జగన్ నిర్ణయం చాలా గొప్పది..అయితే వారికి న్యాయం చెయ్యాలి..ఎంపీ సుబ్బిరామిరెడ్డి
రాజధాని అంశంపై ఏపీ సీయం జగన్ చేసిన మూడు రాజధానుల ప్రకటన , జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికపై కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. జీఎన్ రావు కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందించిన విషయాన్ని మీడియా ద్వారా తెలుసుకున్నానని చెప్పారు సుబ్బిరామిరెడ్డి . రాష్ట్రం మధ్యలోనే ఉండాలన్న నిబంధన ఏమి లేదని పేర్కొన్నారు. అలా అయితే దేశ రాజధాని ఢిల్లీ , తెలంగాణా రాజధాని హైదరాబాద్ కూడా ఓ పక్కకే ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.
ఇకఏపీకి విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కావడం ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్కు కావాల్సిన అన్ని వసతులు విశాఖకు ఉన్నాయని, విశాఖ మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు.సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం సరైనదే అయినా రాజధాని రైతులకు అన్యాయం మాత్రం చెయ్యొద్దని ఆయన పేర్కొన్నారు. తెలుగు ప్రజలకు హైదరాబాద్ తర్వాత విశాఖే పెద్ద నగరమని తెలిపారు. అయితే, అమరావతిలో రాజధాని కోసం కోసం 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలని సుబ్బరామిరెడ్డి కోరారు.
తాను తన వ్యక్తిగత అభిప్రాయాలను చెబుతున్నానని ఇవి పార్టీ అభిప్రాయాలు కాదని స్పష్టం చేశారు. విశాఖ పారిశ్రామిక ప్రాంతం కావడంతో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయితే మరింత మంది పారిశ్రామిక వేత్తలు వస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. ఇండస్ట్రియల్ కారిడార్ ఉన్న విశాఖలో రాజధాని ఏర్పాటు మంచి నిర్ణయం అని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్ర మాజీ మంత్రి టి సుబ్బరామి రెడ్డి అమరావతిలో రాజధాని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వానికి రూ .80,000 కోట్లు అవసరమని పేర్కొన్నారు. అయితే, ల్యాండ్ పూలింగ్ పథకంలో రాజధాని అమరావతి నిర్మాణానికి తమ భూములను ఇచ్చిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలని, వారిని బాధపెట్టవద్దు అని ఆయన సూచించారు.