార్టీలోకి సొంత పార్టీ నేతల వలస బాట పడుతున్న వైనం.. సొంత పార్టీ ఎమ్మెల్యే ఆర్ కే రోజాపై ఏడాది సస్పెన్షన్ వేటు సమయం ముగిసినా.. మరో ఏడాది ఆమెపై సస్పెన్షన్ వేటేసేందుకు సన్నాహాలు చేస్తున్న అధికార పక్షాన్ని నిలువరించేందుకు ప్రయత్నించాల్సిన ధర్మం వైఎస్ జగన్ది. జగన్ వ్యూహరాహిత్యం పార్టీని అయోమయంలో పడేస్తోందని అంటున్నారు. రోజా సస్పెన్షన్ ఉదంతం ఇందుకు మంచి ఉదాహరణగా చెబుతున్నారు.
గోటితో పోయేదానికి గొడ్డలి దాక.. ఇప్పుడు ఆ పరిమితి కూడా దాటేస్తున్నా.. అదే ఒంటెద్దు పోకడలతో అధికార తెలుగుదేశం పార్టీ ఇష్టారాజ్యంగా ముందుకు సాగేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కారణభూతులవుతున్నారు. వయస్సు రీత్యా.. అనుభవ రాహిత్యం కారణంతో వైఎస్ జగన్ తన రాజకీయ అపరిపక్వతను పదేపదే బయటపెట్టుకుంటున్నారని పరిశీలకులు భావిస్తున్నారు.
క్షమాపణతో పోయే సమస్యపై...
బెజవాడలో కాల్మనీ రాకెట్ కుంభకోణంలో నిందితులకు సీఎం చంద్రబాబు రక్షణ కల్పిస్తున్నారని ఆయనపై అసెంబ్లీ సాక్షిగా అనుచిత విమర్శలు చేసినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్ కే రోజా తొలుత అసెంబ్లీ సమావేశాల వరకు తర్వాత ఏడాది పాటు సస్పెన్షన్ వేటు విధిస్తూ అసెంబ్లీ తీసుకున్న నిర్ణయం ముగిసి ఏడాది దాటింది. తాజాగా తెలుగుదేశం పార్టీ మహిళా ఎమ్మెల్యే అనిత.. తనను దూషించారని ఆరోపిస్తూ సభా సంఘానికి ఫిర్యాదు చేశారన్న సాకుతో మరో ఏడాది సస్పెన్షన్ వేటేసేందుకు రంగం సిద్ధమవుతున్నది. రాజకీయంగా పట్టు విడుపులు ప్రదర్శించాల్సిన అంశంలో మొండిగా వ్యవహరించడంతో పరిస్థితి మొదటికే మోసం వస్తున్నది.
ఏకపక్ష వైఖరితో రోజా సస్పెన్షన్పై
కేవలం అసెంబ్లీ సాక్షిగా ఆర్ కే రోజా క్షమాపణ చెబితే సమస్య పరిష్కారమవుతుంది. కానీ అందుకు ఆర్ కే రోజా సుముఖంగా ఉన్నారా? లేదా? అన్న విషయమై స్పష్టత రాలేదు. ఒకవేళ అందుకు ఆమె సిద్ధంగా లేకపోతే నచ్చజెప్పాల్సిన గురుతర బాధ్యత కూడా విపక్ష నేతదే. సభా సంఘం ఇచ్చిన నివేదికపై అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తనకు గల విచక్షణాధికారాలతో తీసుకునే తుది నిర్ణయంపైనే శాసనసభ సమావేశాలకు ఆర్ కే రోజా హాజరవుతారా? లేదా? అన్న అంశం ఆధారపడి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్తున్నారు
జగన్కు భూమా కుటుంబం అండ
నాడు 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి అండగా నిలిచిన వారిలో భూమా నాగిరెడ్డి - శోభానాగిరెడ్డి కుటుంబం కూడా ఉన్నది. అప్పట్లో అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై వస్తున్న ఆరోపణలను ధీటుగా తిప్పికొట్టిన ఘనత నాగిరెడ్డి, శోభానాగిరెడ్డి దంపతులది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా వ్యవహరించిన శోభా నాగిరెడ్డి 2014 ఎన్నికల ప్రచారం ముగుస్తుండగానే హఠాన్మరణం పాలయ్యారు. ఆ తర్వాత ఆమె తనయ అఖిలప్రియ అసెంబ్లీకి ఎన్నికైనా.. తర్వాత భూమా నాగిరెడ్డిని టీడీపీ వేధించినప్పుడు అండగా నిలువాల్సిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తగిన రీతిలో వ్యవహరించిన దాఖలాలు లేవు.
