కాలికేస్తే మెడకు, మెడకేస్తే కాలికి- కేసీఆర్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న జగన్- నెక్స్ట్ టార్గెట్ అదే
ఒకప్పుడు చంద్రబాబు వ్యతిరేకతే ఆయువుగా చిగురించిన జగన్, కేసీఆర్ స్నేహానికి జల వివాదాలు చెక్ పెట్టేలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కృష్ణాజలాలను పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు తరలించేందుకు ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 203 ఓవైపు కాకరేపుతుండగానే.. కేసీఆర్ చేసిన తాజా సూచన ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసింది. కేసీఆర్ సూచనపై మండిపడుతున్న ఏపీ సర్కార్ తెలంగాణలో అక్రమ ప్రాజెక్టులపై గోదావరి రివర్ బోర్డుకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం మరింత ముదురుతోంది.
జగన్తో దోస్తీ.. పోతిరెడ్డిపాడు జల వివాదం... తన వైఖరేంటో కుండబద్దలు కొట్టిన కేసీఆర్..
పోతిరెడ్డిపాడుపై కేసీఆర్ మౌనంగా ఉంటూనే..
పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు అదనపు నీటిని తరలించేందుకు ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 203పై కారాలూ మిరియాలూ నూరుతున్న తెలంగాణ ప్రభుత్వం... ఈ వ్యవహారాన్ని కృష్ణా రివర్ బోర్డు వద్దే తేల్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. అదే సమయంలో తెలంగాణ నుంచి వస్తున్న అభ్యంతరాల నేపథ్యంలో ఏపీ సర్కార్ చేసిన ప్రతిపాదన కలకలం రేపింది. పోతిరెడ్డిపాడుపై తాము ముందుకెళ్లకుండా ఉండాలంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఆపేయాలని ఏపీ ప్రతిపాదించిందని వార్తలొచ్చాయి. దీనిపై కేసీఆర్ సర్కారు సహజంగానే డిఫెన్స్ లో పడింది.
కృష్ణాకు ప్రత్యామ్నాయంగా గోదావరి- కేసీఆర్
కృష్ణా జలాలలను పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు తరలించుకువెళ్లాలన్న ఏపీ ప్రభుత్వ వ్యూహాలకు కౌంటర్ గా తెలంగాణ సీఎం కేసీఆర్ గోదావరి జలాల రూపంలో ప్రత్యామ్నాయ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. గోదావరి మిగులు జలాలను ఎవరు వాడుకున్నా తమకు అభ్యంతరం లేదని, ఏపీ సర్కార్ రాయలసీమకు వీటిని తరలించుకోవ్చచని కేసీఆర్ నిన్న ఓ సలహా ఇచ్చారు. కృష్ణా జలాలకు ప్రత్యామ్నాయంగా రాయలసీమకు గోదావరి జలాల ప్లాన్ పాతదే అయినా కేసీఆర్ మరోసారి దీన్ని తెరపైకి తీసుకురావడంతో జగన్ సర్కార్ అప్రమత్తమైంది. పోతిరెడ్డిపాడుపై పోరాడేందుకు సిద్ధమైన కేసీఆర్ గోదావరి రూపంలో తమకు ప్రత్యామ్నాయాలు చెప్పడంపై ఏపీ సర్కార్ ఆగ్రహంగా ఉంది.
కేసీఆర్ గోదావరి వ్యూహానికి దాంతోనే చెక్...
రాయలసీమకు కృష్ణా జలాల బదులుగా గోదావరి మిగులు జలాలు వాడుకోవాలన్న కేసీఆర్ ప్రతిపాదన పైకి చూసేందుకు బాగానే ఉన్నా.. అందులో పోతిరెడ్డిపాడును అడ్డుకోవాలన్న వ్యూహమే ఉందని ఏపీ సర్కారు భావిస్తోంది. దీంతో కేసీఆర్ గోదావరి ప్రతిపాదనకు దాని ద్వారానే చెక్ పెట్టాలని నిర్ణయించింది. ప్రస్తుత పరిస్దితుల్లో కాళేశ్వరం, సీతారామసాగర్ వంటి ప్రాజెక్టుల ద్వారా తెలంగాణ ప్రభుత్వం దాదాపు 500 టీఎంసీలకు పైగా నీటిని వాడేసుకుంటోందని అంచనా వేస్తున్న ఏపీ సర్కార్... ముందు వీటిని ఆపాలని రివర్ బోర్డుకే ఫిర్యాదు చేసింది. గతంలోనే తాము వీటిపై కేంద్ర జలసంఘానికి, కేంద్ర ప్రభుత్వానికి, గోదావరి రివర్ బోర్డు టెక్నికల్ కమిటీకి ఫిర్యాదు చేసినట్లు గుర్తు చేసింది. తద్వారా తెలంగాణ సర్కారు మిగులు జలాల పేరిట భారీగా గోదావరి నీటిని వాడేసుకుంటుంటే తాము రాయలసీమకు ఎలా తరలించుకోవాలని ప్రశ్నించినట్లయింది.
పైకి స్నేహం- లోపల కత్తులు దూస్తున్న వైనం...
వెరసి కృష్ణా, గోదావరి జలాలను వాడుకునే విషయంలో ఏపీ ప్రభుత్వంతో వివాదాలు కోరుకోవడం లేదని అటు కేసీఆర్ చెప్తుండగా.. తమ హక్కులనే వాడుకుంటున్నాం కానీ తెలంగాణకు అన్యాయం చేయడం లేదని జగన్ సర్కార్ చెప్తున్నాయి. కానీ తెరవెనుక మాత్రం కృష్ణా, గోదావరి రివర్ బోర్డులకు రెండు ప్రభుత్వాలు చేసుకుంటున్న ఫిర్యాదుల తీరు గమనిస్తే కేసీఆర్-జగన్ మధ్య రాజుకుంటున్న వేడి అర్ధమవుతుంది. పైకి స్నేహితుల్లా ఉంటూనే ఇరు ప్రభుత్వాధినేతలు తెరవెనుక కత్తులు దూసుకుంటున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
Recommended Video
పోరు వెనుక భారీ వ్యూహం దాగుందా ?
ప్రస్తుతం ఏపీ తెలంగాణ ప్రభుత్వాల మధ్య కృష్ణా, గోదావరి జలాల పేరుతో జరుగుతున్న ఈ పోరాటం వెనుక మరో వ్యూహం కూడా ఉండి ఉండొచ్చని ప్రతిపక్షాలు అనుమానిస్తున్నాయి. కరోనా సమయంలో వరుస వివదాలను తెరపైకి తీసుకురావడం ద్వారా తమ ప్రభుత్వాల వైఫల్యాల నుంచి జనం దృష్టిని మరల్చడంతో పాటు మరొకరు లబ్ది పొందకూడదన్న వ్యూహం కూడా దాగి ఉందని ఆరోపిస్తున్నాయి. కృష్ణా, గోదావరి జలాలు, ప్రాజెక్టుల వంటి క్లిష్టమైన వ్యవహారాన్ని తెరపైకి తీసుకురావడం ద్వారా కొన్ని నెలల పాటు దీనిపై చర్చ సాగాలని ఇరు ప్రభుత్వాలు కోరుకుంటున్నాయని, ఇది ఇరు ముఖ్యమంత్రులు కలిసి ఆడుతున్న నాటకమేనని టీడీపీ, బీజేపీ వంటి విపక్షాలు ఆరోపిస్తున్నాయి.