కేంద్రానికి జగన్ ధర్మల్ పవర్ షాక్- సరెండర్ నిర్ణయంతో నిర్మల ఫ్రస్ట్రేషన్- అందుకేనా ఆ వ్యాఖ్యలు..?
ఏపీకి యూనిట్ విద్యుత్ ను రూ.2.70 పైసలకు ఇస్తుంటే జగన్ సర్కారు మాత్రం దాన్ని 9 రూపాయలకు పరిశ్రమలకు ఎలా అమ్ముతుందంటూ కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ గత వారం గగ్గోలు పెట్టారు. దేశవ్యాప్తంగా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పారిశ్రామిక, విద్యుత్ విధానాలున్న తరుణంలో ఏపీ కంటే ఎక్కువగా వసూలు చేస్తున్నా రాష్ట్రాలే లేవా అంటే ఆమె దగ్గర సమాధానం లేదు. మరి ఏపీలోనే ప్రత్యేకంగా ఏదో దారుణం జరిగిపోతున్నట్లు ఆమె ఎందుకు ఆరోపణలు చేశారు. అంటే దాని వెనుక జగన్ సర్కారు విద్యుత్ ఒప్పందాలపై కేంద్రానికి తాజాగా ఇచ్చిన షాకే కారణమనే వాదన వినిపిస్తోంది.
విష వాయువు లీకేజీపై వైఎస్ జగన్ ఆరా: షట్డౌన్ ఆదేశాలు: ఎప్పటికప్పుడు నివేదిక: అవసరమైతే
కేంద్రానికి జగన్ ధర్మల్ షాక్
జవహర్ లాల్ నెహ్రూ జాతీయ సోలార్ మిషన్ కింద ఎన్టీపీసీ నుంచి 1300 మెగావాట్ల సౌర విద్యుత్, 675 మెగావాట్ల ధర్మల్ విద్యుత్ ఏపీ కొనుగోలు చేసేలా గతంలో కేంద్రంతో ఒప్పందం కుదిరింది. దీన్ని ధరతో సంబంధం లేకుండా బండిల్ ప్యాకేజీ రూపంలో కొనుగోలు చేయాల్సిందే. కానీ మూడేళ్లుగా బండిల్ విద్యుత్ ధర మాత్రం సోలాల్ విద్యుత్ తో పోలిస్తే భారీగా పెరిగిపోతోంది. 2019-20లో ధర్మల్ విద్యుత్ కొనుగోలుకు యూనిట్ రూ.5.03 పైసలు అవుతుంటే బండిల్డ్ విద్యుత్ ధర రూ.4.85 పైసలు పడుతోంది. అదే సౌర విద్యుత్ ధర రూ.4.63 పైసలుగా ఉంది. అంటే సౌర విద్యుత్ ధర కంటే బండిల్డ్ విద్యుత్ ధర ఎక్కువగా ఉంది. నిబంధనల ప్రకారం సౌర విద్యుత్ ధర కంటే బండిల్డ్ విద్యుత్ ధర ఎక్కువగా ఉంటే ధర్మల్ విద్యుత్ ను కేంద్రానికి సరెండర్ చేసే అవకాశం ఉంది. సరిగ్గా ఈ పాయింట్ ను జగన్ సర్కారు తెరపైకి తెచ్చింది. దీంతో కేంద్రం ఇరుకునపడింది.
అసలే మిగులు.. జగన్ సరెండర్ షాక్..
దేశవ్యాప్తంగా ఇప్పుడు భారీగా మిగులు విద్యుత్ ఉంది. సౌర విద్యుత్ భారీగా అందుబాటులోకి రావడంతో ధర్మల్ విద్యుత్ డిమాండ్ భారీగా తగ్గిపోయింది. దీంతో ధర్మల్ విద్యుత్ ప్లాంట్లను నిర్వహిస్తున్న రాజకీయ నేతలంతా ఏదో రకంగా కేంద్ర వద్ద లాబీయింగ్ చేసుకుంటూ తమ విద్యుత్ ను రాష్ట్రాలు కొనుగోలు చేసేలా ఒత్తిడి పెంచుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో తాము ఎన్టీపీసీ నుంచి తీసుకుటున్న 675 మెగావాట్ల ధర్మల్ పవర్ ను నిబంధనలు, డిస్కంలపై ఆర్ధిక భారం పేరుతో జగన్ సర్కారు సరెండర్ చేయాలని ప్రతిపాదించడం కేంద్రానికి ఏమాత్రం నచ్చలేదు.
కుడిగి, వల్లూరు ధర్మల్ పవర్ వద్దు..
గతంలో ఎన్టీపీసీతో కుదుర్చుకున్న ఒప్పందానికి అదనంగా కర్నాటకలోని కుడిగి, తమిళనాడులోని వల్లూరు ధర్మల్ ప్లాంట్ల నుంచి బండిల్డ్ విద్యుత్ ను యూనిట్ రూ.10 రూపాయల చొప్పన కొనుగోలు చేయాల్సి వస్తోంది. కుడిగి ప్లాంట్ నుంచి 385 మెగావాట్లు, వల్లూరు నుంచి 88 మెగావాట్ల విద్యుత్ ను తీసుకోవడం ఏపీలో డిస్కంలపై ఆర్ధిక భారం పెంచుతోంది. చౌకగా సౌర విద్యుత్ దొరుకుతుంటే 10 రూపాయలు పెట్టి ఈ రెండు ప్లాంట్ల నుంచి కొనుగేలు చేయాల్సిన అవసరం లేదని ఏపీ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. కాబట్టి రెండు ఒప్పందాలు రద్దు చేసుకుంటామని ప్రతిపాదించింది. దీంతో కేంద్రం మంట నశాలానికి అంటింది.
Recommended Video
నిర్మల వ్యాఖ్యల్లో ఫ్రస్ట్రేషన్....
జగన్ సర్కారు ఆర్ధిక భారమన్న పేరుతో 675 మెగావాట్ల ధర్మల్ విద్యుత్ సరెండర్ చేస్తామనడం, కుడిగి, వల్లూరు ప్లాంట్లతో ఒప్పందాలు రద్దు చేసుకుంటామని ప్రతిపాదించడం కేంద్రానికి మంట పుట్టించింది. అంతిమంగా ఆర్ధిక భారం తగ్గించుకునే పేరుతో ధర్మల్ పవర్ కట్ చేసుకుంటూ పోవడంపై కేంద్ర విద్యుత్ శాఖ నుంచి ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ఫిర్యాదులు అందాయి. దీంతో నేరుగా నిబంధనలకు అనుగుణంగానే ఉన్న ఈ ప్రతిపాదనలను విమర్శించలేక.. ఏపీలో అవినీతి కారణంగానే పరిశ్రమలకు యూనిట్ 9 రూపాయలకు అమ్ముకుంటున్నట్లు జగన్ సర్కారుపై ఆమె విమర్శలు ఎక్కుపెట్టారు. కానీ ఆ విమర్శల్లో పస లేదని ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లాం ఆ తర్వాతే రోజే ఘాటుగా సమాధానం ఇవ్వడంతో ఆమె సైలెంట్ అయిపోయారు.