భూమా దూరమిలా
మరో వైపు భూమా నాగిరెడ్డి తన కూతురునైనా మంత్రిగా చూడాలని ఆకాంక్షించారు. తదనుగుణంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. గమ్మత్తేమిటంటే అనివార్య పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలోనే భూమా నాగిరెడ్డి రాజకీయ ఆరంగ్రేటం ప్రారంభమైందన్న సంగతి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలిసి ఉంటే.. ఇటీవల శోభా నాగిరెడ్డి మాదిరే గుండెపోటుతో హఠాన్మరణం పాలైన భూమా నాగిరెడ్డి అంత్యక్రియలకు ఒకనాటి ఆప్తుడిగా.. అసెంబ్లీలో విపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గైర్హాజరయ్యే వారు కాదు. అంతే కాదు చనిపోయిన వారిపై విమర్శలు చేయరాదన్న విజ్నత విస్మరించి నాగిరెడ్డిపైఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేసి వివాదాస్పదం అయ్యారు. తండ్రి మరణం తర్వాత నాగిరెడ్డిపై జగన్ విమర్శలకు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అసెంబ్లీ సాక్షిగా ధీటుగా సమాధానం ఇచ్చారు. రాజకీయం పరిణతి గల వారైతే ఇప్పుడిప్పుడే పిన్న వయస్సులోనే రాజకీయ ఆరంగ్రేటం చేసిన వారు విమర్శలు చేసే పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి తెచ్చుకునే వారు కాదు
దూరమవుతున్న జగన్ సన్నిహితులు
ఒకప్పుడు అత్యంత సన్నిహితుడిగా ఉన్న భూమా నాగిరెడ్డితోపాటు వైఎస్ జగన్మోహనరెడ్డి సొంత జిల్లా కడపలో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఆయన సోదరుడు నారాయణ రెడ్డి, మరో ఎమ్మెల్యే జయ రాములు తెలుగుదేశం పార్టీలో చేరిపోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత స్వయంక్రుతాపరాధమే తప్ప మరొకటి కాదు. దాని ఫలితంగానే ఏనాడూ ఓటమి ఎరుగని వైఎస్ కుటుంబం తాజా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలిసారి ఓటమి పాలైంది. 1994 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కోట్ల విజయభాస్కర రెడ్డి క్యాబినెట్లో ఎం వీ మైసూరారెడ్డి హోంమంత్రిగా వైఎస్ ప్రత్యర్థిగా వ్యవహరించారు.
టీడీపీ అభ్యర్థికి వైఎస్ రాజారెడ్డి మద్దతు
దీని ఫలితంగా 1994 ఎన్నికల్లో కమలాపురం అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గుండ్లూరి వీర శివారెడ్డికి మద్దతుగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి తండ్రి రాజారెడ్డి ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మైసూరారెడ్డి ఓటమికి కారణమయ్యారు. దీనికి ప్రతిగా 1996 సార్వత్రిక ఎన్నికల్లో కడప లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రత్యర్థులంతా ఏకం అయ్యారు. కందుల రాజమోహనరెడ్డి తనయులు జత కలిశారు. అయినా వైఎస్ తన రాజకీయ చాతుర్యంతో కేవలం ఐదువేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.
పసిగట్టడంలో జగన్ విఫలం...
కానీ 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత క్రమంగా నేతలకు దూరమైన జగన్మోహన్ రెడ్డి.. ప్రత్యర్థి వ్యూహాలను పసిగట్టడంలో విఫలమయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా స్థానిక సంస్థల ప్రతినిధులను చేరదీస్తున్నా భవిష్యత్ పరిణామాలను ఊహించలేకపోయారు. దాని ఫలితంగానే తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి ఓటమి పాలయ్యారు.
పీఏసీ చైర్మన్ నియామకం విషయంలో...
రెండేళ్ల క్రితం ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్గా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నియామకం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పతనానికి నాంది ప్రస్తావనగా మారింది. అందరూ ఊహించినట్లు గానీ, వాస్తవ పరిస్థితుల ప్రకారమైనా నాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ శాసనసభాపక్షం ఉప నేతగా ఉన్న జ్యోతుల నెహ్రూకు ఈ పదవి దక్కాలి. కానీ వాస్తవాలకు విరుద్ధంగా బుగ్గన రాజేంద్రనాథ్కు ‘పీఏసీ' చైర్మన్ అప్పగించడంతో అసంత్రుప్తి వ్యక్తం చేస్తూ తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో..
అంతకుముందు పదేళ్లుగా జగన్మోహనరెడ్డి తండ్రి రాజశేఖర రెడ్డి ఉన్నంత కాలంగా విపక్షానికే పరిమితమైన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వైఎస్ మరణం తర్వాత వ్యూహత్మకంగా అనుసరిస్తున్న రాజకీయం ముందు వైఎస్ జగన్ విలవిలలాడుతున్నారు. రాజకీయ అపరిపక్వతతో సొంత మనుషులుగా భావిస్తున్న వారిని కూడా జగన్మోహన్ రెడ్డి దూరం చేసుకుంటున్నారని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.